Ap Assembly Session: ఏపీ అసెంబ్లీ సమావేశాలు నాలుగో రోజు ప్రారంభం అయ్యాయి. సమావేశాలు మొదలు అవ్వగానే స్పీకర్ తమ్మినేని సీతారాం సభలో ప్రశ్నోత్తరాలు చేపట్టారు. ఈరోజు ఉన్నత విద్యా మండలి తరఫున జవహార్ లాల్ టెక్నికల్ యూనివర్సిటీస్ సవరణ చట్టం 2021ను మంత్రి బొత్స సత్యనారాయణ సభ ముందు ఉంచనున్నారు. అలాగే ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ 22వ వార్షిక నివేదికను 2021-22 సంవత్సరానికి గాను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి  సభలో అందరి ముందు పెట్టబోతున్నారు. అలాగే నేడు పలు బిల్లులు కూడా సభలోకి రానున్నాయి. ఏపీ సివిల్ కోర్టు సవరణ బిల్లు 2023ను సీఎం జగన్ మోహన్ రెడ్డి సభ ముందు ఉంచి ఆమోదం పొందనున్నారు. నేడు రెండు స్వల్పకాలిక చర్చలకు సభలో సమయం కేటాయించనున్నారు. వ్యవసాయ శాఖలో అభివృద్ధి ప్రభుత్వం తీసుకున్న చర్యలు, ఫైబర్ నెట్ లిమిటెడ్ లో అవినీతిపై సభలో స్వల్పకాలిక చర్చ జరగనుంది. అటు శాసన మండలిలోనూ ప్రభుత్వం పలు బిల్లులను సభ ముందు ఉంచి ఆమోదింపచేసుకోనుంది. శాసన మండలిలో స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లో అవినీతి... ప్రభుత్వం తీసుకున్న చర్యలపై స్వల్ప కాలిక చర్చ జరగనుంది. 


Read Also: Andhra Pradesh: న్యాయమూర్తులపై దూషణలు: హైకోర్టులో ఏజీ కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు