Bapatla Crime News | కొరిశపాడు: బాపట్ల జిల్లాలో భారీ చోరీ జరిగింది. సినిమా సీన్లకు ఏమాత్రం తీసిపోని రీతిలో పెద్ద ఎత్తున స్కెచ్ వేసి మరీ కంటెయినర్ లారీ నుంచి ఏకంగా 255 ల్యాప్టాప్లను మాయం చేశారంటే మాటలు కాదు. జిల్లాలోని కొరిశపాడు మండలం మేదరమెట్ల వద్ద కంటెయినర్ లారీ నుంచి ల్యాప్టాప్లను కొందరు గుర్తుతెలియని వ్యక్తులు చోరీ చేశారు. ప్లాన్ ప్రకారం చోరీ జరిగిందా, లేక ఎలక్ట్రానిక్ పరికరాలు తరలిస్తున్న వాహనం నడుపుతున్న డ్రైవర్, క్లీనర్ల చేతివాటం ఉందా అనే కోణాల్లో పోలీసులు విచారణ చేపట్టారు.
అసలేం జరిగిందంటే..
ముంబై నుంచి చెన్నైకి వెళ్తున్న ఎలక్ట్రానిక్ వస్తువుల రవాణా చేస్తున్న సమయంలో పెద్ద ఎత్తున చోరీ జరిగిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఒక కంపెనీకి చెందిన నాలుగు కంటెయినర్లలో ల్యాప్టాప్ లాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు తరలిస్తుండగా, అద్దంకి మండలం చిన్నకొత్తపల్లి వద్దకు రాగా.. కంటెయినర్ అలారం బ్రేక్ అయినట్లు కంపెనీ ప్రతినిధులకు సమాచారం అందింది.
శనివారం (ఆగస్టు 23న) ఉదయం చోటు చేసుకున్న ఈ భారీ చోరీ ఘటనలో లారీ డ్రైవర్, క్లీనర్ కంటెయినర్ను అక్కడే వదిలి పరారయ్యారు. దీంతో కంపెనీ ప్రతినిధులు ఆదివారం నాడు ల్యాప్టాప్స్ చోరీపై మేదరమెట్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. చోరీకి గురైన ల్యాప్టాప్ల విలువ సుమారు రూ.1.85 కోట్లు ఉంటుందని కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు. ఈ ఘటనపై చీరాల డీఎస్పీ మొయిన్ స్పందించారు. కంటైనర్ నుంచి ల్యాప్టాప్స్ చోరీ చేసిన నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీస్ బృందాలను ఏర్పాటు చేశామని తెలిపారు.