Nadendla Manohar: పంట సాగుకు చుక్క నీరు అందక పశ్చిమ కృష్ణా డెల్టా రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. బుధవారం పశ్చిమ కృష్ణా డెల్టాలో ఎండిపోయిన పంట పొలాలను ఆయన పరిశీలించారు. తెనాలి రూరల్ మండలం, కొలకలూరు, ఖాజీపేట, హాఫ్ పేట  గ్రామాల పరిధిలోని పశ్చిమ కృష్ణా డెల్టా, 3, 4 బ్రాంచ్ కెనాల్స్ నీరు లేక ఎండిపోయిన పంట పొలాల్లోకి వెళ్లి రైతులతో మాట్లాడారు. అక్కడున్న పరిస్థితిని స్వయంగా పరిశీలించారు. ఒక్కో రైతుతో విడిగా మాట్లాడారు.  


ఈ సందర్భంగా రైతులు తమ బాధను వెల్లడించారు. పంటను కాపాడుకునేందుకు రోజూ నీటి కోసం ఓ యుద్ధమే చేస్తున్నామని వాపోయారు. పంట ఈనే దశలో తడుల కోసం కష్టపడుతున్నామని, పశ్చిమ కృష్ణా డెల్టా లోని పంట పొలాలకు సాగునీరు లేకపోవడంతో  ఎండిపోయి కనిపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాలువల నిండా పూడిక నిండిపోయిందని, నీరు అందక పూర్తిగా వరి పైర్లు ఎండిపోతున్నాయని తెలిపారు. గతంలో ఎన్నడూ పశ్చిమ కృష్ణా డెల్టాలో సాగునీరు విషయంలో ఇంతటి దుర్భిక్ష పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 


వేలకు వేల రూపాయలు పెట్టుబడులు పెట్టినా పైసా వస్తుందనే నమ్మకం లేదని వాపోయారు. కృష్ణా డెల్టాలోని ఏ కాలువలోనూ నీరు లేకపోవడంతో రైతులు పంట తడులు కోసం సొంతంగా మోటారు ఇంజిన్లు వాడుకోవాల్సి వస్తుందన్నారు. నీరు అందించడంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందని, కనీసం చివరి తడులకు సైతం నీరు అందించడంలో వారాబందీ పద్ధతి కూడా విఫలం అయిందని, ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నామని రైతులు విలపించారు. 
 
అనంతరం నాదెండ్ల మనోహర్  మీడియాతో మాట్లాడుతూ.. తమది రైతు ప్రభుత్వమని, మనసున్న ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకోవడం మాత్రమే ముఖ్యమంత్రికి తెలుసని విమర్శించారు. క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితిని ఏ మాత్రం వైసీపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. పంటలు సాగు కోసం నీరు కూడా సరిగా అందించలేని దౌర్భాగ్య స్థితిలో ప్రభుత్వం ఉందని మండిపడ్డారు. వాటర్ మేనేజ్మెంట్ సిస్టం అమలు విషయంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. 


రాష్ట్రమంతా కరువే
ఎల్లప్పుడు కలకలలాడే పశ్చిమ కృష్ణా డెల్టా ప్రాంతం ఇలా ఉందంటే, రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాల్లో కరవు ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చని అన్నారు. కరవు మండలాలను ప్రకటించడంలో కూడా వైసీపీ ప్రభుత్వానికి మనసు లేదన్నారు. రాష్ట్రంలో రైతులు ఇబ్బంది పడుతున్నారని, కరువుతో అల్లాడుతున్నారని ప్రకటించడానికి వైసీపీ ప్రభుత్వానికి నామోషీ వచ్చిందని విమర్శించారు. ఈ కారణంతోనే తీవ్ర కరవు పరిస్థితులను కప్పిపుచ్చే ప్రయత్నం జరుగుతోందన్నారు.


ఎందుకు అంత గోప్యం?
రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లోనూ లోటు వర్షపాతం నమోదు అయిందని నాదెండ్ల అన్నారు.  680 మండలాల్లో సుమారు 361 మండలాలు తీవ్ర కరువు పరిస్థితి ఏర్పడిందన్నారు. వ్యవసాయ సంఘాల సైతం ఆ మేరకు కరువు మండలాల ప్రకటన చేయాలని డిమాండ్ చేసిన ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. అర్ధరాత్రి అత్యంత రహస్యంగా 103 కరువు మండలాలను ప్రకటించాల్సిన అవసరం ఏం వచ్చిందని ప్రశ్నించారు. పశ్చిమ కృష్టా డెల్టా లో ఉన్న గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో ఒక్క కరవు మండలం కూడా ప్రభుత్వం ప్రకటించలేదన్నారు. 


రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి
ఉమ్మడి కృష్ణా జిల్లాలో రెండు మండలాల్లో మాత్రమే కరువు ఉన్నట్లు చూపించారని నాదెండ్ల తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఖరీఫ్ లో 24 లక్షల ఎకరాల్లో సాగు తగ్గిందని, దీన్ని ప్రభుత్వం కప్పి పుచ్చుతోందని విమర్శించారు. ఏ జిల్లాలో ఎన్ని మండలాలు కరువు మండలాలు అనేది స్పష్టంగా ప్రకటించాల్సిన ప్రభుత్వం దాని తూతు మంత్రంగానే చేసిందని ఆరోపించారు. కరవు సాయం విషయంలో కూడా స్పష్టత ఇవ్వలేదన్నారు. కష్ట కాలంలో ఉన్న రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.