ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ ఛైర్‌ పర్సన్‌ వాసిరెడ్డి పద్మపై తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి భజనపై ఉన్న ఆసక్తి, ఆమె నిర్వహించాల్సిన బాధ్యతలపై లేదు అని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో మహిళలు, బాలికలపై నిత్యం ఎన్నో దారుణాలు జరుగుతున్నా పట్టించుకోని మహిళా కమిషన్ కేవలం చంద్రబాబుకు, పవన్ కళ్యాణ్ (Janasena Chief Pawan Kalyan) కు నోటీసులు ఇవ్వడంపై మాత్రం ఆసక్తి ఉందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న దారుణాలపై తాము ఓ పుస్తకం కూడా ఇచ్చామని, వాటిలో పేర్కొన్న ఏ ఘటనలోనూ కేసులు నమోదు చేయలేదని విమర్శించారు.


వాసిరెడ్డి పద్మకు ఇప్పటికీ జగన్ భజన పై ఉన్న ఆసక్తి, మహిళా చైర్మన్ గా తన బాధ్యతలపై లేదన్నారు వంగలపూడి అనిత (Vangalapudi Anitha). ఏపీ మాజీ సీఎం చంద్రబాబుకు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కి నోటీసులు ఇవ్వాలన్న ఆతృత, రాష్ట్రంలో స్త్రీలపై ఎన్నో అఘాయిత్యాలు జరుగుతున్నా స్పందించడానికి, చర్యలు తీసుకోవడానికి లేదని విమర్శించారు. 


ఫిర్యాదుల పుస్తకం ఇస్తే నో రెస్పాన్స్.. కానీ! 
గత మూడేళ్లలో మహిళలపై, ఆడపిల్లలపై జరిగిన అఘాయిత్యాల వివరాలతో స్వయంగా తాము వెళ్ళి ఒక పుస్తకం ఇచ్చామని గుర్తుచేశారు అనిత. అందులో 1500 వరకూ ఘటనలు ఉన్నా, వాసిరెడ్డి పద్మ ఆ ఫిర్యాదు ఆధారంగా ఒక్కరికి కూడా ఒక్క నోటీసు కూడా ఇవ్వలేదన్నారు. పవన్ కళ్యాణ్ కు నోటీసులు ఇచ్చిన తరువాత పలు ఘటనలు జరిగాయి.. పవన్ కళ్యాణ్ గారికి నోటీసులు ఇవ్వడానికి హడావిడిగా స్పందించిన వాసిరెడ్డి పద్మకు గన్నవరంలో యువతిపై గంజాయి బ్యాచ్ సామూహిక అత్యాచార యత్నం ఘటనలో గానీ, జంగాలపల్లె విద్యార్థిని అనుమానాస్పద మృతి విషయంలో ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు.






జగన్ కోసమైతేనే ఫిర్యాదులు, స్పందన 
భారతి రెడ్డి విషయంలో ఓ సోషల్ మీడియా పోస్ట్ పై రాత్రి పూట డీజీపీ ఆఫీస్ కు పరుగెత్తి ఫిర్యాదులు చేసిన వాసిరెడ్డి పద్మ.. రాష్ట్రంలో జరుగుతున్న ఇతర ఘోరమైన ఘటనలపై కనీసం మాట్లాడారా? అని ప్రశ్నించారు. సీఎం జగన్ రెడ్డి కోసం అయితే మాత్రం అర్ధరాత్రి అయినా స్పందిస్తారు, ఎవరికైనా నోటీసులు ఇస్తారు కానీ సామాన్య మహిళలు, బాలికలకు అన్యాయం జరిగితే మాత్రం స్పందించరని వంగలపూడి అనిత విమర్శించారు.

తాను ఎవరికీ అన్యాయం చేయలేదని, మీరు కూడా సెట్ అవ్వకపోతే.. కావాలంటే మూడు పెళ్లిళ్లు చేసుకోండని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఒక్క పెళ్లి చేసుకుని, మీలాగా 20 స్టెఫ్నీలు మెయింటెన్ చేయడం లేదు సన్నాసుల్లారా అంటూ ఇటీవల పవన్ ఉద్వేగభరితంగా ప్రసంగించారు. మహిళల్ని కించపరచడంతో పాటు మూడు పెళ్లిళ్లు చేసుకోవాలని చేసిన కామెంట్లపై జనసేనానికి ఏపీ మహిళా కమిషన్ నోటీసులు ఇచ్చింది. పవన్ తన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలని నోటీసులలో సూచించారు.