ఏపీలో గత ఎన్నికలకు ముందు ప్రతిపక్ష నేతగా సీఎం జగన్‌పై జరిగిన కోడికత్తి దాడి ఘటనలో న్యాయవాది ఇంకొల్లు వెంకటేశ్వర్లు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈయన సీఎం జగన్ తరపు న్యాయవాదిగా ఉన్నారు. 25 - 10 - 2018 న విశాఖపట్నం ఎయిర్ పోర్టులో జరిగిన ఈ హత్యాయత్నం ఘటనపై ఎన్ఐఏ 39 మంది సాక్షులను విచారణ చేసి కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేసిందని తెలిపారు. ఈ ఘటనకు ముందే నిందితుడు శ్రీనివాస్‌కు నేర చరిత్ర ఉందని ఎన్‌ఐఏ ఛార్జ్‌షీట్‌లో దాఖలు చేసిందని వెంకటేశ్వర్లు వెల్లడించారు. 


న్యాయవాది ఇంకొల్లు వెంకటేశ్వర్లు బుధవారం (ఆగస్టు 30) మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జగన్‌పై హత్యాయత్నంపై కేసులో ఎన్‌ఐఏ 39 మంది సాక్షులను విచారణ చేసిందని అన్నారు. ఇప్పటివరకు ఎన్‌ఐఏకి సిట్‌ ఎలాంటి వివరాలు ఇవ్వలేదని అన్నారు. నిందితుడు శ్రీనివాస్‌కు నేర చరిత్ర 2017 నుంచే ఉందని, అతను పదునైన ఆయుధంతో హత్యాయత్నానికి పాల్పడ్డారని ఎన్‌ఐఏ ఛార్జ్‌షీట్‌లో దాఖలు చేసిందని వివరించారు. 2018లో డీజీపీగా ఉన్న వ్యక్తి ఎన్‌ఐఏకి రికార్డ్‌ చేయవద్దని సిట్‌కి ఆదేశాలు ఇచ్చారని గుర్తు చేశారు. అందుకే ఆ రికార్డులను ఎన్‌ఐఏకి పోలీసులు తొలుత అప్పగించలేదని చెప్పారు.


సీఎం జగన్‌పై పక్కా ప్రణాళిక ప్రకారమే దాడి జరిగిందని ఇంకొల్లు వెంకటేశ్వర్లు చెప్పారు. ఇది హత్యాయత్నం అని ఎన్‌ఐఏ కూడా చెప్పిందని అన్నారు. అయితే, ఈ హత్యాయత్నం ఘటనపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఓ ఛానల్‌ ఇంటర్వ్యూలో నిందితుడు శ్రీనివాస్‌ తన నేరాన్ని ఒప్పుకున్నాడని గుర్తు చేశారు. తమ మీదకి కేసు రాకుండా ఉండేందుకే హత్యాయత్నం తీవ్రతను తగ్గించేందుకు కొందరు కేసు మొదటి నుంచి ప్రయత్నిస్తున్నారని అన్నారు.


అసలు నిందితుడు శ్రీనివాస్ ను ఎయిర్‌ పోర్టులోకి రావడమే తప్పుడు మార్గంలో వచ్చాడని అన్నారు. ఎయిర్‌ పోర్టు అథారిటీకి శ్రీనివాస్‌ చాలా మంచివాడని తప్పుడు రిపోర్టు ఇచ్చి ఉద్యోగంలో చేర్చుకున్నారని అన్నారు. శ్రీనివాస్‌ది ఎయిర్‌పోర్టులో ఇల్లీగల్‌ ఎంట్రీ అని.. కత్తితో ఎయిర్‌పోర్టులో శ్రీనివాస్‌ ఎలా తిరిగగలుగుతాడని ప్రశ్నించారు. శ్రీనివాస్‌పై కేసు ఉన్నందుకు ఎయిర్‌ పోర్టులో ఉద్యోగానికి అతను అనర్హుడని అన్నారు. ఎయిర్‌ పోర్టులో ఉద్యోగం చేసే సమయానికి శ్రీనివాస్‌పై అప్పటికే ఓ కేసు పెండింగ్‌లో ఉందని న్యాయవాది తెలిపారు. ప్రభుత్వ ఒత్తిడితో విశాఖ కోర్టుకు కేసు బదిలీ అనేది అబద్దం. ఎలాంటి ఆధారాలు సేకరించకుండానే ఛార్జిషీట్‌ వేశారు.