ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు హీట్ మీద ఉన్నాయి. తెలుగు దేశం పార్టీ నిర్వహిస్తున్న మహానాడుకు పోటీగా ఈ ఏడాది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ వర్గానికి చెందిన నేతలతో సభను ఏర్పాటు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.
తెలుగు దేశం పార్టీ ఏటా మహానాడు కార్యక్రమాన్నినిర్వహించటం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది మహానాడు కార్యక్రమాన్ని రాజమండ్రిలో నిర్వహించేందుకు ప్లాన్ చేసింది. దీంతో తెలుగు దేశం నేతలు ఎన్నికల సమయానికి ముందు జరుగుతున్న మహానాడు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. 
గతేడాది తెలుగుదేశం మహానాడు ప్రకాశం జిల్లాలో జరిగింది. తెలుగు దేశం మహానాడు కార్యక్రమానికి పోటీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు బీసీ బస్సు యాత్రని నిర్వహించారు. విశాఖ నుంచి అనంతపురం వరకు గతేడాది మే 26 నుంచి 29వ తేదీ వరకు సాగిందాయాత్ర. నాలుగు రోజులు పాటు మంత్రులు, బీసీ ప్రజాప్రతినిదులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు బస్సు యాత్రలో పాల్గొన్నారు. 
అదే సమయంలో ముఖ్యమంత్రి జగన్ విదేశీ పర్యటనకు వెళ్ళటం, ఆయన వెళ్తూ వెళ్తూ నేతలకు ప్రత్యేకంగా టాస్క్ ఇచ్చారనే ప్రచారం కూడా జరిగింది. తెలుగు దేశం నిర్వహించిన మూడు రోజుల మహానాడుకు పోటీగా అదనంగా ఒక రోజు పాటు అంటే నాలుగు రోజుల పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టికి చెందిన నేతలు బస్సు యాత్ర నిర్వహించారు.
ఈ ఏడాది పోటీగా ఎస్సీ సమావేశాలు..
తెలుగు దేశం పార్టీ ఈ ఏడాది కూడా మహానాడు కార్యక్రమానికి రెడీ అయ్యింది. అందులో భాగంగానే రాజమండ్రి వేదికగా సమావేశాల నిర్వాహణకు ప్లాన్ చేశారు. ఈ ఏడాది కూడా తెలుగు దేశం మహానాడు జరుగుతున్న తేదీల్లోనే అవసరం అయితే మరో రోజు అదనంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ సీపీ ఎస్సీ నేతలో సమాశానికి ప్లాన్ చేయాలని భావిస్తున్నారు. 
ఇటీవల కాలంలో తెలుగు దేశం అధినేత నారాచంద్రబాబు నాయుడు, తెలుగు దేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ఎస్సీలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర స్దాయిలో వైరల్ గా మారాయి. వాటిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు ట్రోల్ చేస్తున్నారు. ఇదంతా మార్ఫింగ్ చేశారని తెలుగు దేశం నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. 
అతిపెద్ద ఓటు బ్యాంకుగా భావించే ఎస్టీ, ఎస్సీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్నారని, అందులో భాగంగానే అదే వర్గంతో మహానాడు జరిగే మూడు రోజుల పాటు ప్రత్యేకంగా కార్యక్రమాన్ని నిర్వహించాలని భావిస్తున్నారు. జయహో బీసీ కార్యక్రమం, మైనార్టీ సమావేశాలు నిర్వహించిన తరహాలోనే, భారీ ఎత్తున ఈ కార్యక్రమం మహానాడుకు పోటీగా ప్లాన్ చేయాలని చూస్తున్నారు. 
జగన్  పాల్గొనే ఛాన్స్
ఈ ఏడాది ముఖ్యమంత్రి జగన్ కూడా రాష్ట్రంలోనే ఉండబోతున్నారు. ఆయన అనుకున్న వీదేశీ పర్యటన వాయిదా పడింది. ముఖ్యమంత్రి లండన్ షెడ్యూల్ కూడా ఖరారు కాలేదు. ముఖ్యమంత్రి షెడ్యూల్ చూసుకొని , ఆయన్ని కూడా ఎస్సీ వర్గాలతో నిర్వహించే సమావేశానికి ఆహ్వనిస్తే, మరింత పొలిటికల్ మైలేజి వస్తుందని వైసీపీ ప్లాన్. దీంతోపాటు తెలుగు దేశం పార్టీ మహానాడును పూర్తిగా డైవర్ట్ చేసే ఛాన్స్ ఉంటుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. సో ఈ పరిణామాలుపై ఇప్పటికే ఎస్సీ వర్గాలతో నిర్వహించిన సమావేశంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల క్లారిటి ఇచ్చారని కూడా అంటున్నారు. దీంతో త్వరలోనే ఈ కార్యక్రమానికి సంబందించిన పూర్తి షెడ్యూల్,మహానాడుకు పోటీగా ప్రకటించే అవకాశాలు లేకపోలేదని పార్టీలో ప్రచారం జరుగుతోంది.