AP Telangana Today Updates: దళిత బంధుకు కరోనా అడ్డొచ్చిందా..? జీహెచ్ఎంసీ ఎన్నికలకు రాలేదా?: ధర్మపురి అర్వింద్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా దేశవ్యాప్తంగా జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ పేజీ అప్ డేట్ అవుతుంటుంది. బ్రేకింగ్ న్యూస్ కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.

ABP Desam Last Updated: 21 Aug 2021 01:39 PM
ఎగ్జిబిషన్ సోసైటీ కోసం శక్తివంచన లేకుండా పని చేస్తా: హరీశ్ రావు

ఎగ్జిబిషన్ సోసైటీ మరింత ప్రగతి పథంలో నడిచేలా శక్తివంచన లేకుండా పని చేస్తానని తనను కలిసిన సోసైటీ యాజమాన్య కమిటీ ప్రతినిధులతో మంత్రి హరీశ్ రావు అన్నారు. తన బాధ్యత మరింత పెరిగిందన్న ఆయన ప్రతిష్టాత్మక సంస్థను అందరం కలిసి ముందుకు తీసుకెళ్దామని అన్నారు. గత 80 ఏళ్లుగా ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్‌ను ఘనంగా నిర్వహిస్తున్నారని, ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో నుమాయిష్‌ను విశ్వవ్యాప్తంగా గుర్తింపు పొందేలా కలిసి పని చేద్దామని అన్నారు. సోసైటీ ఆధ్వర్యంలో నడిచే విద్యా సంస్థల ద్వారా పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య, వృత్తి నైపుణ్యం మెరుగుపడి ఉపాధి అవకాశాలు పొందేలా చేద్దామని అన్నారు.



కిషన్ రెడ్డి భావోద్వేగ ప్రసంగం

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జన ఆశీర్వాద యాత్ర హైదరాబాద్‌లోని అంబర్‌పేటకు చేరుకుంది. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు. అంబర్ పేటకు చాలా రోజుల తర్వాత వచ్చానని అన్నారు. బిడ్డ తన తల్లి దగ్గరకు వచ్చినట్లు ఉందని కిషన్‌ రెడ్డి అన్నారు. తాను దిల్లీలో ఉన్నానంటే అందుకు కారణం అంబర్‌పేట ప్రజలు, సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ ప్రజలే అని అన్నారు. కేంద్రమంత్రి అయినందుకు తనకు సంతోషం లేదని.. అంబర్‌పేటకు దూరమయ్యానన్న బాధ మాత్రం ఉందని అన్నారు. గతంలో అంబర్ పేట నుంచి కిషన్ రెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికైన సంగతి తెలిసిందే.

కరీంనగర్‌లో అరుదైన ప్రసవం

కరీంనగర్ జిల్లాలో అరుదైన ప్రసవం జరిగింది. నిఖిత అనే గర్భిణీ ఒకే కాన్పులో నలుగురు పిల్లలకు జన్మనిచ్చింది. ప్రసవం అనంతరం నలుగురు పిల్లలు సురక్షితంగానే ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. కాగా, పిల్లల బరువు తక్కువగా ఉండటంతో డాక్టర్లు ఇంక్యుబెటర్‌లో పెట్టారు. గతంలో నిఖిత సోదరి లిఖితకు కూడా ముగ్గురు పిల్లలకు జన్మనివ్వడం విశేషం. ఇక్కడ మరో విచిత్రం ఏంటంటే.. లిఖిత, నిఖిత కూడా కవలలు కావడం విశేషం.

ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడిగా హరీశ్ రావు

ఎగ్జిబిషన్ సోసైటీ అధ్యక్షుడిగా ఆర్థిక మంత్రి హరీశ్ రావును తాము ఎన్నుకున్నట్లుగా ఎగ్జిబిషన్ సోసైటీ  మేనేజ్‌మెంట్ కమిటీ ప్రకటించింది. తమ విన్నపాన్ని మన్నించి అధ్యక్షుడిగా ఉండేందుకు ఒప్పుకున్నందుకు కమిటీ సభ్యులు మంత్రి హరీశ్ రావును ఆయన నివాసంలో కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. అందరం కలిసికట్టుగా పనిచేసి ఎగ్జిబిషన్ సోసైటీని మరింత ముందుకు తీసుకెళదామని అన్నారు.

దళిత బంధుకు కరోనా అడ్డొచ్చిందా..? జీహెచ్ఎంసీ ఎన్నికలకు రాలేదా?: ధర్మపురి అర్వింద్

తెలంగాణలో దళితులకు సమ న్యాయం కల్పించడం లేదని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ విమర్శించారు. రాష్ట్రంలో 75 లక్షలకు పైగా దళితులు ఉన్నారని సాక్షాత్తూ ముఖ్యమంత్రే చెబుతున్నారని.. అలాంటప్పుడు మంత్రి వర్గంలో ఒకే ఒక దళిత మంత్రికి చోటు కల్పించారని విమర్శించారు. కరోనా వల్ల దళిత బంధు ఆపేశారన్న సీఎం కేసీఆర్ మాటలను కూడా అర్వింద్ తప్పు బట్టారు. కరోనా కాలంలోనే జీహెచ్ఎంసీ ఎన్నికలు పెట్టారని, దళిత బంధు ఇచ్చేందుకు అది ఎలా అడ్డొచ్చిందని ప్రశ్నించారు.

బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన కానిస్టేబుల్ సస్పెండ్

గుంటూరు జిల్లాలో బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కానిస్టేబుల్ సస్పెండ్ చేశారు. కొత్తపేట పీఎస్‌లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్న రమేశ్ ఏటీ అగ్రహారంలో 10వ తరగతి బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు.  దీంతో బాలిక తల్లిదండ్రులు దిశ  పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. విచారణ జరిపిన గుంటూరు అర్బన్ ఎస్పీ ఆరీఫ్ హఫీజ్ కానిస్టేబుల్ రమేశ్‌ను సస్పెండ్ చేశారు. 

కాబుల్ ఎయిర్ పోర్టులో భారతీయుల కిడ్నాప్!

అఫ్గానిస్థాన్​ కాబుల్‌ ఎయిర్ పోర్టులో పలువురిని తాలిబన్లు కిడ్నాప్ చేసినట్లు తెలుస్తోంది. తరలింపునకు సిద్ధంగా ఉన్నవారిని అపహరించినట్లు అఫ్గాన్​ మీడియా సంస్థలు ప్రకటించాయి. ఇందులో 150 మందికి పైగా భారతీయులు ఉన్నట్లు సమాచారం. అయితే అఫ్గాన్ మీడియా కథనాలను తాలిబన్​ ప్రతినిధి అహ్మదుల్లా వాసిక్​ఖండించారు. భారతీయులను కిడ్నాప్ చేయలేదని తెలిపింది. 

స్థానిక సంస్థలకు నిధుల విడుదల

గ్రామీణ ప్రాంత స్థానిక సంస్థలకు నిధులు విడుదలయ్యాయి. 15వ ఆర్థిక సంఘం, రాష్ట్ర ప్రభుత్వ మ్యాచింగ్ గ్రాంట్ నిధులు విడుదలయ్యాయి. పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్‌లకు మొత్తం కలిపి రూ.432.49 కోట్ల విడుదలయ్యాయి. గ్రామ పంచాయతీలకు రూ.182.49 కోట్ల విడుదల చేశారు. మండల పరిషత్‌లకు రూ.124.11 కోట్లు, జిల్లా పరిషత్‌లకు రూ.125.95 కోట్ల వచ్చాయి. నిధులు విడుదల చేస్తూ పంచాయతీ రాజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 

కేంద్ర మంత్రి సిగ్గులేకుండా మాట్లాతున్నారు.. ఎర్రబెల్లి కౌంటర్

భువనగిరిలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలపై హైదరాబాద్‌లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కౌంటర్ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఒక రూపాయి కూడా నిధులు ఇవ్వలేదని విమర్శించారు. తెలంగాణ.. కేంద్రానికి కట్టే పన్నుల్లో సగం కూడా ఇవ్వడం లేదని తెలిపారు. కేంద్ర మంత్రిగా ఉండి మీరేం చేశారని ఎర్రబెల్లి ప్రశ్నించారు. మీరేదో చేసినట్లు సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని ఎర్రబెల్లి ఎద్దేవా చేశారు. కేంద్ర మంత్రిగా ఉండి అబద్ధాలు మాట్లాడుతుంటే తామేం మాట్లాడాలని అన్నారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ హామీ ఏమైందని నిలదీశారు. విభజన చట్టంలో ఉన్న బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ వంటి హామీలు కూడా నెరవేర్చలేదని.. పైగా సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. 

టూరిజం స్పాట్లుగా ఆ ప్రదేశాలు: కిషన్ రెడ్డి

దేశంలో పర్యాటక రంగాన్ని పెంచాల్సిన అవసరం కూడా ఉందని కిషన్ రెడ్డి అన్నారు. బతుకమ్మ, గిరిజన పండగలు, సమ్మక్క-సారక్క జాతరలను వచ్చే రెండేళ్లలో టూరిజం స్పాట్‌లుగా చేయనున్నట్లు కిషన్‌ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి భువనగిరి కోటను కూడా అభివృద్ధి చేస్తామని చెప్పారు.

భువనగిరిలో సాగుతున్న కిషన్ రెడ్డి యాత్ర

భువనగిరిలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి జన ఆశీర్వాద యాత్ర కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘తెలంగాణ ప్రజలు మార్పును కోరుకుంటున్నారు. ఈటల రాజేందర్‌ను హుజూరాబాద్‌లో ఓడించడమే టీఆర్ఎస్ అజెండాగా పెట్టుకుంది. సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రులంతా హుజూరాబాద్‌లోనే ఉంటున్నారు. వారి వ్యూహాలు తిప్పికొట్టాలి. హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్‌ను గెలిపించాలి.’’ అని అన్నారు.

నిజామాబాద్: రక్తంతో తడిచిన శిశువు శవం చెత్తబుట్టలో..

నిజామాబాద్‌ నగరంలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. చెత్తకుప్పలో రక్తంతో తడిసి ఉన్న ఓ శిశువు శవంగా కనిపించింది. ఖలీల్​వాడిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రి ఎదుట ఈ దృశ్యం వెలుగుచూసింది. శిశువు వయసు రోజుల వ్యవధి ఉంటుందని అంచనా వేశారు. ఈ ఘటన గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా.. గుర్తు తెలియని వ్యక్తులు అక్కడ పడేసి వెళ్లినట్లుగా భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని పోలీసులు చెప్పారు.

వికారాబాద్ జిల్లాలో స్వల్ప భూకంపం

తెలంగాణ-కర్ణాటక సరిహద్దులో స్వల్ప భూకంపం సంభవించింది. వికారాబాద్ జిల్లాలోనూ పలు గ్రామాల్లో వరుసగా భూమి కంపించింది. దాదాపు 10 సార్లు ప్రకంపనలు వచ్చినట్లుగా స్థానికులు తెలిపారు. దీంతో తాము రాత్రంతా జాగారం చేసినట్లు చెప్పారు. ఇళ్లలో అల్మారాలో ఉన్న సామగ్రి పడిపోతున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి.

వైఎస్ వివేకా హంతుకుల ఆచూకీ చెబితే 5 లక్షలు బహుమతి

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించిన విచారణ 77 రోజులు దాటిన తర్వాత ఈ కేసులో నిందితుల ఆచూకీ తెలిపిన వారికి 5 లక్షల రూపాయల  బహుమతి ఇస్తామని సీబీఐ పత్రికలలో ప్రకటన జారీ చేసింది.  దీంతో ఈ కేసులో సీబీఐ ఇంత వరకూ జరిపిన విచారణలో ఏ కోణంలోనూ తగిన క్లూ దొరకలేదని భావించాల్సివస్తోందని ఈ కేసు పురోగతిని పరిశీలించినవారు చెబుతున్నారు. దీంతో చివరాఖరుకు సీబీఐ ఓ పత్రికా ప్రకటన ఇచ్చుకోవాల్సి వచ్చింది. వివేకా హత్య కేసులో సరైనా సమాచారం ఇచ్చినవారికి రూ.5 లక్షలు బహుమానం ఇస్తామని సీబీఐ పేర్కొంది. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని భరోసా ఇచ్చింది. సాధారణ ప్రజలనుంచి కూడా ఎవరైనా సమాచారం ఇవ్వొచ్చని సూచించింది. ఎస్పీ, డీఎస్పీలకు వివరాలు తెలియజేయాలంటూ వారి ఫోన్ నెంబర్లను కూడా పత్రిక ప్రకటనలో ఇచ్చింది.

యాదాద్రిలో కిషన్ రెడ్డి పూజలు

రెండు రోజులుగా జన ఆశీర్వాద యాత్రలో పాల్గొంటున్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి శనివారం ఉదయం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామి వారికి కేంద్రమంత్రి పూజలు చేశారు. ఆలయానికి వచ్చిన కిషన్ రెడ్డికి అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ప్రత్యేక ఆశీర్వచనం చేశారు. దర్శనం తర్వాత కొండపైన పునర్నిర్మాణం అవుతున్న ప్రధాన ఆలయాన్ని కిషన్ రెడ్డి పరిశీలించారు.

Background

ఏపీలోని నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం ఎపిలగుంట వద్ద శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు-లారీ ఢీకొన్న ఘటనలో ఇద్దరు మరణించారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.  క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.