మంగళగిరి లక్ష్మినరసింహ స్వామి వారి కోనేరు పుననిర్మాణ పనులు ఎట్టకేలకు ప్రాంభం అయ్యాయి. 30 ఏళ్ల క్రితం కోనేరును అభివృద్ధి చేసేందుకు నీటిని తోడటానికి చేసిన ప్రయత్నం విఫలం కావటంతో పనులు ఆపేశారు. అయితే ఈసారి ఆ సమస్య లేదు. నీటిని పూర్తిగా తోడేశారు. దీంతో భారీ ప్రొక్లెయిన్‌తో పుననిర్మాణ పనులు ప్రారంభించారు..


యుద్ద ప్రాతిపదికన కోనేరు పనులు....


మరుగున పడిన చరిత్ర భావితరాలను అందించేందుకు ప్రయత్నం మొదలైంది. మంగళగిరి పెద్ద కోనేరును మరోసారి అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కోనేటిలో 60 ఏళ్లపాటు జల దిగ్బంధంలో ఉన్న ఆంజనేయ స్వామి ఆలయం కూడా వెలుగులోకి వచ్చింది దీంతో భక్తులు పెద్ద సంఖ్యలో పూజలు నిర్వహించారు. 464సంవత్సరాల చరిత్ర కలిగిన మంగళగిరి కోనేరును ఆ రోజుల్లో అత్యద్భుతంగా నిర్మించారు. భూమి లోతుల్లో పాతాళంలో ఉన్నామనే ఫీలింగ్ ఈ కోనేరులో దిగిన వారికి కలుగుతుంది. టెక్నాలజి అంటే అసలు తెలియని రోజుల్లోనే ఈ కోనేటిని చాలా చాకచక్యంగా నిర్మించారు. 60సంవత్సరాలుగా కోనేటి జలదిగ్బంధంలో ఆంజనేయ స్వామి వారి ఆలయం కూడా ఉందంటే ఆశ్చర్యం కలుగుతుంది.కాని ఇది వాస్తవం...


మంగళగిరి అనగానే మనకు గుర్తుకు వచ్చేది లక్ష్మీ నరసింహస్వామి ఆలయం. చారిత్మక ఆలయంలో వెలసిన స్వామి వారి కళ్యాణ పుష్కరిణి పెద్ద కోనేరు పూర్వ చరిత్ర నేటి తరానికి తెలియదు. శిథిలావస్థకు చేరిన ఈ పెద్ద కొనేరుని స్థానిక ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణా రెడ్డి అభివృద్ధి చేయిస్తున్నారు. గతంలోనూ ఓసారి అధికారులు, పాలకులు ఓఎన్జీసీ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని అభివృద్ది పనులు చేపట్టారు. ఆ రోజుల్లో ఓ ఎన్జీసీ ఆధ్వర్యంలో పదుల సంఖ్యలో నీళ్ళ మోటార్లు పెట్టి కొనేటిలో నీళ్ళు తోడే ప్రయత్నం నిరంతరాయంగా చేపట్టినా నీటిని పూర్తిగా తోడటం సాధ్యం కాలేదు. దీంతో చేసేది లేక పనులు అర్ధాంతరంగా నిలిపివేశారు. మంగళగిరి పట్టణం మధ్యలో అర ఎకరం వైశాల్యంలో కోనేరు ఉంది


భూ గర్బజలాలు అడుగంటుతున్నాయా....


ప్రస్తతం కోనేరును అభివృద్ది చేసేందుకు చేసిన ప్రయత్నాలు ఇప్పటి వరకు అనుకూలంగానే ఉన్నాయి. అయితే ఈ వ్యవహరంపై ఇప్పుడు స్థానికంగా చర్చ మొదలైంది. దాదాపుగా 30సంవత్సరాల క్రితం కోనేరును అభివృద్ది చేయాలనే సంక్పలంతో పనులు ప్రారంభించి, ముందుగా కోనేరులో ఉన్న నీటిని తోడేందుకు ప్రయత్నించారు. అయితే పూర్తిగా నీటిని తోడటం సాద్యం కాలేదు. నీరు పూర్తిగా బయటకు రాకుంటే, పనులు చేయటం కష్టం. దీంతో చేసేది లేక పనులు ఆపేయాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు చేసిన ప్రయత్నం ఫలించి కోనేరులో ఉన్న నీటిని పూర్తిగా తోడేశారు. 


అప్పుడు సాధ్యం కాని నీటి తోడకం ఇప్పుడు ఎలా సాధ్యం అయ్యిందని అనుమానాలు స్థానికంగా వ్యక్తం అవుతున్నాయి. భూ గర్బజలాలు పడిపోవటంతోనే కోనేరులో నీటి పూర్తిగా తోడటం సాధ్యమైందని అంటున్నారు. మంగళగిరి కోనేరు ఉన్న ప్రాంతం కృష్ణా నదికి సమీపంలోనే ఉంది. కోనేరుకు సమీపంలో నది ప్రవాహం సాగుతుంది. అలాంటప్పుడు భూగర్భ జలాలు ఎలా తగ్గుతాయన్నది మరో వాదన. ఇదే సమయంలో మరో ప్రచారం కూడా సాగుతుంది. 30ఏళ్ళ క్రితం వరకు సాంకేతికంగా అంతగా పురోగతి లేదు. ఇప్పుడు పెద్ద ఎత్తున మోటార్లు అందుబాటులోకి వచ్చాయి. హై ఎండ్ కెపాసిటి మోటార్లు అందుబాటులోకి రావటంతో నీటిని తోడటం ఈజీ అయిపోయిందనే వాదన ఉంది. ఏది ఎమైనా ఇన్నాళ్ళకు మోటార్లతో కోనేరులో నీటిని తోడేయటంతో భారీ కెపాసిటి గల జేసీబీలు కూడ రంగంలోకి దిగి, పుననిర్మాణ పనులను వేగవంతం చేశారు.