ఆంధ్రప్రదేశ్‌ సీఎం జగన్‌ను నీతి ఆయోగ్ సభ్యుడు రమేష్ చంద్‌ భేటీ అయ్యారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో చాలా అంశాలు చర్చకు వచ్చాయి. తలసరి ఆదాయం, వ్యవసాయం, దాని అనుబంధ రంగాలు, పశుసంపద తదితర రంగాల్లో దేశసగటు కన్నా ఏపీలో వృద్ధి బాగుందన్నారు రమేష్‌ చంద్‌. దీనికి సంబంధించిన గణాంకాలను సీఎం జగన్‌కు రమేష్ వివ‌రించారు. దేశంలో అనేక రాష్ట్రాలతో పోలిస్తే ఏపీ చాలా మెరుగ్గా ఉందన్నారు రమేష్‌ చంద్. ప్రతీ రంగంలో లక్ష్యాలను పెట్టుకుని దానికి అనుగుణంగా ముందుకు సాగుతున్న తీరును రమేష్‌చంద్ ప్రశంసించారు.


జీరో బేస్డ్‌ నేచురల్‌ ఫార్మింగ్, ఆర్గానిక్‌ వ్యవసాయం తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. పండ్లు, మత్స్య ఉత్పత్తుల్లో ఏపీ అగ్రగామిగా ఉండ‌టం అభినంద‌నీయ‌మ‌ని రమేష్ చంద్ తెలిపారు. ఆయిల్‌పామ్‌ సాగు ద్వారా వంటనూనెలు ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించిందని ప్రశంశించారు. ఆర్బీకేల ద్వారా రైతులకు సమగ్ర వ్యవస్థ అందుబాటులో ఉందని, క్షేత్రస్థాయిలో అత్యుత్తమ వ్యవస్థ అని కొనియాడారు. హయ్యర్‌ ఎడ్యుకేషన్‌లో గ్రాస్‌ ఎన్‌రోల్‌మెంట్‌ దేశం సగటు కన్నా ఏపీ సగటు అధికంగా ఉంద‌న్నారు. 


రాష్ట్రంలో చేపడుతున్న పలు అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలను సీఎం జ‌గ‌న్ ర‌మేష్ చంద్‌కు వివ‌రించారు. వ్యవసాయం, వైద్య, విద్య, గృహనిర్మాణ రంగాల్లో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చామన్నారు సీఎం జగన్. ఈ రంగాల్లో చాలా కార్యక్రమాలు చేపడుతున్నామన్న సీఎం, గర్భవతులు, బాలింతలు, చిన్నారులు, బడిపిల్లల్లో పౌష్టికాహార లోపం లేకుండా సంపూర్ణపోషణ, గోరుముద్ద లాంటి కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. మహిళా సాధికారిత కోసం బృహత్తర కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. 


ప్రతి యాభై ఇళ్లకు ఒక వాలంటీర్‌ను పెట్టామని, గ్రామ–వార్డు సచివాలయాలను ఏర్పాటు చేసి వివక్షకు, అవినీతికి ఆస్కారం లేకుండా డెలివరీ మెకానిజాన్ని సమర్థవంతంగా నడిపిస్తున్నామన్నారు సీఎం. డీబీటీ విధానంలో ఏపీది అగ్రస్థానమన్నారు. పిల్లలను బడికి పంపించేలా తల్లులను చైతన్య పరచడానికి అమ్మ ఒడిని అమలు చేస్తున్నామ‌ని, దీని వల్ల జీఈఆర్‌ పెరుగుతుందన్న సీఎం, విద్యారంగాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నామని, ప్రపంచస్థాయిలో పోటీని తట్టుకునేలా పిల్లలను తయారుచేస్తున్నామని వివ‌రించారు. 


ఏ రంగంలోనైనా రాణించాలంటే.. ఇంగ్లీషు, నాణ్యమైన విద్య చాలా అవసరమని, నాడు నేడు ద్వారా స్కూళ్ల రూపురేఖలు మార్చామని, తరగతి గదులను డిజిటల్‌ ఉపకరణాలతో తీర్చిదిద్దుతున్నామనిన తెలిపారు సీఎం. సబ్జెక్టుల వారీగా బోధనకు టీచర్లను నియమిస్తున్నామని, ఆరు రకాల స్కూళ్లను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. పూర్తి స్థాయి రీయింబర్స్‌ మెంట్‌ అందిస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీ అని, వసతి దీవెన కింద కూడా ఏడాదికి రూ.20వేలు ఇస్తున్నామని, దీనివల్ల జీఈఆర్‌ గణనీయంగా పెరుగుతుందని తెలిపారు. 


ప్రభుత్వాసుపత్రుల్లో, బోధనాసుపత్రుల్లో నాడు – నేడు కింద అభివృద్ధి కార్యక్రమాలను జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా  చేపడుతున్నామన్న సీఎం,ప్రతి గ్రామంలో, వార్డుల్లో కూడా విలేజ్, వార్డు క్లినిక్స్‌పెడుతున్నామని, ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ను కూడా అమల్లోకి తీసుకువస్తున్నామ‌ని చెప్పారు.