Andhra Pradesh News Cabinet: పవన్ కల్యాణ్... ఈ పేరులో వైబ్రేషన్ ఉంటుంది. పవర్ స్టార్ అంటూ ఫ్యాన్స్ ముద్దుగా పిలుచుకుంటారు. పేరుకు తగ్గట్టుగానే ఆయనలో ఏదో తెలియని పవర్ ఉంటుంది. అన్న చాటు చాటు తమ్ముడి  సినీ రంగ ప్రవేశం చేసిన 2 సినిమాలతోనే తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను సంపాదించుకున్నారు. నవ్వితే చాలు బాక్సాఫీస్‌లో కనకవర్షం కురిసేది. ఇలా సినిమా సినిమాకు తన స్టామినా పెంచుకుంటూ ఇంతింతై అన్నట్టు వెండితెరపై అమాంతం ఎదిగిపోయారు. అప్పటి వరకు ఏ హీరోకి లేని ఇజాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అదే పవనిజం. 


పవనిజానికి అదో పొగరు 


సినిమాల్లోనే కాదు వ్యక్తిగతంగా కూడా పవన్ అంటే ప్రాణాలు ఇచ్చే ఫ్యాన్స్ కోట్లలో ఉంటారు. ఆయన మాట తీరు, నడవడిక, స్టైల్, సింపుల్‌సిటీ ఇలా అన్నింటికీ ప్రత్యేకమైన ఫ్యాన్స్ ఉన్నారు. పవన్ కల్యాణ్‌కు సినిమా హిట్‌, ప్లాప్‌లతో సంబంధం లేదు. ఆయన సినిమాలు పండగల్లో రానక్కర్లేదు. ఆయన సినిమా రిలీజ్ అయినప్పుడే అన్ని పండగలు వచ్చినట్టు ఫ్యాన్స్ ఫీల్ అవుతారు. రీల్‌ల్లోనే కాదు రియల్ లైఫ్‌లో కూడా నచ్చిన దాని కోసం ఎంత వరకైనా వెళ్తారు. అందుకే పవనిజానికి పవరు పొగరు అని ఫ్యాన్స్ అనుకుంటారు. 


1996లో సినిమాల్లోకి 2008లో రాజకీయాల్లోకి 


పవన్ కళ్యాణ్ 1968 సెప్టెంబరు 2లో జన్మించారు. 1996లో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అనే సినిమాతో తొలిసారిగా తెరపై కనిపించారు. అక్కడి నుంచి పవన్ ప్రభంజనం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు యావత్ దేశం చూసింది. సినిమా కేరీర్‌ పీక్స్‌లో ఉన్నప్పుడే కోట్లు కూడగడుతున్నప్పుడే అన్నతోపాటు రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ప్రజలకు ఏదో చేయాలన్న సంకల్పం ఆయన్న రాజకీయాల్లోకి రప్పించేలా చేసింది. 2008లో ప్రజారాజ్యంలో యువరాజ్యం విభాగానికి అధ్యక్షుడిగా పని చేశారు. 2009 ఎన్నికల్లో ఊరూరా తిరిగి అన్నయ్య గెలుపు కోసం శ్రమించారు. ఆ ఎన్నికల తర్వాత ప్రజారాజ్యం కాంగ్రెస్‌లో విలీనం అవ్వడంతో ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. 


2014 పంజా విసిరి సింహం   


దెబ్బతిన్న సింహం శ్వాస కూడా గర్జన కన్నా భయంకరంగా ఉంటుందన్నట్టు 2014లో తన విశ్వరూపం చూపించారు. జనసేన పేరుతో ప్రత్యేక పార్టీని ఏర్పాటు చేశారు. మొదటి స్పీచ్‌లోనే తన రాజకీయ అజెండాను చెప్పిన పవన్... నేటికీ దాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్నారు. 2014 కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేసిందని గళమెత్తిన పవన్ కల్యాణ్‌... కాంగ్రెస్ హఠావో నినాదంతో ఎన్డీఏ కూటమికి మద్దతు ఇచ్చారు. విభజన గాయాలతో బాధపడుతున్న ఆంధ్రప్రదేశ్‌కు చంద్రబాబులాంటి వ్యక్తి సీఎంగా రావాలని ఎన్నికల్లో ప్రచారం చేశారు. కూటమి విజయం ఉడతాభక్తిగా తన వంతు పాత్ర పోషించారు. 


సమయం చిక్కినప్పుడల్లా ప్రభుత్వానికి సలహాలు ఇస్తూ నాటి ప్రభుత్వానికి అండా ఉంటూ వచ్చారు. తర్వాత 2019 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి ఓవైపు టీడీపీ, మరోవైపు జనసేన రెండు పార్టీలు దెబ్బతిన్నాయి. ఒక్కఛాన్స్ ఉంటూ జగన్ చేసిన ప్రచారం ప్రత్యర్థులను కోలుకోలేని దెబ్బ తీసింది. ఎంతలా అంటే... రెండు చోట్ల పోటీ చేసిన పవన్ కల్యాణ్‌, ఒక చోట పోటీ చేసిన చంద్రబాబు కుమారుడు లోకేష్‌ కూడా ఓటమి పాలయ్యారు. 


2014 నుంచి 2024 వరకు ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు రాజకీయాలు నెరిపారు పవన్. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ వచ్చారు. సినిమాల్లో వచ్చిన డబ్బులతో రైతులకు, ఆపదల్లో ఉన్న ప్రజలకు సాయం చేస్తూ తన ఇమేజ్‌ను ఓటుబ్యాంకు పెంచుకుంటూ వచ్చారు. పవన్‌కు ఫ్యాన్స్ ఉంటారు కానీ ఓటర్లు ఉండరనే అపవాదును పోగట్టుకునేందుకు అవిశ్రాంతంగా శ్రమించారు. తన పార్టీ తరఫున గెలిచిన ఒక్క ఎమ్మెల్యే కూడా వైసీపీలోకి వెళ్లిపోయిన ఏ మాత్రం పట్టుసడలిపోకుండా ఉన్నారు. 


తగ్గి మరీ  గెలిచిన పవన్ 


ఎక్కడ నెగ్గాలో కాదురా ఎక్కడ తగ్గాలో తెలిసినవాడే గొప్పోడు అనే డైలాగ్‌ పవన్ వ్యక్తిత్వం చూసిన తర్వాత రాశారు అన్నట్టు 2024 ఎన్నికల ముందు అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. జగన్ రౌడీ రాజ్యం పోవాలంటే ప్రతిపక్ష ఓటు చీలిపోకూడదనే నినాదాన్ని ఎత్తుకున్నారు. దీంతో పొత్తుకు సంకేతాలు ఇచ్చారు. ఇంతలో చంద్రబాబు అరెస్టు చేయడంతో తన పొత్తు ప్రయత్నాల స్పీడ్ పెంచారు. 


రాజమండ్రి జైల్లో ఉన్న చంద్రబాబుతో సమావేశమై పవన్ కల్యాణ్‌.. మీడియాతో మాట్లాడుతూ టీడీపీ, జనసేన కలిసి 2024 ఎన్నికల్లో పోటీ చేస్తుందని సంచలన ప్రకటన చేశారు. అప్పటికే బీజేపీతో పొత్తులో ఉన్న పవన్ కల్యాణ్ ఈ ప్రకటన చేయడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఈ కూటమిలోకి బీజేపీని కూడా తీసుకొచ్చేందుకు అనేక ప్రయత్నాలు చేశారు పవన్. 


ఇంతలో చంద్రబాబుకు బెయిల్ రావడంతో రాజకీయాలు మరో టర్న్ తీసుకున్నాయి. ఓవైపు చంద్రబాబు, మరోవైపు పవన్ కల్యాణ్ ఇద్దరూ పొత్తు కోసం బీజేపీని ఒప్పించారు. నోటిఫికేషన్ వచ్చే నాటికి మూడు పార్టీల మధ్య పొత్తు కుదిరింది. మళ్లీ ఎన్డీఏలోకి టీడీపీ చేరింది. 2024లో మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయంటే  ఆ క్రెడిట్ అంతా పవన్ కల్యాణ్‌దే. 


పొత్తు ఒక ఎత్తైతే... ఓటు ట్రాన్సఫర్ అవ్వడం మరో ఎత్తు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ కాళ్లకు చక్రాలు కట్టుకొని, రాళ్లు పగిలే ఎండను లెక్కచేయకుండా ఎన్నికల ప్రచారం చేశారు. కలిసి కొన్ని సభలు, విడివిడిగా కొన్ని సభల్లో ప్రచారం నిర్వహించారు. కూటమికి ఎందుకు ఓటు వేయాలో బలంగా వినిపించారు. ప్రజలను ఒప్పించారు. పదే పదే వైసీపీని, జగన్‌ను హెచ్చరించినట్టే వారిని ఓడించి నేలపై కూర్చోబెట్టారు. 


వంద స్ట్రైక్ రేట్


2019 ఎన్నికల్లో రెండు చోట్ల ఓటమిపాలై ఇప్పటి వరకు విమర్శలు ఎదుర్కొన్న పవన్ కల్యాణ్ ఈసారి మాత్రం ఆ తప్పు చేయలేదు. పిఠాపురంలో పోటీ చేసిన పవన్... భారీ మెజార్టీతో గెలుపొందారు. ప్రత్యేక ప్రణాళికతో పిఠాపురంలో వైసీపీ అభ్యర్థి వంగ గీతపై విజయం సాధించారు. ఆయన గెలవడమే కాదు తన పార్టీకి కేటాయించిన 21 ఎమ్మెల్యే సీట్లు, రెండు ఎంపీ సీట్లను గెలుచుకున్నారు. వంద శాతం స్ట్రైక్ రేట్‌తో రాజకీయాల్లో కొత్త ఒరవడి సృష్టించారు. 


కూటమి విజయంలో పవన్ కల్యాణ్‌ది తిరుగులేని పాత్ర. అందుకే పవన్‌తో చంద్రబాబుకు ఓ ఎమోషనల్ అటాచ్మెంట్‌ ఏర్పడినట్టు తెలుస్తోంది. పవన్ కారణంగానే చంద్రబాబు మాటతీరులో తేడా వచ్చింది. ఎప్పుడూ నవ్వుతూ కనిపిస్తున్నారు. పవన్ కారణంగానే చంద్రబాబు ఈ మార్పును చూస్తున్నామని టీడీపీ నేతలే చెబుతున్నారు. 


ఇంత చేసిన పవన్‌కు కీలకమైన స్థానాన్ని కల్పించారు చంద్రబాబు. తన మంత్రి వర్గంలో చోటు ఇచ్చారు. 2008 నుంచి రాజకీయాల్లో ఉన్న పవన్ కల్యాణ్‌ ఇప్పుడు మంత్రిగా ప్రమాణం చేశారు. పవన్ ప్రమాణంతో ఫ్యాన్స్‌లో మెగా ఫ్యామిలీలో ఆనందం వెల్లివిరిసింది. పవన్ కల్యాణ్ అనే  అన్నప్పుడు బాహుబలి సినిమా సీన్‌లు గుర్తుకు తెచ్చేలా జనం పవర్ స్టార్ అంటు అరుస్తూ కేకలు పెట్టారు. ఒక్కసారిగా సభా ప్రాంగణమంతా కరతాళ ధ్వనులతో మారుమోగిపోయింది. ఈలలతో ఫ్యాన్స్ అంతా గోలగోల చేశారు. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న కళ నేడు సొంతమైంది. ఎమ్మెల్యేగా చట్టసభల్లో కూర్చొని  ప్రజా సేవ చేయాలన్న పవన్ కల ఇప్పుడు కార్యరూపం దాల్చింది. ఇప్పుడు ఆయనకు ఎలాంటి శాఖ రానుందే ఉత్కంఠ మొదలైంది.