CM Jagan Review: రాష్ట్రానికి ఆదాయాన్ని సమకూరుస్తున్న శాఖలపై సీఎం వైయస్‌ జగన్‌ సమీక్ష నిర్వ‌హించారు. ఎక్సైజ్, రెవెన్యూ, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్, భూగర్భ గనులు, అటవీ పర్యావరణశాఖ అధికారులతో సమీక్షించిన సీఎంకు అధికారులు వివ‌రాల‌ను అందించారు. ఈ సందర్భంగా సీఎం వైయస్‌.జగన్‌ మాట్లాడుతూ.. పన్నుల వసూళ్లలో పారదర్శకత, పన్నుల విభాగంలో నాణ్యమైన సేవలకు ఉద్దేశించిన పలు నిర్ణయాల అమలు చేయాలని ఆదేశించారు. పన్నుల విభాగంలో డేటా అనలిటిక్స్‌ సెంటర్‌ బలోపేతానికి మరిన్ని చర్యలు తీసుకుంటున్నామని అధికారులు సీఎంకు వివరించారు.


మరింత పారదర్శకత, జవాబుదారీతనం, సమర్థత పెంచి న్యాయపరమైన వివాదాలకు ఆస్కారం లేకుండా, ఆదాయాలు నిలిచిపోకుండా తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు. పన్ను చెల్లింపుదారుల ఫిర్యాదులు, అభ్యంతరాలను ఎప్పటికప్పుడు పరిష్కరించి ,రాబడులు ఎప్పటికప్పుడు వచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. తప్పుడు బిల్లులు లేకుండా, పన్ను ఎగవేతలకు ఆస్కారం లేకుండా మంచి విధానాలను రూపొందించుకోవాలని అన్నారు. ప్రస్తుతం ఉన్న అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకోవాలని అన్నారు.


ఎక్సైజ్‌ శాఖపైనా సీఎం సమీక్ష
అక్రమ మద్యం తయారీ, రవాణాలను నిరోధించాలని సీఎం స్ప‌ష్టం చేశారు. బెల్టుషాపులు, గ్రామాల్లో అక్రమ మద్యం నిరోధంలో మహిళా పోలీసులది కీలకపాత్ర అని, దీనిపై గ్రామ సచివాలయంలో మహిళా పోలీసుకు సంబంధించి ఒక ఎస్‌ఓపీ రూపొందించాలన్నారు. అక్రమ మద్యం తయారీ, అమ్మకాలకు సంబంధించి క్రమం తప్పకుండా వారి నుంచి నివేదికలు తీసుకోవాలని సీఎం అన్నారు.


సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలపైనా సమీక్ష
సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో అవినీతి నివారణకు పటిష్ట చర్యలు తీసుకోవాల‌ని సీఎం మ‌రో సారి స్ప‌ష్టం చేశారు. సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్న అధికారులు, సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయం, ఎమ్మార్వో, ఎండీఓ, ఆర్డీఓ, కలెక్టర్‌ కార్యాలయాలతో పాటు అవినీతి జరగడానికి అవకాశం ఉన్న అన్ని ప్రభుత్వ కార్యాలయాలపై మరింత ఫోకస్‌ పెట్టాలని సీఎం ఆదేశించారు. 14400 ఏసీబీ ఫోన్ నెంబరుతో పోస్టర్‌లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో స్పష్టంగా కనిపించేలా ఈ నెంబరుపోస్టర్‌ను డిస్‌ప్లే చేయాలని ఆదేశం, ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా ఈ నెంబరు డిస్‌ప్లే చేయాలని అన్నారు.


పటిష్టమైన చర్యల ద్వారానే అవినీతిని రూపుమాపగలుగుతామన్న సీఎం, 14400 ఫోన్‌ కాల్స్‌ను రిసీవ్‌ చేసుకోవడంతో పాటు వాటికి సంబంధించిన యాక్షన్‌ టేకెన్‌ రిపోర్టు పై కూడా పక్కాగా ఉండాలన్నారు. గ్రామ సచివాలయంలో రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో ఏయే సేవలు అందుబాటులో ఉంటాయన్నది పోస్టర్ల రూపంలో డిస్‌ప్లే చేయాలన్న సీఎం, రిజిస్ట్రేషన్‌ చేసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను ప్రజలకు అర్ధమయ్యేలా పోస్టర్ల రూపంలో ప్రదర్శించాలని అన్నారు. అప్పుడే ప్రజలు ముందుకు వస్తారని సీఎం అన్నారు.


51 గ్రామాల్లోని గ్రామ, వార్డు సచివాలయాల్లో ఇప్పటికే రిజిస్ట్రేషన్లు విజయవంతంగా జరుగుతున్నాయని  అధికారులు తెలిపారు. మరో 650 గ్రామాల్లోని గ్రామ, వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్‌ కోసం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశామని అధికారులు చెప్పారు. వీటికి అదనంగా 2 వేల గ్రామాల్లోని గ్రామ, వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్‌ కోసం అక్టోబరు 2, 2022 నాటికి సిద్ధం చేస్తామని అధికారులు తెలిపారు. రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని సీఎం ఆదేశించారు.


అటవీ పర్యావరణ శాఖపైనా సీఎం సమీక్ష
త్వరలోనే రెడ్‌ శాండిల్‌ ఆక్షన్ గ్లోబల్‌ టెండర్‌ కోసం కేంద్రం నుంచి అనుమతులు లభించనున్నాయని అధికారులు తెలిపారు. ప్రస్తుతం అటవీశాఖ ఆధ్వర్యంలో ఉన్న స్టాక్‌ను భద్రపరచడంలో జాగ్రత్తగా వ్యవహరించాలన్న సీఎం, ప్రతి నెలా స్టాక్‌కు సంబంధించిన వివరాలు చెక్‌ చేసుకుంటూ.. వివరాలు నమోదు చేయాలని అన్నారు.


అగ్రిగోల్డ్‌ ఆస్తుల వేలంపైనా సమీక్ష
గతంలో ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటికే ప్రభుత్వం అగ్రిగోల్డ్‌ బాధితులకు రూ.905.57 కోట్ల డబ్బును చెల్లించిందని సీఎం అన్నారు. అన్ని రకాల వివాదాలను త్వరితగతిన పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్ళాల‌ని ముఖ్యమంత్రి అభిప్రాయ‌ప‌డ్డారు.