పల్నాడు జిల్లా మాచర్లలో జరిగిన హింసాత్మక ఘటనలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని గుంటూరు రేంజ్‌ డీఐజీ త్రివిక్రమ్‌ వర్మ అన్నారు. మాచర్లలో దాడులు, ఉద్రిక్తతలకు సంబంధించి తమ వద్ద వీడియో ఫుటేజీ ఉందని, పరిశీలించిన తరువాత నిందితులపై చర్యలు తీసుకుంటామన్నారు. పల్నాడు జిల్లా మాచర్లలో టీడీపీ, వైసీపీ శ్రేణులు మధ్య మూడు రోజుల కిందట ఘర్షణ తలెత్తింది. టీడీపీ, వైసీపీ శ్రేణులు కర్రలు, రాళ్లు, గాజు సీసాలతో దాడులకు పాల్పడగా 144 సెక్షన్ విధించారు. ఈ మేరకు డీఐజీ త్రివిక్రమ్‌ వర్మ ఆదివారం మీడియాతో మాట్లాడారు. అధికార వైసీపీ, టీడీపీ రెండు పార్టీల నేతలు పరస్పరం రెచ్చగొట్టుకుని దాడులకు పాల్పడ్డారని తెలిపారు. మాచర్లలో సాయంత్రం 6.30 గంటల నుంచి రాత్రి ఏడున్నర గంటల మధ్య ఘర్షణలు జరిగాయన్నారు. 


ఈ ఘటనలో గాయపడిన వారి నుంచి పోలీసులు ఫిర్యాదులు స్వీకరించినట్లు తెలిపారు. మాచర్లలో జరిగిన ఘటనలో అన్ని అంశాలు పరిశీలించి, బాధ్యులపై ఆయా సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామన్నారు. చట్టాన్ని చేతుల్లోకి ఎవరు తమ చేతుల్లోకి తీసుకున్నా, సహించేది లేదని హెచ్చరించారు. టీడీపీ నేతలు తమ కార్యక్రమానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి కార్యకర్తలు, ప్రజల్ని సేకరించారని.. వారి వివరాలు సేకరించే పనిలో పోలీసులు బిజీగా ఉన్నారని డీఐజీ తెలిపారు. ఏదైనా పార్టీ ర్యాలీలు, నిరసనలు తలపెడితే కచ్చితంగా పోలీసుల నుంచి అనుమతి తీసుకోవాలని సూచించారు. 


అసలేం జరిగిందంటే..
టీడీపీ ఇదేం ఖర్మ రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా ఆ పార్టీ కార్యకర్తలు స్థానిక రింగురోడ్డు వద్ద శుక్రవారం ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో మున్సిపల్‌ కార్యాలయం వద్దకు వైసీపీ శ్రేణులు భారీగా చేరుకున్నారు. చిన్న కాన్వెంట్‌ సమీపంలో టీడీపీ, వైసీపీ కార్యకర్తలు ఎదురుపడ్డారు. ఇరు పార్టీ కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. ఒక్కసారిగా ఇరు పార్టీల కార్యకర్తలు రాళ్లు, సీసాలు విసురుకుని దాడులకు పాల్పడ్డారు. ఇరువర్గాలు రాళ్లు, కర్రలతో దాడులకు దిగాయి. ఈ ఘటనలో ఇరువర్గాలకు చెందిన పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం పోలీసులు అక్కడకు చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు. ప్రదర్శన నిలిపివేసి అక్కడి నుంచి వెళ్లిపోవాలని టీడీపీ నేతలకు పోలీసులు సూచించారు. మాచర్ల నియోజకవర్గం ఇన్‌ఛార్జ్ జూలకంటి బ్రహ్మారెడ్డిని పోలీసులు అక్కడి నుంచి పంపించేశారు. మాచర్ల పట్టణంలో 144 సెక్షన్‌ విధించారు. ఇద్దరు వైసీపీ కార్యకర్తలకు గాయాలు కావడంతో వారిని స్థానికి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.


మాచర్లలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు యత్నించి వారిని వదిలే ప్రసక్తి లేదన్నారు డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డి. ప్రస్తుతానికి అక్కడ శాంతిభద్రతలు అదుపులోనే ఉన్నాయని డీజీపీ... పూర్తి స్థాయి విచారణ చేస్తున్నట్టు వెల్లడించారు. పూర్తి స్థాయి విచారరణకు ఐజీ త్రివిక్రమ్‌ను మాచర్ల పంపించారు. 


ఫ్యాక్షన్ లీడర్ల పనే -ఎస్పీ  
పల్నాడు జిల్లా మాచర్లలో టీడీపీ, వైసీపీ శ్రేణులు మధ్య ఘర్షణకు ఫ్యాక్షన్ లీడర్లే కారణమని పోలీసులు తేల్చారు. ఈ ఘటనపై మాట్లాడిన పల్నాడు జిల్లా ఎస్పీ రవి శంకర్ రెడ్డి... ఫ్యాక్షషన్‌ నేర చరిత్ర ఉన్న వ్యక్తుల రావడంతోనే ఈ పరిస్థితి తలెత్తిందని అన్నారు.