తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, నారా లోకేష్ చేస్తున్న పాదయాత్రపై ఏపీ మాజీ మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు (కొడాలి నాని) ఘాటు వ్యాఖ్యలు చేశారు. గత మూడు వారాలుగా ఒక  బచ్చా పాదయాత్ర జరుగుతోందని వ్యాఖ్యానించారు. దరిద్రం అంటూ లోకేష్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు కొడాలి నాని.
లోకేష్ పాదయాత్రపై కొడాలి నాని పంచ్ లు...
నారా లోకేష్ చేస్తున్న పాదయాత్రపై మాజీ మంత్రి కొడాలి నాని తనదైన శైలిలో కామెంట్స్ చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు మూడు  రోజులుగా ఉమ్మడి  తూర్పు గోదావరి జిల్లాలో  తిరుగుతున్నాడని, అటు కుమారుడు లోకేష్ ను  పట్టించుకోవట్లేదు.. ఇటు బాబు డి ఫాల్టర్ అయ్యాడని అన్నారు. కొడాలి నాని బూతులు మాట్లాడతాడని టీడీపీ  వాళ్ళు  అంటున్నారని, ఇప్పుడు యువగళం పాదయాత్ర చేస్తున్న లోకేష్ భాష ఎలా ఉందని ఆయన ప్రశ్నించారు. ఏపీ సీఎం వైఎస్ జగన్  ను నువ్వు  రాయలసీమలోనే పుట్టావా అని అడుగుతున్నాడని, అదే  మాట మేము అంటే గోల గోల చేస్తున్నారని అన్నారు. జగన్  డీఎన్ఏ రాయలసీమది అయితే, లోకేష్  డీఎన్ఏ  మాత్రం తెలంగాణ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. లోకేష్ తెలంగాణలో పుట్టి ఇక్కడ ఎందుకు  దరిద్రంగా వ్యహరిస్తున్నాడో అర్థం కావటం లేదన్నారు. లోకేష్, చంద్రబాబు ఎక్కడ ఉంటే అక్కడ దరిద్రం అంటూ ఫైర్ అయ్యారు. లోకేష్ ను కనీసం ఎమ్మెల్యేగా అయినా గెలిపించుకోవాలనే తాపత్రయంతో తెలుగుదేశం ప్రయత్నిస్తుందని, అది కలలో కూడా జరగదని కొడాలి నాని అన్నారు. వచ్చే ఎన్నికల్లో లోకేష్ కు, టీడీపీకి డిపాజిట్లు కూడా దక్కే పరిస్థితులు ఉండవని వ్యాఖ్యానించారు.
లోకేష్ పై కన్నబాబు మండిపాటు...
సీఎం  జగన్  పై నోటికి ఏది వస్తే అది  మాట్లాడుతున్నాడని లోకేష్ పై మాజీ మంత్రి కన్నబాబు విరుచుకుపడ్డారు. రోజురోజుకి  దిగజారి మాట్లాడుతున్న లోకేష్ నోరు అదుపులో పెట్టుకోవాలన్నారు. చంద్రబాబు, లోకేష్ లను ఎక్కడికైనా తీసుకెళ్లి చూపించాలంటూ సెటైర్లు వేశారు. ఇదే పద్దతిలో తాము మాట్లాడితే  తట్టుకోగలరా అని ప్రశ్నించారు. కొడాలి  నాని అప్పుడప్పుడు మాట్లాడితే  బూతుల నేత  అంటున్నారని, మరి  చంద్రబాబు, లోకేష్, అయ్యన్నపాత్రుడు భాష ఏంటని ప్రశ్నించారు. నోరు అదుపులో పెట్టుకోవాలని హితవు పలికారు. లోకేష్ బాడీ లాంగ్వేజ్ ఏంటి, సీఎం  జగన్ రాయలసీమలో పుట్టాడా అని  లోకేష్  అడుగుతున్నాడని, సర్టిఫైడ్ సైకో  ఎవరైనా ఉంటే అది చంద్రబాబు ఇంట్లోనేనని విరుచుకుపడ్డారు. లోకేష్, బాలకృష్ణ బిహేవియర్ అందరికీ  తెలుసని, అయ్యన్నపాత్రుడు విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదన్నారు.


టీడీపీ అధినేత, లోకేష్ ఎలాంటి అజెండా లేకుండా అతిథి రాజకీయ నాయకుల్లా ప్రవర్తిస్తున్నారని, ముఖ్యమంత్రి జగన్ పై పనికిమాలిన నినాదాలు చేస్తున్నారని మండిపడ్డారు. యాత్రలకు బదులు, తమ హయాంలో తమను విస్మరించినందుకు వీరిద్దరూ రాష్ట్రంలోని ప్రజలకు క్షమాపణలు చెప్పాలని ఆయన అన్నారు. 2014-19 మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ తీవ్ర కరువును చవిచూసిందని గుర్తు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో మూడున్నరేళ్లలో రాష్ట్రంలో కరువు పరిస్థితులు లేవని, సామర్థ్యానికి తగ్గట్టుగా రిజర్వాయర్లు నిండాయని తెలిపారు. చెప్పుకోదగ్గ విజయాలు లేని ప్రతిపక్ష నాయకుడిది, అత్యంత దౌర్భాగ్యం అయితే జగన్ మోహన్ రెడ్డి ప్రజలకు చేసిన సంక్షేమం అందరికి తెలిసిందేనని అన్నారు. ఎమ్మెల్యే గా కూడా గెలవలేని లోకేష్, ముఖ్యమంత్రిపై ఏ హోదాతో వ్యాఖ్యలు చేస్తున్నారని ప్రశ్నించారు. ప్రతి 30 ఇళ్లకు సాధికార సారథులను నియమిస్తామన్న చంద్రబాబు.. జగన్ సిద్ధాంతాలను  కాపీ కొడుతున్నారని అన్నారు.