తాడికొండ శాసన సభ్యురాలు ఉండవల్లి శ్రీదేవి తన పదవికి రాజీనామా చేసి మాట్లాడాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది.  పార్టీ బహిష్కరించిన తరువాత బయటకు వెళ్ళి మాట్లాడటం అర్ధరహితమని ఆ పార్టీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు.


శ్రీదేవిపై వైఎస్ఆర్ సీపీ ఫైర్


తాడికొండ నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున విజయం సాధించిన శాసన సభ్యురాలు ఉండవల్లి శ్రీదేవి తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నిర్వహించిన యువ గళం పాదయాత్రలో పాల్గొన్నారు. యువగళం వేదిక పై అమరావతి రైతులకు మద్దతుగా నిర్వహించిన సభలో కూడా పాల్గొని ఉండవల్లి శ్రీదేవి వైసీపీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు. దీనిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎదురు దాడి చేపట్టింది.  శాసన సభ్యురాలు ఉండవల్లి శ్రీదేవి ఏ పార్టీలోకి అయినా వెళ్లొచ్చని అది ఆమె ఇష్టమని డొక్కా మాణిక్య వరప్రసాదరావు అన్నారు. శ్రీదేవి ఏమి  మాట్లాడినా పర్లేదు, కానీ రాజీనామా చేసి మాట్లాడితే  మంచిదన్నారు. ఆరోపణలు చేసే ముందు ఆలోచించి  శ్రీదేవి  మాట్లాడాలన్నారు.


లోకేష్ యువగళంపై డొక్కా సెటైర్లు 


గుంటూరులో నిర్వహించిన లోకేష్ పాదయాత్రలో నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత డొక్కా మాణిక్య వరప్రసాదరావు అన్నారు. మైనారిటీలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం  ఏమి  చేయలేదని, ఎస్సీ, ఎస్టీలకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయలేదని లోకేష్ అనటం అతని అవివేకమని అన్నారు. లోకేష్ దుర్మార్గం మాట్లాడటం  మానుకోవాలన్నారు. 25 మంది  మంత్రుల్లో 17 మంది బీసి, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలే ఉన్నారని అన్నారు. ప్రస్తుత ప్రభుత్వంలో ఉన్న సామాజిక  న్యాయం ఎప్పుడైనా ఉందా అని ప్రశ్నించారు. లోకేష్ ఈ విషయం ఆలోచించుకోవాలన్నారు. 


అన్ని రాజకీయ పక్షాలకన్నా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ముందున్నారని తెలిపారు. దళితులు, మైనారిటీ, ఎస్సీ, ఎస్టీ బీసీలపై ఎవరు  మాట్లాడినా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మేలు చేసినట్లేనన్నారు. 


తాడికొండలో వైసీపీ నిరసనలు


యువగళం పాదయాత్రలో పాల్గొన్న తాడికొండ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యురాలు ఉండవల్లి శ్రీదేవికి వ్యతిరేకంగా ఆ  వైసీపీ నాయకులు ఆందోళనకు దిగారు. తాడికొండలో నల్లబెలూన్లు ఎగరవేసి, శ్రీదేవికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. శ్రీదేవి తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచిన శ్రీదేవి ఇస్టాను సారంగా విమర్శలు చేయటం, జగన్ పై ఆరోపణలు చేయటం మానుకోవాలని హితవు పలికారు. అధికార పార్టీ నుండి మహిళా శాసన సభ్యురాలుగా గెలుపొందినందుకు, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి శ్రీదేవికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చారని తెలిపారు. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల్లో శాసన సభ్యురాలు శ్రీదేవి క్రాస్ ఓటింగ్ కు పాల్పడి ప్రతిపక్షాలకు అమ్ముడు పోయారని విమర్శించారు. తాడికొండ లో వైసీపీ నేతల నుండి అక్రమంగా వసూళ్లకు పాల్పడ్డారని ఆరోపించారు. పార్టీలో పదవులు, నామినేటెడ్ పదవులు ఇప్పిస్తానని మోసాలకు పాల్పడ్డారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.