YSRCP On Waqf Amendment Bill : వక్ఫ్ సవరణ బిల్లును పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్టు వైసీపీ స్పష్టం చేసింది. పార్లమెంట్లో చర్చకు వచ్చిన సందర్భంగా ఈ విషయాన్ని తేల్చి చెప్పింది. బుధవారం లోక్సభలో చర్చకు వచ్చిన సందర్భంగా వైసీపీ తన నిర్ణయాన్ని ప్రకటించింది. ముస్లిం మనోభావాలు పట్టించుకోకుండా నిర్ణయం తీసుకున్నారని వైసీపీ సభ్యులు సభలో ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్లో కూడా టీడీపీ ప్రభుత్వం ముస్లింల హక్కులను కాలరాస్తోందని ఆరోపించారు.
కేంద్రం ప్రతిపాదించిన వక్ఫ్ సవరణ బిల్లు బుధవారం లోక్సభ చర్చ చేపట్టింది. గురువారం రాజ్యసభలో డిస్కషన్ జరిగింది. ఈ రెండు సభల్లో కూడా తన అభిప్రాయాన్ని వైసీఎస్ఆర్సీపీ చెప్పుకొచ్చింది. రెండు సభల్లో బిల్లును పూర్తిగా వ్యతిరేకించింది. కేంద్రం తీసుకొచ్చిన వక్ఫ్ సవరణ బిల్లు పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని అభిప్రాయపడింది.
వక్ఫ్ సవరణ బిల్లు ముస్లింల ప్రాథమిక హక్కులు కాలరాస్తోందని వైఎస్సార్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి రాజ్యసభలో ధ్వజమెత్తారు. కొత్త బిల్లు ప్రకారం వక్ఫ్ బోర్డులో ఇతర మతస్తులకు ఛాన్స్ ఇవ్వడమంటే రాజ్యంగ ఉల్లంఘనేనంటూ మండిపడ్డారు. వార్షిక సహకారం 5 శాతానికి తగ్గించి వారి ఆర్థిక స్వేచ్ఛను దెబ్బ తీసి ఆర్థికంగా కుంగదీస్తున్నారని మండిపడ్డారు. ఈ కారణాల వల్లే ఈ బిల్లును వైసీపీ వ్యతిరేకించిందని తెలిపారు.
ఇది పూర్తిగా భూములకు సంబంధించిన అంశమే కాదని ఇది ముస్లిం మనోభావాలతో ముడిపడిన అంశంగా పేర్కొన్నారు. వాటిని దెబ్బతీసేలా ప్రభుత్వాల చర్యలు ఉండకూడదని అభిప్రాయపడ్డారు. కానీ తమ పార్టీతోపాటు వివిధ ముస్లిం సంస్థలు చెప్పిన సూచనలు కేంద్రం పట్టించుకోలేదని అసహనం వ్యక్తం చేశారు. కేంద్రంలో పరిస్థితి ఇలా ఉంటే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ముస్లింల మనోభావాలు గుర్తించడం లేదన్నారు సుబ్బారెడ్డి. 50 లక్షల మంది ముస్లింల ప్రయోజనాలను, వక్ఫ్ ఆస్తులు కాపడటంలో పూర్తిగా ఫెయిల్ అయ్యారని మండిపడ్డారు.
వక్ఫ్ సవరణ బిల్లు-2025ను రాజ్యసభ గురువారం అర్ధరాత్రి దాటేన తర్వాత ఆమోదించింది. లోక్సభలో దాదాపు 12 గంటల పాటు చర్చిస్తే రాజ్యసభలో దాదాపు 14 గంటలకుపైగా చర్చించారు. రెండు సభల్లో కూడా అర్థరాత్రి వరకు చర్చించారు. ఆ తర్వాత బిల్లును ఆమోదించారు. రాజ్యసభలో జరిగిన ఓటింగ్లో 128 మంది ఎంపీలు అనుకూలంగా ఓటు వేస్తే వ్యతిరేకంగా 95 మంది ఓటు వేశారు. ఇప్పుడు రెండు సభల్లో కూడా బిల్లుకు ఆమోదం లభించడంతో దీన్ని రాష్ట్రపతి ఆమోదానికి పంపించనున్నారు. రాష్ట్రపతి ఆమోదం పొందిన తర్వాత చట్టంగా మారనుంది.