ఎన్నికలు వస్తున్న వేళ గుంటనక్కలు ఏకమవుతున్నాయన్నారు ప్రభుత్వ సలహాదారు సజ్జలరామకృష్ణారెడ్డి. తెలుగు దేశం, జనసేన పార్టీని ఉద్దేశించిన ఆయన ఈ కామెంట్స్ చేశారు. ఆర్కెస్ట్రా పెట్టుకొని పగటి వేషగాడిలా, పిట్టలదొరలా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు.


జగన్‌ ప్రభుత‌్వం నాలుగేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో సంబరాలను నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ప్రభుత్వ సలహాదారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టి ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృరెడ్డి మాట్లాడారు. చంద్రబాబు వైఖరిపై సజ్జల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు హయాంలో అమలు చేసిన పథకాలను వైసీపీ రద్దు చేసిందని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఎలాంటి పథకాలు చంద్రబాబు అమలు చేశారు, వాటిలో ఏం రద్దు చేశామో చెప్పాలన్నారు. అన్నా క్యాంటీన్‌ను, చంద్రన్నకానుకలపై డప్పు కట్టుకోవటం మినహా చేసిందేమీ లేదన్నారు.


పదేళ్ళు ప్రజల్లో తిరిగిన జగన్...
ప్రజానేత జగన్ మోహన్ రెడ్డి పదేళ్ళపాటు ప్రజల్లో తిరిగారు కాబట్టే ఆయన్ను నమ్మి జనం అధికారం కట్టబెట్టారని అన్నారు సజ్జల. ఎన్నికలు ఎప్పడు వచ్చినా ప్రజలు జగన్‌కు మాత్రమే మద్దతు ఇవ్వటం వెనుక కూడ ఇదే కారణమని తెలిపారు. కొత్తగా భ్రమలు కల్పించేందుకు చంద్రబాబు ప్రయత్నాలు సాగిస్తున్నారని సజ్జల ఆరోపించారు. పొత్తులు లేకుంటే పాలిటిక్స్ లేవనే కలర్ ఇస్తున్నారని వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో తన పాచికలు పారేందుకు చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలను తిప్పుకొట్టాలని ఆయన క్యాడర్ కు పిలుపునిచ్చారు..


బీ అలర్ట్...క్యాడర్ కు సజ్జల సూచన...


ప్రస్తుత రాజకీయాల్లో చాలా అలర్ట్‌గా ఉండాల్సిన పరిస్థితి ఉందని క్యాడర్‌కు సజ్జల సూచించారు. ఏ మాత్రం ఏమరు పాటుగా ఉన్నా వెన్నుపోట్లు, కత్తిపోట్లు ఉంటాయని అన్నారు. ప్రజలు ఆశలు పెట్టుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ సర్కార్‌ను కుట్రలతో కూల్చేందుకు జరుగుతున్న ప్రయత్నాలను అడ్డుకుంటామని స్పష్టం చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు మరో మూడు నుంచి నాలుగు సంవత్సరాల సమయం పడుతుందన్నారు. అప్పటి వరకు అంతా కలసిపని చేయాలని సజ్జల పిలుపునిచ్చారు. చరిత్ర కూడా అవకాశం ఇచ్చిందని, వచ్చే ఎన్నికల్లో 175 టార్గెట్‌ను రీచ్ అవ్వటానిక అవసరమైన అన్ని వనరులను సద్వినియోగం చేసుకోవాలని క్యాడర్‌కు సూచించారు.


అలా చేయటం చంద్రబాబుకు సాధ్యం కాదు: ఉమారెడ్డి
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన శ్రేణులంతా సమైఖ్యంగా పని చేసి మరోసారి పార్టీని అధికారంలోకి తీసుకురావాలని సూచించారు సీనియర్ నేత ఉమారెడ్డి వెంకటేశ్వర్లు. చరిత్రలో ఏ నాయకుడికి రానంత ప్రజాదరణ జగన్‌కు వచ్చిందని అన్నారు. ఈ రాష్ట్రం మూడు పువ్వులు ఆరుకాయలుగా విరాజిల్లుతుందనే నమ్మకంతోనే జగన్‌కు నాయకత్వాన్ని అప్పగించారని అన్నారు. ఎన్నికల మేనిఫెస్టో ద్వారా ప్రజల్లోకి వెళ్ళి ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో అమలు చేసిన ఘనత జగన్‌కు దక్కిందని తెలిపారు. ఇలాంటి పాలన మరలా రావాలనే ప్రజలు ఎదురు చేస్తున్నారని తెలిపారు. మేనిఫెస్టోను అమలు చేశారు, కాబట్టే జగన్ సక్సెస్‌ఫుల్ లీడర్ అయ్యారని అన్నారు. గ్రామ స్థాయి నుంచి అన్ని వర్గాలను కలుపుకొని రెండే రెండు పేజిల్లో మేనిఫెస్టో ఇచ్చి ప్రజల నమ్మకాన్ని దక్కించుకోవటం ఆషామాషీ వ్యవహరం కాదన్నారు. 98.5 శాతం పనులు పూర్తి చాశామని ధీమాగా చెప్పలగలమని, అయితే జగన్ ఇచ్చిన హామీలను అమలు చేయటం చంద్రబాబుకు సాధ్యం కాదని ఉమారెడ్డి అభిప్రాయపడ్డారు.