గుడివాడలో మట్టి మాఫియా రెచ్చిపోయి.. స్థానిక రెవెన్యూ అధికారి అరవింద్‌పై దాడికి పాల్పడిన ఘటనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఘాటుగా స్పందించారు. ఇదంతా గుడివాడ గడ్డం గ్యాంగ్ పనే అంటూ ఆరోపణలు చేశారు. మంత్రి పదవి లేకపోతే ఇక తన విశ్వరూపం చూపిస్తానన్నారని, ఇదేనా విశ్వరూపం అంటూ ఎద్దేవా చేశారు. ఆర్ఐపై స్థానిక మట్టి మాఫియా వారు దాడికి పాల్పడడం స్థానికంగా తీవ్ర క‌ల‌క‌లం రేపింది. దీనిపై నారా లోకేశ్ స్పందిస్తూ..


‘‘అక్రమాల‌ని అడ్డుకున్న వారికి ఎవ్వరికైనా ఇదే గ‌తి ప‌డుతుంద‌ని వైసీపీ నేత‌లు హెచ్చరిస్తూనే వున్నారు. అవినీతిని ప్రశ్నిస్తే అంతం చేస్తామ‌ని చెబుతూనే, ఇప్పటికే చాలామందిని అంత‌మొందించారు వైసీపీ నేత‌లు. పోలీసులు, అధికారుల అండ‌తో ప్రజ‌లు, ప్రతి ప‌క్షనేత‌లు, ప్రజా సంఘాల నేత‌ల్ని టార్చర్ చేసిన వైసీపీ నేత‌లు.. త‌మ‌కు అడ్డువ‌స్తే పోలీసుల్ని, అధికారుల్నీ వ‌ద‌ల‌మ‌ని మ‌రోసారి నిరూపించుకున్నారు. వైసీపీ గ‌డ్డం గ్యాంగ్ అరాచ‌కాల‌కు ప‌రాకాష్టగా నిలిచింది గుడివాడ‌లో ఘ‌ట‌న‌. గుడివాడ గ‌డ్డం గ్యాంగ్ క‌ను స‌న్నల్లో సాగే మ‌ట్టి మాఫియాని నిలువ‌రించిన రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ అర‌వింద్ పై ఏకంగా జేసీబీతో దాడి చేయ‌డం రాష్ట్రంలో వైసీపీ అరాచ‌కాల‌కు అద్దం పడుతోంది. 


రెవెన్యూ సిబ్బంది ప్రాణాల్ని తీసేందుకు య‌త్నించిన గ‌డ్డం గ్యాంగ్ మ‌ట్టిమాఫియా అరాచ‌కాలు పోలీసుల‌కి ప‌ట్టవా? ఈ రోజు రెవెన్యూ అధికారుల‌పైకి వ‌చ్చిన జేసీబీ పోలీసుల‌పైకీ రాద‌న్న గ్యారెంటీ ఉందా? కృష్ణా జిల్లా గుడివాడ మండలం మార్టూరులో అర్ధరాత్రి సాగుతున్న మ‌ట్టి త‌వ్వకాల‌ని అడ్డుకున్న అర‌వింద్‌పై దాడి ముమ్మాటికీ ప్రభుత్వ ప్రాయోజిత గుడివాడ‌ గ‌డ్డం గ్యాంగ్ ప‌నే. మంత్రి ప‌ద‌వి పోయిన‌ క్యాసినో స్టార్ విశ్వరూపం చూపిస్తానంటే ఏంటో అనుకున్నాను. ఇలా త‌న మాఫియా గ్యాంగుల‌ని అడ్డుకునే రెవెన్యూ అధికారుల‌పై దాడులు చేయ‌డ‌మా విశ్వరూపం అంటే..! 


ఆర్ఐ అర‌వింద్ వైపు అదృష్టం ఉండి బ‌తికి బ‌ట్టక‌ట్టాడు. లేదంటే చంపేసేవారే. ద‌య‌చేసి ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసులు కాస్తా జాగ్రత్తగా వుండండి. ప్రజ‌ల్ని ఎలాగూ మీరు ర‌క్షించ‌లేరు. మీ ప్రాణాల్నైనా వైసీపీ రాక్షసుల నుంచి కాపాడుకోండి. ఈ ముఖ్యమంత్రి - ప్రభుత్వం కోసం మీరు ప్రాణాలు ప‌ణంగా పెడితే, ఆ ప్రాణాలు తీసుకుంటాడే కానీ మీకు ర‌క్షణ‌గా వుండ‌డు. సీఎం ప్రోత్సాహంతోనే మ‌ట్టిమాఫియాలు, గ‌డ్డం గ్యాంగులు బరితెగిస్తున్నాయి. ఆర్ఐపై దాడిచేసిన మ‌ట్టిమాఫియా.. దాని వెనుకున్న గ‌డ్డం గ్యాంగ్ బాస్‌ని అరెస్టు చేయాల‌ని డిమాండ్ చేస్తున్నాను. విధుల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు, అధికారుల‌కి ర‌క్షణ క‌ల్పించాల‌ని కోరుతున్నాను.’’ అని నారా లోకేష్‌ విమర్శించారు.


అసలేం జరిగిందంటే..
గుడివాడలో మట్టి మాఫియా రెచ్చిపోయింది. స్థానిక రెవెన్యూ అధికారి అరవింద్ పై దాడికి పాల్పడ్డారు. ఈ ఘ‌ట‌న స్థానికంగా తీవ్ర క‌ల‌క‌లం రేపింది. దీంతో అప్రమత్తం అయిన పోలీసులు వెంట‌నే రంగంలోకి దిగారు. మాఫియాకు చెందిన 3 జేసీబీలు, లారీలు స్వాధీనం చేసుకున్నారు. దాడికి పాల్పడిన వారిని అదుపులోకి తీసుకున్నారు. గుడివాడలో ఆర్ఐ అరవింద్‌ పై దాడి జ‌రిగిన ఘ‌ట‌న‌కు సంబందించిన వివ‌రాలపై విచార‌ణ చేప‌ట్టారు. అయితే మాజీ మంత్రి కొడాలి నాని అనుచరుడు గంట సురేష్ తమ్ముడు గంట కళ్యాణ్ దాడికి పాల్పడిన‌ట్లుగా ప్రచారం జ‌రుగుతుంది. రెవెన్యూ అధికారులపై దాడి విషయం తెలిసినా పోలీసులు తొలుత నిర్లక్ష్యంగా వ్యవ‌హ‌రించార‌నే అరోప‌ణ‌లు వ్యక్తం అయ్యాయి.