Breaking News Live: వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్ స్టా సేవలకు అంతరాయం

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశ వ్యాప్తంగా అక్టోబరు 4న జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతూ ఉంటుంది. తాజా సమాచారం కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.

ABP Desam Last Updated: 04 Oct 2021 09:27 PM
ప్రపంచ వ్యాప్తంగా వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్ స్టా సేవలకు అంతరాయం

ప్రపంచ వ్యాప్తంగా వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ కొద్దిసేపు స్తంభించిపోయాయి. కొన్ని నిమిషాల నుంచి సేవలకు అంతరాయం ఏర్పడింది. వాట్సాప్, ఇన్ స్టా, ఫేస్ బుక్ డౌన్ అవ్వడంతో వినియోగదారులు ఇబ్బంది పడ్డారు. 

ముంబయి డ్రగ్స్ కేసు... ఆర్యన్ ఖాన్ బెయిల్ నిరాకరణ

ముంబయి డ్రగ్ కేసులో నిందితుడిగా ఉన్న షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ కు ముంబై ఎస్పలాండె కోర్టు బెయిల్ నిరాకరించింది. మూడు రోజుల కస్టడీకి అంగీకరించింది. ఆర్యన్ ఖాన్, అర్బజ్ సేత్ మర్చంట్, మున్ మున్ ధామేచా కు అక్టోబర్ 7 వరకు ఎన్సీబీ కస్టడీకి అంగీకరించింది. 


 

18వ తేదీ వరకు వ్యాపారాలు చేసుకోవచ్చు.. గడ్డి అన్నారం ఫ్రూట్ మార్కెట్ తరలింపుపై హైకోర్టు ఆదేశాలు 

గడ్డి అన్నారం ఫ్రూట్ మార్కెట్ లో ఈ నెల 18 వరకు వ్యాపారాలు చేసుకునేందుకు తెలంగాణ హైకోర్టు వ్యాపారులకు అనుమతి ఇచ్చింది. ఈ నెల 4వ తేదీ వరకు యథాతథస్థితిని కొనసాగించాలని హైకోర్టు గతంలోనే ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయంపై విచారణ చేసిన హైకోర్టు 18వ తేదీ వరకు వ్యాపారాలకు అవకాశం కల్పించింది.

హైకోర్టు ముందు దంపతుల ఆత్మహత్యాయత్నం

ఏపీ హైకోర్టు వద్ద గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం ధూళిపాళ్లకు చెందిన దంపతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ధూళిపాళ్ల గ్రామానికి చెందిన భార్యాభర్తలు చీలికోటి దేవేంద్రరావు, చీలికోటి భానుశ్రీల ఇంటి స్థలానికి సంబంధించిన వివాదంలో కొందరు తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ డీజిల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వీరిని గమనించిన ఎస్పీఎఫ్ భద్రతా సిబ్బంది దంపతులను వెంటనే అడ్డుకున్నారు. దంపుతులను అదుపులోకి తీసుకుని తుళ్లూరు పోలీసు స్టేషన్​కు తరలించారు. 

‘మా’ ఎన్నికలతో ఎలాంటి సంబంధం లేదు: ఏపీ మంత్రి పేర్ని నాని

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలతో తమకు ఎలాంటి సంబంధం లేదని ఏపీ మంత్రి పేర్ని నాని అన్నారు. మా ఎన్నికల విషయంలో తమకు ఎలాంటి ఉత్సాహం లేదని సోమవారం మీడియాకు ఆయన తెలిపారు. మా ఎన్నికలతో వైఎస్సార్‌సీపీకి, ఏపీ సీఎం వైఎస్ జగన్‌కుగానీ, ఏపీ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని ఏపీ సమాచార ప్రసారాలశాఖ మంత్రి స్పష్టం చేశారు. 

వైసీపీ నాయకులు లంచాలకు అలవాటు పడ్డారు : వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్

నెల్లూరు జిల్లా కోట మండలంలో వైసీపీ నాయకులు లంచాలకు మరిగారని.. కోవూరు వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కోట పరిధిలో వైసీపీ నాయకులు లంచాలకు అలవాటు పడ్డారని సంచలన ఆరోపణలు చేశారు. దాబా పెట్టుకున్నా, షాపు పెట్టుకున్నా, బిల్డింగ్ కడుతున్నా, లే అవుట్ వేసినా, ఏదైనా ప్రారంభోత్సవాలనికి పిలిచినా లంచాలు అడుగుతున్నారని చెప్పారు. అలాంటి వారి వల్ల పార్టీ పరువు, తమ కుటుంబ పరువు మంటగలిసిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి బతుకు బతకడం ఎందుకని, సూసైడ్ చేసుకుని చనిపోవచ్చు కదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నాయకులైనా, తమ బంధువులైనా, ఎవరైనా సరే.. ఇకపై లంచాలు అడిగితే తాట తీస్తా, తోలు తీసేస్తా, పార్టీనుంచి బయటకు పంపించేస్తానంటూ సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారు. ఇటీవల పరిషత్ ఎన్నికల్లో టీడీపీ కోట మండలంలో సత్తా చాటించింది. 

సింగూరు ప్రాజెక్టు వద్ద ప్రమాదం... సెల్ఫీ దిగుతూ నీటిలో పడిన ఇద్దరు యువకులు

సంగారెడ్డి సింగూరు ప్రాజెక్టు వద్ద ప్రమాదం జరిగింది. సెల్ఫీ దిగుతూ ప్రమాదవశాత్తు ఇద్దరు యువకులు నీటిలో పడిపోయారు. ఒకరు మృతి చెందగా మరోకరిని పర్యాటకులు తాడు సాయంతో రక్షించారు. యువకులు హైదరాబాద్ కు చెందిన వారిగా గుర్తించారు. 

ఎయిడెడ్‌ పాఠశాలల విలీనంపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

ఆంధ్రప్రదేశ్ లో ఎయిడెడ్‌ పాఠశాలల విలీనం ప్రక్రియపై హైకోర్టులో విచారణ జరిగింది. ఎయిడెడ్‌ పాఠశాలల విలీనానికి సంబంధించి ప్రభుత్వం విడుదల చేసిన ఆర్డినెన్స్‌, జీవోలను సవాల్‌ చేస్తూ పలు విద్యాసంస్థలు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాయి. వాటిపై ఇవాళ విచారణ జరిగింది. ఈ నెల 22లోపు అన్ని పిటిషన్లకు కౌంటర్లు దాఖలు చేయాలని ఉన్నత న్యాయస్థానం ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నెల 28 వరకు విద్యా సంస్థలపై ఒత్తిడి చేయొద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

   నెల్లూరులో ప్లాస్టిక్ వ్యతిరేక ఉద్యమం మెుదలుపెట్టిన మంత్రి అనిల్


నెల్లూరులో ప్లాస్టిక్ వ్యతిరేక ఉద్యమాన్ని మొదలు పెట్టారు మంత్రి అనిల్ కుమార్ యాదవ్.  ప్లాస్టిక్ రహిత నగరంగా నెల్లూరుని మార్చేందుకు కఠిన నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఓట్లు వస్తాయా రావా అనే ఉద్దేశాన్ని పక్కనపెట్టి నెల్లూరు అభివృద్ధికోసం కృషిచేస్తున్నట్టు తెలిపారు. వ్యాపారులు కూడా సహకరించాలని, అధికారుల్ని బ్లేమ్ చేయొద్దని చెప్పారు. ప్లాస్టిక్ రహిత నగరంగా నెల్లూరుని మార్చేస్తామన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం, జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు, నగర కార్పొరేషన్ అధికారులతో కలసి ఆయన అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.

సూర్యాపేటలో బస్సు ప్రమాదం.. ప్రయాణికులకు గాయాలు

సూర్యాపేట జిల్లాలోని గరిడేపల్లి మండలం ఎల్బీ నగర్ వద్ద మిర్యాలగూడ - కోదాడ రహదారిపై ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురయింది. బస్సు బ్రేకులు విఫలం కావడంతో రోడ్డు విస్తరణ పనుల్లో డివైడర్‌‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ప్రయాణికులు గాయాలతో బయటపడ్డారు. బస్సు ముందు చక్రాలు ఊడడమే కాకుండా ముందు భాగం మొత్తం ధ్వంసమైంది. ప్రమాద సమయంలో బస్సులో 14 మంది ప్రయాణికులు ఉన్నారు.

నాంపల్లి కోర్టులో ఓటుకు నోటు కేసు విచారణ

నాంపల్లి కోర్టులో సోమవారం ఓటుకు నోటు కేసుపై విచారణ జరిగింది. ఈ విచారణకు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితోపాటు సత్తుపల్లి టీఆర్ఎస్ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య విచారణకు హాజరయ్యారు. ఇదే కేసులో వేం కృష్ణ కీర్తన్, మత్తయ్య, ఉదయ్ సింహా, సెబాస్టియన్ కూడా హాజరైన వారిలో ఉన్నారు. చివరికి ఈ ఓటుకు నోటు కేసు మళ్లీ ఈ నెల 29కి వాయిదా పడింది. కాగా.. ఓటుకు నోటు ఏసీబీ కేసు విచారణ నవంబరు 1కి వాయిదా పడింది.

  వివేకా హత్య కేసు: ఉమాశంకర్ రెడ్డిని పులివెందుల కోర్టులో హాజరుపర్చనున్న సీబీఐ

మాజీ ఎంపీ వివేకా హత్యకేసులో 119వ రోజు సీబీఐ విచారణ జరుగుతోంది. ఉమాశంకర్ రెడ్డిని నార్కో పరీక్షకు అనుమతి ఇవ్వాలని.. కోర్టులో సీబీఐ పిటిషన్‌ వేయగా.. నేడు పులివెందుల కోర్టులో విచారణ జరగనుంది. కడప జైలు నుంచే.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉమాశంకర్ రెడ్డిని హాజరుపరచనున్నట్లు సీబీఐ అధికారులు తెలిపారు.

   ఉద్యోగాలు చేయడం కాదు.. ఉద్యోగాలు సృష్టించాలి

ఉద్యోగం చేయడం కాదు ఉద్యోగాలు సృష్టించే స్థాయికి యువత ఎదగాలని అన్నారు రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి. యువత ఆశయాలే అభివృద్ధికి మెట్లు అని, ఆకాశమే హద్దుగా యువత ఆలోచనలు ఉండాలని ఆకాంక్షించారు. యువత అనుకుంటే అసాధ్యం అనేది ఏమీ లేదని చెప్పారు. జీవితం సవాళ్లమయం అని, ఆ సవాళ్లను దీటుగా ఎదుర్కోవాలని చెప్పారు గౌతమ్ రెడ్డి.  నేషనల్ అప్రెంటిస్షిప్ మేళాలో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తోపాటు మేకపాటి గౌతమ్ పాల్గొన్నారు.

హీరో రామ్‌కి గాయం.. ఆగిన షూటింగ్

సినీ హీరో రామ్‌కి గాయాలయ్యాయి. జిమ్ చేస్తుండగా గాయపడినట్లుగా హీరో రామ్ సామాజిక మాధ్యమాల్లో ప్రకటించారు. వ్యాయామం చేస్తుండగా గాయమైనట్లుగా చెప్పారు. దీంతో సినిమా షూటింగ్ నిలిపివేసినట్లుగా తెలిపారు. మళ్లీ రెట్టించిన ఉత్సాహంతో షూటింగ్‌లో పాల్గొంటానని రామ్ ఇన్‌స్టాలో పోస్టు పెట్టారు.





బంజారాహిల్స్‌లో గుర్తు తెలియని శవం లభ్యం

బంజారాహిల్స్‌ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బంజారాహిల్స్‌ రోడ్‌ నెం.2 ఇందిరానగర్‌ - కృష్ణానగర్‌ మెయిన్‌ రోడ్డులోని గ్రీన్‌ బావర్చి హోటల్‌ వద్ద ఫుట్‌ పాత్‌పై ఓ మృతదేహం పడి ఉన్నట్లుగా పోలీసులకు సమాచారం అందింది. ఘటనా స్థలానికి చేరుకుని చుట్టు పక్కల ఆరా తీసినా ఫలితం లేకపోవడంతో గుర్తు తెలియని మృతదేహం కింద కేసు నమోదు చేసుకున్నారు. ఎవరి ఇంట్లో అయినా కుటుంబ సభ్యులు మిస్ అయి ఉంటే 9490549778 నంబర్‌ను సంప్రదించాలని పోలీసులు తెలిపారు.

చెక్‌ డ్యాంలతో 3.5 లక్షల ఎకరాలకు సాగునీరు: హరీశ్ రావు

తెలంగాణలో కొత్తగా నిర్మించే చెక్‌ డ్యాంలతో 3.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందించనున్నట్లు మంత్రి హరీశ్‌రావు తెలిపారు. చెక్‌ డ్యాంలు, చెరువుల ఆధునీకరణతో సాగు విస్తీర్ణం పెరిగిందని చెప్పారు. చెక్‌డ్యాం నిర్మాణానికి తీసుకుంటున్న చర్యలపై మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. చెక్‌ డ్యాంలు, చెరువుల మరమ్మతులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిదని హరీశ్‌ రావు తెలిపారు.

చెరువుల సుందరీకరణపై అసెంబ్లీలో చర్చ

శాస‌న‌స‌భ‌లో ప్రశ్నోత్తరాలు జరుగుతున్నాయి. హైద‌రాబాద్‌లో చెరువుల సుందరీక‌ర‌ణ‌పై స‌భ్యులు అడిగిన ప్రశ్నల‌కు రాష్ట్ర ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ స‌మాధానం ఇచ్చారు. చెరువుల చుట్టూ వాకింగ్ ట్రాక్, సుంద‌రీక‌ర‌ణ‌, మురుగు కాల్వల మ‌ళ్లింపు చేప‌ట్టామ‌ని మంత్రి తెలిపారు. జీహెచ్ఎంసీ ప‌రిధిలోని 185 చెరువుల‌లో 127 చెరువుల‌ను గుర్తించి అభివృద్ధి చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. అందులో 48 చెరువుల‌ను ఇప్పటికే అభివృద్ధి చేశామ‌ని చెప్పారు. ‘‘ఈ పనుల కోసం రూ.407.3 కోట్లను మంజూరు చేశాం. ఇప్పటికే రూ.218 కోట్లు ఖ‌ర్చు చేశాం. రూ.94.17 కోట్ల అంచ‌నా వ్యయంతో 63 చెరువుల సుంద‌రీక‌ర‌ణ‌ను జీహెచ్ఎంసీ చేప‌ట్టి 48 చెరువుల ప‌నుల‌ను పూర్తి చేసింది. మిగ‌తా 15 చెరువుల ప‌నులు పురోగ‌తిలో ఉన్నాయి. రూ.30.50 కోట్లతో 45 చెరువుల అభివృద్ధి, వ‌ర‌ద వ‌ల్ల దెబ్బతిన్న మ‌ర‌మ్మతులను జీహెచ్ఎంసీ చేప‌ట్టిందని కేటీఆర్ తెలిపారు.

27, 28 తేదీల్లో ఆంధ్ర విజ్ఞాన ఉత్సవం

విజయవాడ, గుంటూరుల్లో ఈనెల 27, 28 తేదీల్లో ఆంధ్ర విజ్ఞాన ఉత్సవం నిర్వహిస్తున్నట్లు ఏపీ ఎడిటర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు వీవీఆర్‌.కృష్ణంరాజు తెలిపారు. ఆదివారం గుంటూరులో ఆయన సహచర నిర్వాహకులతో కలిసి ఉత్సవానికి సంబంధించిన పోస్టరును ఆవిష్కరించారు. రాష్ట్రంలో ఇలాంటి కార్యక్రమం జరగడం ఇదే మొదటిసారని తెలిపారు.

Background

గుంటూరు జిల్లా అమరావతి మండలం ధరణికోట గ్రామానికి చెందిన మోదుగుల దుర్గా ప్రసాద్, గుంటూరుకు చెందిన ఆమడ అరవింద్​లు తన బంధువుల ఇంట్లో జరిగిన శుభకార్యానికి హాజరయ్యారు. ఉదయం నుంచి సరదాగా గడిపిన యువకులు.. సాయంత్రం కృష్ణానదిని చూసేందుకు బుద్ధ విగ్రహం వద్దకు చేరుకున్నారు. స్నానం చేసేందుకు నదిలో దిగారు. ఈత రాకపోవడంతో నది ప్రవాహానికి కొట్టుకుపోయారు. సమాచారం అందుకున్న స్థానికులు, వారి కుటుంబసభ్యులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. స్థానిక జాలర్ల సాయంతో పోలీసులు  నదిలో గాలింపు చేపట్టారు. అరవింద్ మృతదేహం లభ్యం కాగా, దుర్గా ప్రసాద్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.