ఏపీ ప్రభుత్వం చేపట్టిన పథకాలు తమకు అందడం లేదని చెప్పడంతో.. ఉద్దేశపూర్వకంగా తమపై కేసులు బనాయిస్తున్నారని టీడీపీ సానుభూతిపరులు చెబుతున్నారు. పథకాలు అందడం లేదన్నందుకు ఎమ్మెల్యే పరుషంగా మాట్లాడటంతో పాటు చేతిలో ఉన్న పుస్తకాన్ని వారిపైకి విసిరికొట్టడం పరిస్థితి ఏంటన్నది తెలుపుతోంది. తమపై ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదు చేసి రాత్రంతా జైల్లో ఉంచారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం లింగంగుంటలో జరిగిన ఘటన వివరాలిలా ఉన్నాయి.


పథకాలు అందడం లేదని ఎమ్మెల్యేతో వాదన 
‘గడప గడపకూ మన ప్రభుత్వం’లో భాగంగా సంతనూతలపాడు ఎమ్మెల్యే టీజేఆర్‌ సుధాకర్‌బాబు... లింగంగుంట పంచాయతీ పరిధి బెజవాడవారిపాలెంలో శనివారం రాత్రి 9 గంటల ప్రాంతంలో పర్యటించారు. ఆటోడ్రైవర్‌ చల్లా వెంకటేశ్వర్లు ఇంటికి వెళ్లిన ఎమ్మెల్యే సుధాకర్ బాబు గత ప్రభుత్వంలో ప్రజలకు ఏమీ అందలేదని, వైసీపీ ప్రభుత్వంలో పేదలకు పథకాలు పూర్తి స్థాయిలో అమలుచేశామన్నారు. అయితే టీడీపీ సానుభూతిపరుడైన వెంకటేశ్వర్లు ఎమ్మెల్యే మాటలకు అభ్యంతరం తెలిపాడు. 


గత ప్రభుత్వంలో అన్ని పథకాలు తమకు అందాయని, ప్రస్తుతం ఏమీ రావడం లేదని చెప్పాడు. వెంకటేశ్వర్లు మాటలు విన్న ఎమ్మెల్యే సుధాకర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంకటేశ్వర్లుతో మాటామాటా పెరగడంతో ఎమ్మెల్యే సుధాకర్ బాబు సహనం కోల్పోయి తన చేతిలో ఉన్న పుస్తకాన్ని వారి మీదకు విసిరికొట్టారు. తమ ఇంటికి వచ్చి ఇలా చేయడం ఏంటని వెంకటేశ్వర్లు కుటుంబసభ్యులు నిలదీయడంతో ఎమ్మెల్యే అక్కడి నుంచి వెళ్లిపోయారు. 
ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదు, పీఎస్‌కు తరలింపు
వెంకటేశ్వర్లు, ఆయన సోదరుడు విజయ భాస్కర్‌ తనను కులం పేరుతో దూషించారంటూ మేళం శ్రీకాంత్‌ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారిపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేశారు. వెంకటేశ్వర్లును, విజయ భాస్కర్‌ను పోలీసులు తీసుకెళ్లి, రాత్రంతా స్టేషన్‌లో ఉంచారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న టీడీపీ నేతలు ఆదివారం ఉదయం పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ కేసులపై ఇంటి వద్ద విచారణ జరపాలి కానీ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లాల్సిన అవసరం ఏముందని నిలదీశారు. ప్రభుత్వ కార్యక్రమం  ‘గడప గడపకూ...’ జరుగుతున్నందున ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసేందుకు వారిని స్టేషన్ కు తరలించామని ఎస్సై శ్రీరాం తెలిపారు.  మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో వెంకటేశ్వర్లును, విజయ భాస్కర్‌ను స్టేషన్ నుంచి విడిచిపెట్టారు.


చేయి చేసుకున్నారని బాధితుడు ఆరోపణ
ప్రభుత్వ పథకాలు అందడం లేదని చెబితే మాకు సహాయం చేయడానికి బదులుగా ఎమ్మెల్యే మాపై ఎదురుదాడికి దిగడం న్యాయం కాదన్నారు. ఆటో నడుపుతూ జీవనం సాగించే తనపై ఎమ్మెల్యే చేయి చేసుకున్నారని, ఈ విషయాన్ని ప్రశ్నిస్తే ఎస్సీ, ఎస్టీ కేసులు బనాయించారని వెంకటేశ్వర్లు ఆరోపించాడు.