TDP Vs YSRCP: పల్నాడు జిల్లాలో మళ్లీ ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. గత ఎన్నికల వేళ ఈ జిల్లా ఎంత సమస్యాత్మకంగా నిలిచిందో అందరికీ తెలిసిందే. తాజాగా టీడీపీ - వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. వైసీపీ నేతలపై టీడీపీ శ్రేణులు దాడికి దిగినట్లుగా చెబుతున్నారు. కర్రలతో వైఎస్ఆర్ సీపీ నేతల కార్లపై దాడికి దిగారు. ఆ దాడుల్లో ఓ కారు అద్దాలు కూడా ధ్వంసం అయ్యాయి. 14వ మైలు దగ్గర ఈ ఘటన జరిగింది. ముంపు గ్రామాల పరిశీలనకు పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకర్ రావు బయల్దేరగా.. టీడీపీ కార్యకర్తలు దాడి చేసినట్లు తెలిసింది. 


ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో ఆయన గుంటూరుకు వెళ్లిపోవాల్సి వచ్చింది. కాగా టీడీపీ శ్రేణులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వ‌ర‌ద ముంపు గ్రామాల ప‌రిశీల‌న‌కు వెళ్తున్న స‌మ‌యంలో మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకర్ రావును టీడీపీ కార్యక‌ర్తలు అడ్డుకోవడంతోనే ఈ ఘర్షణ చెలరేగినట్లుగా చెబుతున్నారు. 






పల్నాడు జిల్లాలోనే ఇటీవల వినుకొండ చెక్‌పోస్టు సమీపంలో ఓ దారుణ హత్య కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఓ యువకుడు మరో యువకుడిని దారుణంగా నరికగా.. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ అయ్యాయి. వినుకొండ వైసీపీ యువజన విభాగ నాయకుడు రషీద్‌పై షేక్ జిలానీ అనే యువకుడు కత్తితో దారుణంగా దాడి చేసి హతమార్చాడు. రషీద్‌ రెండు చేతులు తెగిపోగా.. ఒళ్లంతా తీవ్ర గాయాలై రక్తపుమడుగులో కూలిపోయి రషీద్ అక్కడికక్కడే చనిపోయాడు. ఈ ఘటన అధికార విపక్షాల మధ్య తీవ్రమైన వాగ్యుద్ధానికి దారి తీసిన సంగతి తెలిసిందే.