Manamitra Digital governance Record: ప్రభుత్వ సేవలు అంటే బాబోయ్ అనుకునే పరిస్థితి ఉండేది. ఆస్తి పన్ను కట్టాలన్నా క్యూలో నిలబడాలి. ఇక ఏదైనా ధృవీకరణ పత్రం కావాలంటే తంటాలు పడాల్సిందే. ఇలాంటి ప్రజల సమస్యలను ఒక్క క్లిక్ తో పరిష్కరించేందుకు ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన సేవ.. మినమిత్ర.  వాట్సాప్ ద్వారా కావాల్సిన సేవలు అందిస్తోంది. 

Continues below advertisement

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన  మనమిత్ర  వాట్సాప్ గవర్నెన్స్ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచనలకు అనుగుణంగా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కేవలం ఏడాది కాలంలోనే ఈ సదుపాయాన్ని వినియోగించుకుంటున్న వారి సంఖ్య  50 లక్షల మార్కును దాటింది. ఇప్పటివరకు సుమారు  2.50 కోట్లకు పైగా లావాదేవీలు , సేవలు ఈ వేదిక ద్వారా విజయవంతంగా పూర్తి అయ్యాయి.  అంటే ఏడాదిలోనే  ఏపీ ప్రజల జీవితాల్లో  మనమిత్ర ఒక విడదీయలేని భాగంగా మారిపోయిందని అర్థం చేసుకోవచ్చు.  

ఒకప్పుడు చిన్న పని కావాలన్నా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు  9552300009  అనే నంబరుకు హాయ్ అనే మెసెజ్ చేస్తే పని పూర్తయిపోతోంది. అందుకే ఈ నెంబర్  ప్రతి ఇంట్లో  ప్రభుత్వ చిరునామాగా మారింది. ఈ నంబరుకు వాట్సాప్‌లో కేవలం 'హాయ్' అని మెసేజ్ పంపితే చాలు.. వెయ్యికి పైగా ప్రభుత్వ సేవలు కళ్లముందు ప్రత్యక్షమవుతాయి. ప్రస్తుతం 900కు పైగా సేవలు అందుబాటులో ఉండగా, ఈ నెలాఖరుకు ఆ సంఖ్య వెయ్యి దాటనుంది. ఆర్టీసీ బస్సు టికెట్ల బుకింగ్ నుంచి మున్సిపల్ పన్నుల చెల్లింపు వరకు, కరెంటు బిల్లుల నుంచి పట్టాదారు పాసుపుస్తకాల డౌన్‌లోడ్ వరకు అన్నీ అరచేతిలోకి వచ్చేశాయి.   

Continues below advertisement

ఈ వ్యవస్థ అన్ని వర్గాల  ప్రజలకు వరప్రదాయినిగా మారింది. ఎక్కడెక్కడో ఉంటున్నవారు కూడా అంటే ఇతర రాష్ట్రాల్లో ఉంటున్న వారు కూడా లక్షలాది మంది ఇప్పుడు తమ సొంత ఊళ్లకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే పన్నులు చెల్లిస్తున్నారు. రెవెన్యూ సేవలు, పోలీస్ ఎఫ్ఐఆర్ స్టేటస్, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు కూడా క్షణాల్లో డౌన్‌లోడ్ చేసుకుంటున్నారు. శ్రీశైలం, విజయవాడ దుర్గమ్మ వంటి ప్రముఖ దేవాలయాల దర్శన టికెట్లు కూడా  మనమిత్ర ద్వారా సులభంగా బుక్ చేసుకోవడం భక్తులకు పెద్ద ఊరటనిస్తోంది.

సాంకేతికతను సామాన్యులకు చేరువ చేయాలనే లక్ష్యంతో దీనిని ఏ ఆధారితంగా రూపొందించారు. టైప్ చేయడం రాని వారు వాయిస్ మెసేజ్ ద్వారా కూడా తమకు కావాల్సిన సేవలను పొందవచ్చు. తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో పనిచేసే ఈ చాట్‌బాట్ పారదర్శకతను పెంచడమే కాకుండా, మధ్యవర్తుల బెడదను పూర్తిగా తొలగించింది. ప్రభుత్వాన్ని ప్రజల వద్దకే తీసుకెళ్లాలి  అన్న ముఖ్యమంత్రి ఆశయం  మనమిత్ర  ద్వారా సాకారమవుతోందని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

డిజిటల్ ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలో మైలురాయిగా నిలిచిన ఈ ప్రాజెక్ట్, దేశంలోని ఇతర రాష్ట్రాలకు కూడా ఆదర్శంగా నిలుస్తోంది. మీరు ఇంకా ఈ సేవలను అందుకోవడం ప్రారంభించకపోతే, వెంటనే 9552300009 నంబరును సేవ్ చేసుకుని హాయ్ అని మెసేజ్ పంపండి.