Andhra Pradesh Cabinet Meeting | అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబు (Chandrababu) అధ్యక్షతన భేటీ అయిన రాష్ట్ర మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. మొత్తం 24 అంశాలపూ చర్చించినట్లు సమాచారం. పోలవరం బనకచర్ల ప్రాజెక్టుకు పాలనాపరమైన అనుమతులకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. ఉద్యోగుల బదిలీ అంశంపై కేబినెట్ చర్చించింది. పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డులో ఆమోదించిన 11 సంస్థలకు సంబంధించిన పెట్టుబడులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. మొత్తం రూ.30 వేల కోట్ల వరకూ పెట్టుబడులు, 35 వేల ఉద్యోగాల కల్పనకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 

- భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద సిటీసైడ్ డెవలప్మెంట్ కోసం 500 ఎకరాలు కేటాయించేలా జీఓఎం చేసిన సిఫార్సుకు కేబినెట్ ఆమోదం 

- నెల్లూరు జిల్లా ముత్తుకూరులో ఏపీఐఐసీకి ఉచితంగా 615 ఎకరాల భూ కేటాయింపునకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ 

- పారిశ్రామిక పార్కు ఏర్పాటు కోసం ఏపీఐఐసీకి భూ కేటాయింపు చేసే ప్రతిపాదనకు అమోదం

- సత్యసాయి జిల్లా తాడిమర్రిలో ఆదాని పవర్ కు 500 మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ హైడ్రోపవర్ ప్రాజెక్టుకు భూ కేటాయింపు

- కడప జిల్లాలోని కొండాపురంలో 1000 మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టు ఏర్పాటుకు అదానీ పవర్ కు భూ కేటాయింపు. ఎకరా 5 లక్షల రూపాయల చొప్పున భూ కేటాయింపునకు నిర్ణయం 

- 2260 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ల నియామక నిర్ణయానికి ర్యాటిఫై చేస్తూ కేబినెట్ నిర్ణయం 

- హైదరాబాద్ లోని పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయాన్ని ఏపీకి తరలించే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం

- ఏపీలోని విద్యార్ధులకు కోచింగ్ ఇచ్చేందుకు స్టడీసెంటర్ల ఏర్పాటుకు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకీ అనుమతి

- అమరావతిలో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ద్వారా లీగల్ యూనివర్సిటీ ఏర్పాటు ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం

- ఎండీయూ వాహనాలను రద్దు చేసి రేషన్ దుకాణాల ద్వారా బియ్యం ఇతర సరుకులు ఇచ్చే ప్రతిపాదనకు కేబినెట్ లో చర్చ

 - ఏపీ లెదర్ ఫుట్ వేర్ పాలసీ 4.0కి కేబినెట్ ఆమోదం జూన్ 12 నాటికి ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తి కానుంది. తొలి ఏడాది పాలనలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధితో పాటు సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని మంత్రులకు సీఎం చంద్రబాబు సూచించారు.