Breaking News Live: బద్వేల్ ఉపఎన్నికకు టీడీపీ దూరం

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశ వ్యాప్తంగా అక్టోబరు 3న జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతూ ఉంటుంది. తాజా సమాచారం కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.

ABP Desam Last Updated: 03 Oct 2021 06:43 PM
హైదరాబాద్ లో కారు బీభత్సం... బైక్ ను ఢీకొట్టిన కారు, యువతి మృతి

హైదరాబాద్ లో కారు బీభత్సవం సృష్టించింది. సీఐఐ జంక్షన్ లో బైక్ ను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో యువతి మృతి చెందగా, యువకుడికి గాయాలయ్యాయి. 

బద్వేల్ ఉపఎన్నికకు దూరంగా ఉండాలని టీడీపీ నిర్ణయం

కడప జిల్లా బద్వేల్ ఉపఎన్నికలో పోటీచేయకూడదని టీడీపీ నిర్ణయించింది. ఇప్పటికే అభ్యర్థిని ప్రకటించినా.. తాజాగా పోటీకీ దూరంగా ఉండాలని ఆ పార్టీ నిర్ణయించింది. మృతి చెందిన ప్రజాప్రతినిధి కుటుంబం నుంచి అభ్యర్థి పోటీలో ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీడీపీ ప్రకటించింది. 

ముంబయి రేవ్ పార్టీ... పోలీసుల అదుపులో షారుక్ తనయుడు!

ముంబయి క్రూయిజ్ నౌకలో జరిగిన రేవ్​ పార్టీలో పట్టుబడ్డవారిలో బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ కుమారుడు ఉన్నారు. ఈ విషయాన్ని ముంబయి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ప్రకటించింది. 21 గంటల సుదీర్ఘ విచారణ అనంతరం ముగ్గురుని పోలీసులు అరెస్టు చేశారని ఏఎన్ఐ వార్త సంస్థ తెలిపింది. 

చిత్తూరు జిల్లాలో భారీ కుంభకోణం.. నకిలీ పత్రాలతో 2 వేల కోట్లు కాజేసే ప్రయత్నం

చిత్తూరు జిల్లాలో భారీ భూకుంభకోణాన్ని బయటపెట్టారు సీఐడీ అధికారులు. నకిలీ పత్రాలు సృష్టించి 2వేల కోట్లకుపైగా విలువ కలిగిన భూములు కాజేసే ప్రయత్నం చేశారు. భూములను కాజేయడమే కాదు.. వాటిని కోట్ల రూపాయలకు విక్రయించి సులువుగా డబ్బులు సంపాదించాలని ప్రయత్నించారు. 1577ఎకరాల ప్రభుత్వ భూమిని ఆన్ లైన్ లో సొంత పేర్లపై మార్చేశారు. 13 మండలాల్లోని 93సర్వే నెంబర్లలో ఉన్న 2,320 ఎకరాల స్థలం పేర్లను ఒకేరోజు ఆన్ లైన్ లో మార్చేశారు. నిందితులందరూ ఒకే కుటుంబ సభ్యులుగా గుర్తించారు. ప్రధాన నిందితులు మోహన్ గణేష్ పిళ్ళె, మధుసూదన్, రాజన్, కోమల, రమణను అదుపులోకి తీసుకున్నారు. మరో నిందితురాలు ధరణి పరారీలో ఉన్నారు. నిందితుల నుంచి 40 నకిలీ పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. గతంలో ఈ నిందితులకు సహకరించి ఏకంగా ఒక ఎమ్మార్వో సస్పెండ్ కూడా అయ్యింది. ముఠాకు సహకరించిన రెవెన్యూ సిబ్బందిని గుర్తించే పనిలో పడ్డారు సీఐడీ అధికారులు.

హుజూరాబాద్ బీజేపీ అభ్యర్థిగా ఈటల పేరు ప్రకటన

హుజూరాబాద్ ఉప ఎన్నికల కోసం బీజేపీ అభ్యర్థిగా ఈటల రాజేందర్‌ పేరును ఆ పార్టీ అధిష్ఠానం ప్రకటించింది. ఈ మేరకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. హుజూరాబాద్‌తో పాటు మహారాష్ట్రలోని దెగ్లూర్, మిజోరాంలోని తురియాల్ నియోజకవర్గాలకు కూడా అభ్యర్థులను ఖరారు చేశారు.

బెంగాల్‌లో కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు.. సీఎం మమత గెలుపుపై ఉత్కంఠ

పశ్చిమ బెంగాల్‌లో మూడు అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉపఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. ముఖ్యమంత్రి మమత బెనర్జీ భవానీపూర్‌ నుంచి బరిలో ఉన్నారు. దీంతో ఆమె గెలుపుపై అంతటా ఉత్కంఠ నెలకొని ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్‌లో ఆమె ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఈసారి భవానీపూర్‌ నుంచి బరిలో నిలవగా.. ఆమెకు ప్రత్యర్థిగా బీజేపీ నుంచి ప్రియాంక టిబ్రేవాల్‌, సీపీఐ(ఎం) నుంచి శ్రీజిబ్‌ బిశ్వాస్‌ పోటీలో ఉన్నారు. సీఎం కుర్చీని కాపాడుకోవాలంటే.. భవానీపూర్‌ నుంచి గెలవడం ఇప్పుడు మమతకు అత్యంత అవసరం. మిగతా రెండు నియోజకవర్గాలు సంషేర్‌గంజ్‌, జాంగీపూర్‌లోనూ ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది.

హైదరాబాద్: స్పా సెంటర్ ముసుగులో వ్యభిచారం

హైదరాబాద్‌లో గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న మసాజ్‌ సెంటర్‌పై పేట్‌ బషీరాబాద్‌ పోలీసులు ఆకస్మాత్తు తనిఖీలు చేశారు. వీరిలో ఓ నిర్వహకుడితోపాటు ముగ్గురు మహిళలు, ఓ విటుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు. కుత్బుల్లాపుర్‌ వెన్నెలగడ్డ ప్రాంతంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో పర్సుల్‌ బ్యూటీ స్పా, సెలూన్‌ సెంటర్‌ను గత 3 నెలల నుంచి నిర్వహిస్తున్నట్లుగా స్థానికులు చెప్పారు. ఇందులోనే గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం కొనసాగుతున్నట్లుగా పోలీసులు తెలిపారు.

భాగ్యలక్ష్మి ఆలయంలో బండి సంజయ్ పూజలు

హైదరాబాద్‌లోని పాతబస్తీలో బండి సంజయ్ పర్యటిస్తున్నారు. చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో ఆయన పూజలు చేశారు. ప్రజా సంగ్రామ యాత్ర మొదటి విడత విజయవంతంగా పూర్తి కావడంతో మొక్కులు చెల్లించుకొనేందుకు ఆయన ఆలయానికి వచ్చారు. 36 రోజుల పాటు 400 కిలోమీటర్లకు పైబడి బండి సంజయ్ పాదయాత్ర చేశారు. 8 జిల్లాలు, 19 అసెంబ్లీ నియోజకవర్గాలు, 6 పార్లమెంటు నియోజకవర్గాల మీదుగా బండి సంజయ్ పాదయాత్ర సాగింది. ఈ పాదయాత్ర ఆగస్టు 28న ఈ చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం నుంచే ప్రారంభం అయింది.  

Background

సీఎం జగన్​మోహన్ రెడ్డి రెండు రోజుల కడప జిల్లా పర్యటనలో భాగంగా శనివారం సాయంత్రం గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి సాయంత్రం 4.10 గంటలకు కడప విమానాశ్రయానికి చేరుకున్నారు. ఇక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్​లో బయలుదేరి 4.45 గంటలకు ఇడుపులపాయకు వెళ్లారు. హెలిప్యాడ్ వద్ద జిల్లా ఇన్​ఛార్జి మంత్రి ఆదిమూలపు సురేశ్, ఎంపీ అవినాష్ రెడ్డి, చంద్రగిరి, ఆళ్లగడ్డ ఎమ్మెల్యేలు చెవిరెడ్డి బాస్కర్ రెడ్డి, బిజేంద్రనాథ్ రెడ్డి పలువురు నేతలు స్వాగతం పలికారు. ఆదివారం పులివెందులలో వైద్యుడు, తన మామ ఈసీ గంగిరెడ్డి వర్ధంతి కార్యక్రమంలో సీఎం పాల్గొననున్నారు.



 

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.