నూతన విద్యా విధానంలో స్కూళ్ల వర్గీకరణకు, విద్యార్థుల నిష్పత్తికి తగినట్లు టీచర్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్ జగన్ విద్యా శాఖాధికారులను ఆదేశించారు. టీచర్లకున్న అనుభవాన్ని, బోధనలో వారికున్న నైపుణ్యాన్ని వినియోగించుకోవాలని సూచించారు. ఇంగ్లిష్‌ మీడియంలో బోధన అందడం ద్వారా ప్రపంచ స్థాయిలో పోటీకి తగినట్టుగా విద్యార్థులు తయారవుతారని పేర్కొన్నారు. నూతన విద్యా విధానంపై బుధవారం సీఎం క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా విద్యార్థుల సంఖ్యకు తగినట్టుగా టీచర్లను ఉంచడంపై తయారు చేసిన ప్రతిపాదనలను అధికారులు ముఖ్యమంత్రికి అందించారు.




నూతన విద్యా విధానం ద్వారా చిన్ననాటి నుంచే విద్యార్థులకు నైపుణ్యం ఉన్న టీచర్లు అందుబాటులో ఉంటారన్నారు. ఆర్టీఈ నిబంధనలను అనుసరిస్తూనే.. 3వ తరగతి నుంచి విద్యార్థులకు వివిధ సబ్జెక్టుల్లో విషయ నిపుణులైన టీచర్ల ద్వారా చక్కటి బోధన అందించడానికి తగిన సంఖ్యలో టీచర్లను పెట్టేలా అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. తద్వారా సింగిల్‌ టీచర్‌తో నడుస్తున్న స్కూళ్లలో కూడా వర్గీకరణ ద్వారా విద్యార్థుల సంఖ్యకు తగినట్టుగా, సబ్జెక్టులను వేర్వేరు టీచర్లు బోధించే పరిస్థితులు వస్తాయని చెప్పారు. నూతన విద్యా విధానం ద్వారా ఉపాధ్యాయులపై పని భారం కూడా తగ్గుతుందని, అర్హతలున్న అంగన్‌వాడీ టీచర్లకు కూడా ప్రమోషన్‌ ఛానల్‌ ఏర్పడుతుందని సీఎం తెలిపారు. తెలుగును తప్పనిసరి సబ్జెక్ట్‌గా బోధించాలని ఆదేశించారు. నూతన విద్యా విధానం, నాడు –నేడు కోసం మొత్తంగా సుమారు రూ.16 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని వెల్లడించారు. నూతన విద్యావిధానంపై కలెక్టర్లు, జేసీలు, డీఈఓలు, పీడీలకు అవగాహన కల్పించాని, దీనిపై ఓరియెంటేషన్‌ కార్యక్రమాన్ని నిర్వహించడంతోపాటు అందరిలోనూ అవగాహన తీసుకురావాలని స్పష్టం చేశారు. ఈనెల 16న ఉభయగోదావరి జిల్లాల్లో ఏదో ఒకచోట విద్యాకానుక పంపిణీ ప్రారంభించనున్నారు. ఈ సమావేశంలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.    




 
నూతన విద్యావిధానంలో ఆరు రకాలుగా పాఠశాలలు వర్గీకరణ


1.శాటిలైట్‌ పౌండేషన్‌ స్కూల్స్‌ (పీపీ–1, పీపీ–2) 
2.ఫౌండేషన్‌ స్కూల్స్‌ (పీపీ–1, పీపీ–2, 1, 2) 
3.ఫౌండేషన్‌ ప్లస్‌ స్కూల్స్‌ (పీపీ–1 నుంచి 5వ వరగతి వరకు) 
4.ప్రీ హైస్కూల్స్‌ (3 నుంచి 7 లేదా 8వ తరగతి వరకు) 
5.హైస్కూల్స్‌ (3 నుంచి 10వ తరగతి వరకు) 
6.హైస్కూల్‌ ప్లస్‌ (3వ తరగతి నుంచి 12వ తరగతి వరకు) 


పీపీ–1 నుంచి 12వ తరగతి వరకు వర్గీకరణ వల్ల ప్రస్తుతం ఉన్న స్కూళ్లు 44 వేల నుంచి సుమారు 58 వేలు అవుతాయని అధికారులు సీఎంకు వివరించారు. అమ్మఒడి, ఇంగ్లీష్ మీడియం, నాడు-నేడు లాంటి విప్లవాత్మక మార్పులతో క్షేత్రస్థాయిలో గణనీయమైన ఫలితాలొస్తున్నాయని సీఎంకు అధికారులు వివరించారు. స్కూల్స్‌ని ఆరు రకాలుగా వర్గీకరించడం వల్ల పూర్వ ప్రాథమిక విద్య నుంచి 12 వ తరగతి వరకూ ఇప్పుడున్న బడులు 44 వేల నుంచి 58వేలకు పెరుగుతాయని వెల్లడించారు.