Nara Lokesh Mocked YS Jagan: జగన్ అధికారంలోకి వచ్చాక ఆయన కంపెనీలు కళకళలాడుతున్నాయని రాష్ట్ర ఖజానా మాత్రం దివాలా తీసిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఎద్దేవా చేశారు. ఒక కొత్త కంపెనీ తెచ్చి యువతకు ఉద్యోగాలివ్వడం ముఖ్యమంత్రికి చేతగాలేదని విమర్శించారు. కానీ అప్పులు తేవడంలో మాత్రం పీహెచ్‌డీ చేశారని అన్నారు. రాష్ట్ర పరిపాలనా కేంద్రం సచివాలయాన్ని రూ.370 కోట్లకు తాకట్టుపెట్టిన జగన్ మోహన్ రెడ్డి.. తాజాగా రాష్ట్రంలో ఖనిజ సంపదను తాకట్టు పెట్టారని అన్నారు. అలా ఏకంగా రూ.7 వేల కోట్లు అప్పు తెచ్చారని తప్పుబట్టారు. ఇప్పటికే మందుబాబులను తాకట్టుగా పెట్టి 33 వేల కోట్లు జగన్ మోహన్ రెడ్డి అప్పు తెచ్చారని.. ఇక జగన్ జమానాలో మిగిలింది 5 కోట్ల మంది జనం మాత్రమే అని ఎక్స్ లో పోస్ట్ చేశారు.


‘‘గత అయిదేళ్లుగా ముఖ్యమంత్రి జగన్ రెడ్డిగారి సొంత కంపెనీలన్నీ వేలకోట్ల లాభాలతో కళకళలాడుతుంటే... అడ్డగోలు అప్పులతో రాష్ట్ర ఖజానాను మాత్రం దివాలా తీయించారు. ఒక్కటంటే ఒక్క కొత్త కంపెనీ తెచ్చి యువతకు ఉద్యోగాలివ్వడం చేతగాని ముఖ్యమంత్రి... అప్పులు తేవడంలో మాత్రం పిహెచ్ డి చేశారు. రాష్ట్ర పరిపాలనా కేంద్రం సచివాలయాన్ని రూ.370 కోట్లకు తాకట్టుపెట్టిన జగన్... తాజాగా రాష్ట్రంలో ఖనిజసంపదను తాకట్టుపెట్టి రూ.7వేల కోట్లు అప్పు తెచ్చారు. ఇప్పటికే మందుబాబులను తాకట్టుపెట్టి 33వేలకోట్లు అప్పు తెచ్చిన జగన్ జమానాలో ఇక మిగిలింది 5 కోట్లమంది జనం మాత్రమే. ఇప్పటికే నేను మీ బిడ్డనంటూ వేదికలపై ఊదర గొడుతున్న జగన్మోహన్ రెడ్డి మాటల వెనుక అంతర్యాన్ని గుర్తించి రాబోయే 2నెలలపాటు ఆయనతో జాగ్రత్తగా ఉండాల్సిందిగా రాష్ట్రప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను!!’’ అని నారా లోకేశ్ పోస్ట్ చేశారు.






మంగళగిరి నేతలు టీడీపీలోకి


‘‘మంగళగిరి లో మూడు సార్లు అభ్యర్థులను జగన్ మార్చినా ఫలితం గుండు సున్నా.. నియోజకవర్గంలో ఫ్యాన్ పార్టీ ఖాళీ అవుతుంది. తాడేపల్లి, దుగ్గిరాల మండలాలకు చెందిన 150 వైసిపి కుటుంబాలు పార్టీలో చేరారు. వారందరికీ పసుపు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించాను’’ అని నారా లోకేశ్ మరో పోస్ట్ చేశారు.