Kasireddy did not get relief from the High Court : ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కాంలో కర్త, కర్మ , క్రియగా విజయసాయిరెడ్డి ప్రకటించిన కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి చిక్కుల్లో పడ్డారు. ఆయనకు ఇటీవల సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. నోటీసులపై హైకోర్టులో కసిరెడ్డి  పిటిషన్ దాఖలు చేశారు. సిట్ అధికారులుపై తనపై కఠిన చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అయితే అలా ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. దీంతో  సిట్ నోటీసులకు ఆయన స్పంది విచారణకు హాజరు కావాల్సి ఉంది. 

మద్యం స్కాంలో కీలక విషయాలు బయటకు తీసిన   సీఐడీ సిట్                

ఏపీ మద్యం స్కాంలో సైలెంట్‌గా సీఐడీ సిట్ తన పని చేసుకుపోతోందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కీలక పాత్రధారులకు నోటీసులు జారీ చేస్తున్నారని అంటున్నారు.  ఏపీ లిక్కర్ స్కాంలో కర్త, కర్మ, క్రియ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అంటూ విజయసాయిరెడ్డి ప్రకటించారు. ఆయనపై సీఐడీ ఎప్పుడో దృష్టి పెట్టింది. నోటీసులు జారీ చేసింది. ఆయన నోటీసులను తాజాగా హైకోర్టులో సవాల్ చేశారు. తనపై దూకుడైన చర్యలు తీసుకోకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. అలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసి ఆయన పిటిషన్ డిస్మిస్ చేసింది.        

ఐ ప్యాక్ లో పని చేసి జగన్ కు నమ్మకస్తుడిగా మారిన రాజ్ కసిరెడ్డి            కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి. వరంగల్ జిల్లా కు చెందిన వారు. ఐఐటీ ఖరగ్ పూర్ లో చదువుకున్నారు.  ఐ-ప్యాక్ టీంలో  కీలకంగా ఉండేవారు. ఆయన 2019 లో వైసీపీ విజయానికి పని చేశారు. తర్వాత రాజ్ కసిరెడ్డి నాటి సీఎం జగన్ మోహన్ రెడ్డికి అత్యంత ఆప్తుడిగా మారారు. ఐటీ సలహాదారు పదవిని రాజ్ కసిరెడ్డికి  ఇచ్చారు. ఆయనకు వాలంటీర్లు ఇంటింటికి వెళ్లి సేకరించే సమాచారాన్ని ప్రాసెస్ చేసే కంపెనీ కూడా ఉంది.ఇప్పటికే మద్యం స్కాం లో మిథున్ రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ ను కూడా హైకోర్టు డిస్మిస్ చేసింది.   

ఏపీబీసీఎల్ వాసుదేవరెడ్డి అప్రూవర్ గా మారారా ?           

ఏపీబీసీఎల్ మాజీ ఎండీ దొంతిరెడ్డి వాసుదేవరెడ్డి మొత్తం వ్యవహారాలపై రోజుల తరబడి స్టేట్ మెంట్ ఇచ్చారు. ఆయన అప్రూవర్ గా మారారని అంటున్నారు. కోర్టులో  న్యాయమూర్తి ముందు కూడా వాంగ్మూలం ఇచ్చారని చెబుతున్నారు.  దీంతో ఈ స్కాంలో కీలకంగా ఉన్న వారి గుట్టు అంతా బయటకు వస్తుందని టీడీపీ నేతలంటున్నారు. వాసుదేవరెడ్డి  రైల్వే ట్రాఫిక్ సర్వీస్ అధికారి. ఆయనకూడా తెలంగాణకు చెందిన వ్యక్తి.  అయినా వైసీపీ నేతలు ఆయనను తీసుకు వచ్చి కీలకమైన ఏపీబీసీఎల్ ఎండీ పదవి ఇచ్చి స్కాం చేశారన్న ఆరోపణలు ఉన్నాయి.