AP Assembly Session: వచ్చే వారంలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నారు. వినాయక చవితి తర్వాత అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. ఈ మేరకు ప్రభుత్వ చీఫ్ విప్ ప్రసాదరాజు ప్రకటన చేశారు. అసెంబ్లీలో చర్చించబోయే అంశాలు ఏమిటి అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టు వ్యవహారంతో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. లండన్ పర్యటన ముగించుకుని రాష్ట్రానికి వచ్చిన ముఖ్యమంత్రి జగన్.. పార్టీ ముఖ్యనేతలు, ఉన్నతాధికారులతో సమావేశం అయ్యారు. రాష్ట్రంలో తాజా పరిణామాలు, శాంతిభద్రతలపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. భవిష్యత్తులో తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు జగన్ మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. 


చంద్రబాబు అరెస్టు, అదుపులోకి తీసుకునే క్రమంలో జరిగిన ప్రతి అంశాన్ని జగన్ దృష్టికి అధికారులు, పార్టీ కీలక నేతలు తీసుకెళ్లారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి, ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి, వైసీపీ పార్టీ కీలక నేతలు వైవీ సుబ్బారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సహా ఇతర నాయకులు పాల్గొన్నారు. ఈ సమయంలో సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చిన చీఫ్ విప్ ప్రసాదరాజు.. వచ్చే వారం అసెంబ్లీ సమావేశాలు  జరగనున్నట్లు చెప్పారు. 


కాగా రేపు (సెప్టెంబర్ 13) ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్లబోతున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ వెళ్లనున్న జగన్.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశం అవుతారని తెలుస్తోంది. చంద్రబాబు అరెస్టు, జమిలీ ఎన్నికలకు కేంద్ర సర్కారు కసరత్తు వేళ.. జగన్ ఢిల్లీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. 


అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్న నేపథ్యంలో.. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు గత ప్రభుత్వ అవినీతిపై అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడాలని సీఎం జగన్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. అలాగే అసెంబ్లీ జరిగినన్ని రోజులు రోజుకో సబ్జెక్టుపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు ముఖ్యమంత్రి. ప్రస్తుతం ప్రభుత్వ పని తీరు.. గత ప్రభుత్వం చేసిన అవినీతిపై అసెంబ్లీ సాక్షిగా ప్రజలకు వివరించాలని నిర్ణయించారు. ఎన్నికలకు ముందు అసెంబ్లీ సమావేశాల్లో కీలక అంశాలపై చర్చ జరపాలని మంత్రులకు, చీఫ్ విప్ లకు సీఎం ఆదేశించినట్లు సమాచారం. వారం రోజులపాటు నిర్వహించాలని అధికార పార్టీ భావించింది. కానీ, ఆ సమావేశాలను వారం నుంచి 10 రోజులకు పొడిగించాలా? లేదా తగ్గించడమా? అనేది ఏపీ ప్రభుత్వం బిజినెస్ అడ్వైజరీ కమిటీ నిర్ణయించనుంది. ఈ భేటీకి ముందే ఏపీ మంత్రివర్గం సమావేశం కానుంది. ఇందులో పలు నిర్ణయాలు తీసుకుంటుంది. సెప్టెంబర్‌ 15న సచివాలయంలో కేబినెట్‌ భేటీ జరగనుంది. సభలో ప్రవేశపెట్టబోయే బిల్లులపై ఈ సమావేశంలో చర్చిస్తారు. 


అలాగే త్వరలోనే పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ ముఖ్య నేతలతో సీఎం జగన్ కీలక సమావేశం నిర్వహించనున్నారు. జనంలో ఉండటంతో పాటు చంద్రబాబు అరెస్టుపై దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని సూచించే అవకాశాలున్నాయి. టీడీపీ చేసే తప్పుడు ప్రచారంపై జనంలో బాగా చెప్పాలని ఆదేశించనున్నారు.