అమరావతిలోని ఆర్‌-5జోన్‌లో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించారు.  తుళ్లూరు మండలం వెంకటాయ­పాలెం వద్ద ఏర్పాటు చేసిన వేదికపై నుంచి లబ్ధిదారులకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తారు. అక్కడే నిర్మించిన టిడ్కో ఇళ్లను కూడా లబ్ధిదారులకు అందజేస్తారు. 


సీఆర్డీఏ పరిధిలోని నిడమర్రు, కృష్ణఆయపాలెం, నవులూరు, ఐనవోలు, మందడం, కురగల్లు, యర్రబాలెం, పిచ్చుకలపాలెం, బోరుపాలెం, నెక్కల్లు, అనంతవరంలో 51,392 మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తున్నారు. ఈ లబ్ధిదారులంతా ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలకు చెందినవారు. వీల్లకు ఒక్కొక్కరికి సెంటు స్థలాన్ని ఇంటి కోసం అందిస్తోంది ప్రభుత్వం. మొత్తం  25 లేఅవుట్లలో ప్లాట్లు కేటాయించింది


అమరావతిలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి దేశ చరిత్రలో ప్రత్యేకత ఉందన్నారు సీఎం జగన్. పేదలకు ఇళ్లస్థలాలు ఇవ్వాలని వేల పోరాటాలు దేశంలో చాలా జరిగాయని గుర్తు చేశారు. కానీ, పేదలకు ప్రభుత్వమే ఇళ్లస్థలాలు ఇవ్వడానికి సుదీర్ఘ న్యాయపోరాటం చేయాల్సి వచ్చిందన్నారు. సుప్రీంకోర్టుకు వెళ్లిమరీ.. 50వేల మందికి ఇళ్లస్థలాలు ఇవ్వడం ఒక చారిత్రక ఘటంగా అభివర్ణించారు. ఇలాంటివి చూస్తే ఆశ్చర్యం కలుగుతోందన్నారు. 


పెదలకు ఇళ్లస్థలాలు ఇవ్వకుండా రాక్షసులు అడ్డుపడ్డారని ప్రతిపక్షాలను ఉద్దేశించి జగన్ విమర్శించారు. ఈ ప్రాంతంలో గజం ధర 15 వేల నుంచి 20 వేల వరకు ఉంటుందన్నారు. అంటే ఒక్కొక్కరికి 7 నుంచి 10 లక్షల రూపాయల విలువైన ఇంటి స్థలాన్ని ఇస్తున్నట్టు చెప్పుకొచ్చారు. సామాజిక పత్రాలుగా ఈ ఇంటి పత్రాలు ఇస్తున్నట్టు అభిప్రాయపడ్డారు. ఇదే అమరావతి.. ఇకమీదట ఒక సామాజిక అమరావతి అవుతుందన్నారు. ఇకపై మన అందరి అమరావతి అవుతుందని చెప్పారు. 


మంగళగిరి, తాడికొండ నియోజకవర్గాల్లోని 1400 ఎకరాల్లో 50వేల మందికి ఇంటి స్థలాలు ఇస్తున్నామన్నారు సీఎం జగన్. 25 లే అవుట్లలో ఇంటి పట్టాలు ఇస్తున్నట్టు వివరించారు. వారంరోజులపాటు ఈ పండుగ కార్యక్రమం జరుగుతోందన్నారు. ప్రతి లే అవుట్‌ దగ్గరకు లబ్ధిదారులను తీసుకెళ్లి.. వారికిస్తున్న ఇంటి స్థలం చూపించి.. ఇంటి పట్టా ఇస్తామన్నారు. అక్కడే ఫోటో తీసుకుని చిరునువ్వులు వారి ముఖంలో చూసేలా కార్యక్రమం ఉంటుందన్నారు. 


జియో ట్యాగింగ్‌ తీసుకుని.. వారంరోజుల్లో పట్టాల పంపిణీ కార్యక్రమాలు పూర్తవుతాయన్నారు సీఎం జగన్. ఇళ్ల నిర్మాణానికి అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పిస్తాంమన్నారు. జులై 8న అంటే వైఎస్‌ ఆర్‌ జయంతి రోజున ఇళ్ల స్థలాల్లో ఇల్లు మంజూరు చేస్తామన్నారు ఇల్లు కట్టించే కార్యక్రమం మొదలవుతుందని తెలిపారు. 


ఇప్పటికే ఇళ్ల పట్టాల పంపిణీ జరిగే కార్యక్రమంలో ల్యాండ్‌ లెవలింగ్‌, సరిహద్దు రాళ్లను పాతడం, అంతర్గత రోడ్ల నిర్మాణం పూర్తైందన్నార సీఎం జగన్. ఇళ్ల నిర్మాణంపై లబ్ధిదారులకు మూడు ఆప్షన్లు ఇస్తామన్నారు. తాము కట్టుకుంటామంటే.. రూ.1.8లక్షలు బ్యాంకుల ఖాతాల్లో వేస్తామన్నారు. రెండో ఆప్షన్‌గా వారికి కావాల్సిన సిమెంటు, ఇసుక, స్టీల్‌ లాంటి నిర్మాణ సామగ్రి అందిస్తామని తెలిపారు. నిర్మాణకూలి వారి ఖాతాల్లోకి నేరుగా జమచేస్తామని వివరించారు. ఆప్షన్‌ 3గా ప్రభుత్వమే కట్టించాలని అడిగితే ఇళ్ల నిర్మించిన ఇస్తామన్నారు సీఎం జగన్. ఇందులో అక్క చెల్లెమ్మలు ఏ ఆప్షన్‌ తీసుకున్నా ఫర్వాలేదన్నారు. 


ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన ఇసుక పూర్తిగా అందజేస్తామన్నారు సీఎం జగన్. సిమెంటు, స్టీల్‌, డోర్‌ ఫ్రేములు అన్నీ కూడా తక్కువ రేటుకే అందరికీ అందిస్తామన్నారు. మార్కెట్‌ రేట్‌ల కన్నా తక్కువకే ప్రభుత్వం ఇవన్నీ అందిస్తుందన్నారు. నాణ్యత విషయలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడ్డబోమన్నారు. రూ.35వేలు చొప్పున రుణాలు లబ్ధిదారులకు బ్యాంకుల నుంచి ఇచ్చేలా చేస్తున్నామని వాటిని పావలావడ్డీకే ఇస్తున్నట్టు వివరించారు. ఇల్లు పూర్తైన తర్వాత ఇంటి విలువ.. ప్రాంతాన్ని బట్టి రూ.5 లక్షల నుంచి రూ.10లక్షల వరకూ ఉంటుందన్నారు సీఎం. రూ.2-3 లక్షల కోట్లు మీ చేతిలో పెడుతున్నామన్నారు.