రాష్ట్రం నుంచి పురందేశ్వరిని తరమికొట్టే వరకు వైసీపీ తరఫున పోరాటం చేస్తానన్నారు వైసీపీ నేత లక్ష్మీపార్వతి. ఎన్టీఆర్  నాణెం  విడుదల  కార్యక్రమానికి ఆమెను ఆహ్వానించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ తనను అధికారికంగా వివాహం చేసుకున్నారని చెప్పుకొచ్చారు. తనను ఇల్లీగల్‌గా పెట్టుకోలేదని తీవ్రంగా మండిపడ్డారు. దీనిపై ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు స్పందించాలని డిమాండ్ చేశారు. 


ఎన్టీఆర్ ఫ్యామిలీలోని సొంత కార్యక్రమం అయితే తనను ఆహ్వానించకపోయినా పట్టించుకునేదాన్ని కాదన్నారు లక్ష్మీపార్వతి. ఇది ప్రభుత్వ కార్యక్రమం అని అన్నారు. ప్రోటోకాల్ ప్రకారం తనను పిలవాలని అన్నారు. ఎన్టీఆర్  భార్యగా  తనకు ఆహ్వాని అందాల్సిందన్నారు. 


ఎన్టీఆర్‌కు వెన్నుపోటు  పొడిచిన  వాళ్ళు  ఈ  కార్యక్రమానికి  హాజరయ్యారని ఆరోపించారు లక్ష్మీపార్వతి. దీనిపై ఆమె అభ్యతరం వ్యక్తం చేశారు. తనను ఎన్టీఆర్  వివాహం   చేసుకున్నారా  లేదా ఎన్టీఆర్  కుటుంబ  సభ్యులు  చెప్పాలన్నారు. తమ వివాహంపై అన్ని  పత్రికలు  రాశాయని గుర్తు చేశారు. ఎన్ని సార్లు  తనను అవమానిస్తారని ప్రశ్నించారు. ఎన్టీఆర్  భార్యను అని బోర్డు కట్టుకుని తిరగాలా అని నిలదీశారు. 


ఢిల్లీ వెళ్లి పురందేశ్వరి, చంద్రబాబు కుట్రలను బీజేపీకి చెబుతానన్నారు లక్ష్మీపార్వతి. బీజేపీలో ఉంటు చంద్రబాబు స్క్రిప్టును పురందేశ్వరి చదువుతున్నారని ఆరోపించారు. అందులో భాగంగానే ఎన్టీఆర్ భార్యగా తనను అవామాన పరుస్తున్నారని మండిపడ్డారు. 


ఎన్టీఆర్‌పై గౌరవంతో ఇన్ని రోజులు ఆ కుటుంబం గురించి ఏం మాట్లాడలేదని ఇకపై మాట్లాడతానని హెచ్చరించారు లక్ష్మీపార్వతి. పురందేశ్వరి, బాలకృష్ణ బాగోతాన్ని బయటపెడతానన్నారు. వాళ్లు ఎక్కడెక్కడ ప్రచారం చేస్తారో ఎక్కడెక్కడ తిరుగుతారో వెళ్లి వాళ్ల నిజస్వరూపం ప్రజలకు తెలియజేస్తానన్నారు.