Chandra Babu: ఎన్నికల హామీలను నెరవేర్చేందుకు టీడీపీ ప్రభుత్వం (TDP Govt) అడుగులు వేస్తోంది. తాము అధికారంలోకి వస్తే రూ.4 వేల పింఛను (Pension Kanuka) పెంపును ఏప్రిల్‌ నుంచే అమలు చేస్తామని టీడీపీ, జనసేనలు ఉమ్మడి మ్యానిఫెస్టో (TDP Janasena Manifesto)లో ప్రకటించాయి. అలాగే దివ్యాంగుల పెన్షన్‌ను రూ.6 వేలకు పెంచుతామని హామీ ఇచ్చాయి. ప్రజలు ఇచ్చిన అఖండ విజయంతో టీడీపీ కూటమి ప్రభుత్వం హామీల అమలుపై కసరత్తు చేస్తోంది. పింఛను జులై 1వ పెంచిన పింఛన్ల సొమ్ము అందించేందుకు అధికారులు చర్యలు ప్రారంభించారు. 


జులై ఒక్క నెలకే రూ.4,400 కోట్లు అవసరం
రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 65.30 లక్షల మంది పింఛను లబ్ధిదారులు ఉన్నారు. వీరికి పెన్షన్ల పంపిణీకి నెలకు రూ.1,939 కోట్లు ఖర్చు చేస్తోంది. ఏప్రిల్‌ నుంచే రూ.4 వేల పింఛను పెంపు అమలు చేస్తే ఒక్కొక్కరికి రూ.7 వేలు ఇవ్వాల్సి ఉంది. ఇందులో జులై 1న ఇచ్చే పింఛను రూ.4 వేలతో పాటు ఏప్రిల్‌ నుంచి జూన్ వరకు నెలకు రూ.వెయ్యి చొప్పున అదనంగా రూ.3 వేలు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే దివ్యాంగులకు రూ.6 వేల పింఛను ఇవ్వనున్నారు. వీరందరికి కొత్త, పెంచిన పెన్షన్ మొత్తంతో కలిపితే జులై 1న పంపిణీ చేయడానికి రూ.4,400 కోట్లు అవుతుందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఆగస్టు నుంచి నెలకు రూ.2,800 కోట్లు వ్యయం అవుతుందని అధికార వర్గాలు తెలిపాయి.  


దివ్యాంగుల పెన్షన్ పెంపు
ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగ పింఛనుదారులు దాదాపు 8 లక్షల మందికి పైగా ఉన్నారు. వీరందరికి ప్రస్తుతం రూ.3 వేలు పింఛను వస్తోంది. దీనిని రూ.6 వేలకు పెంచుతామని కూటమి నేతలు, ఎన్నికల ప్రచారం, మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చారు. అంతేకాకుండా పూర్తిస్థాయిలో వైకల్యానికి గురైన వారికి నెలకు రూ.15 వేలు, కిడ్నీ రోగులు, తలసేమియా వంటి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు నెలకు రూ.10 వేల పింఛను అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రంలో ఆయా కేటగిరీల వారు ఎంతమంది ఉన్నారనే వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. 


వారికి 50 ఏళ్లకే పింఛన్ 
టీడీపీ కూటమి రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారీటీలకు 50 ఏళ్లకే పింఛన్ అమలు చేస్తామని ఆయా పార్టీల ఉమ్మడి మ్యానిఫెస్టోలో ప్రకటించారు. ప్రస్తుతం ఆయా సామాజిక వర్గాల్లో 50 ఏళ్లు పైబడిన వారు ఎంత మంది ఉన్నారు? వారిలో ఇప్పటికే పింఛను పొందుతున్న వారు ఎంత మంది ఉన్నారనే వివరాలను సమీకరిస్తున్నారు.