YSRCP gives complaint against Balakrsina and Pawan Kalyan - అమరావతి: టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లపై అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర, రాష్ర్ట ఎన్నికల సంఘాలకు ఫిర్యాదు చేసింది. వైసీపీ శాసనసభ్యుడు హఫీజ్ ఖాన్, లీగల్ సెల్ రాష్ర్ట అధ్యక్షుడు మనోహర్ రెడ్డి, వైసీపీ గ్రీవెన్స్ సెల్ ఛైర్మన్ నారాయణమూర్తిలు ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనాకు ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. ఏప్రిల్ 14 వతేదీన తెనాలి నియోజకవర్గంలో జరిగిన జనసేన వారాహి విజయభేరి సభలో జనసేనాని పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను ఉద్దేశించి ఎన్నికల నియమావళికి విరుద్ధంగా చేసిన వ్యాఖ్యలపై తగిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.


ఏప్రిల్ 13న తెలుగుదేశం పార్టీనేత, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కదిరి బహిరంగసభలో పాల్గొన్నారు. ఆ సందర్భంగా బాలయ్య మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఈసీకి ఫిర్యాదు చేశారు. ఇది ఎన్నికల మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ కు విరుధ్దం కాబట్టి బాలకృష్ణపై తగిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు.


ఈనాడు దినపత్రికపై కూడా కేంద్ర, రాష్ర్ట ఎన్నికల సంఘాలకు వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు. సలహాదారులు జగన్ మాయదారి మేతగాళ్లు అనే శీర్షికన వార్త ప్రచురితమైంది. అందులో పేర్కొన్న అంశాలు ఎన్నికల నియమావళికి విరుధ్దంగా ఉన్నాయని సంస్థపై తగిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు.