ఏపీ పదో తరగతి ఫలితాలు ఇవాళ విడుదల కానున్నాయి. రిజల్ట్స్ ను  www.bse.ap.gov.in వెబ్​సైట్​ ద్వారా చూసుకోవచ్చు. కరోనా కారణంగా పదో తరగతి పరీక్షలను ప్రభుత్వం రద్దు చేసింది. ఫలితాలను వెల్లడించేందుకు ప్రభుత్వం హైపవర్ కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
50 మార్కులకు పెట్టిన ఫార్మేటివ్‌ పరీక్షలో.. 20 మార్కుల రాత పరీక్షకు 70 శాతం, ఇతర 30 మార్కులకు 30 శాతం వెయిటేజీ ఇవ్వనున్నారు. ఈ ఏడాది పదో తరగతి విద్యార్థులకు 50 మార్కుల చొప్పున రెండు ఫార్మేటివ్‌ పరీక్షలు నిర్వహించారు. ఇందులో రాత పరీక్షకు 20 మార్కులు, ప్రాజెక్టులకు10, నోటు పుస్తకాల రాతకు 10, తరగతిలో పిల్లల భాగస్వామ్యానికి 10 మార్కులు కేటాయించారు.


హైపవర్ కమిటీ సిఫార్సులకు అనుగుణంగా విద్యాశాఖ అధికారులు విద్యార్థులకు గ్రేడ్లు కేటాయించారు. అలాగే మార్కుల మెమోలను www.bse.ap.gov.in వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చని చెప్పారు. కరోనా కారణంగా పదో తరగతి, ఇంటర్‌ పరీక్షలను ఏపీ ప్రభుత్వం రద్దు చేయగా.. ఇటీవలే ఇంటర్‌ పరీక్షా ఫలితాలను అధికారులు విడుదల చేశారు. ఈ పరీక్షల్లో అందరినీ పాస్‌ చేస్తున్నట్లు వెల్లడించారు.


పది పరీక్షలపై  అప్పట్లో చాలా సందిగ్ధత నెలకొన్న విషయం తెలిసిందే. ఈ విషయంపై హైకోర్టులోనూ పిటిషన్ దాఖలైంది. వ్యాక్సినేషన్ తర్వాత నిర్వహిస్తామని అప్పట్లో ప్రభుత్వం తెలిపింది. విద్యార్థుల భవిష్యత్ కు పరీక్షలు ముఖ్యమని ప్రభుత్వం చెప్పుకొచ్చింది.


ఈ ఏడాది జూన్ 7వ తేదీ నుంచి  రాష్ట్రంలో టెన్త్ పరీక్షలు నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇతర రాష్ట్రాలు టెన్త్ పరీక్షలను రద్దు చేశాయి. కొన్ని రాష్ట్రాలు వాయిదా వేశాయి. అయితే  టెన్త్, ఇంటర్ పరీక్షలను షెడ్యూల్ ప్రకారంగా నిర్వహిస్తామని గతంలో ప్రభుత్వం ప్రకటించింది.  రాష్ట్రంలో కరోనా కేసుల తీవ్రత ఎక్కువగా ఉందని... కొన్ని పాఠశాలలను క్వారంటైన్ కేంద్రాలుగా ఏర్పాటు చేశారు. దీంతో పరీక్షల నిర్వహణ కష్టంగా మారింది. ఈ తరుణంలో పరీక్షల నిర్వహణ సాధ్యం కాదనే అభిప్రాయంతో విద్యా శాఖ అధికారుల్లో ఉండేది. అదే విషయాన్ని హైకోర్టుకు తెలిపారు.


పరీక్షలు రద్దు ప్రకటన సందర్భంగా విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో జూలై 31 లోపే పరీక్షలు పూర్తి చేసి ఫలితాలు వెల్లడించడం అసాధ్యం అని చెప్పారు. పరీక్షల నిర్వహణకు, జవాబు పత్రాల మూల్యాంకనానికే 45 రోజులు సమయం పడుతుందని.. అందువల్లే పరీక్షలు రద్దు చేయడానికే మొగ్గు చూపినట్టు మంత్రి సురేష్ అప్పట్లో తెలిపారు.


Also Read: YouTube Shorts: ఇలాంటి వీడియోలు చేస్తే యూట్యూబ్‌లో డబ్బులే డబ్బులు.. కంటెంట్ క్రియేటర్లకు బంపర్ ఆఫర్