AP News: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు భేటీ అయ్యారు. సచివాలయంలో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ, సీఆర్డీఏ కమిషనర్ కాటమనేని భాస్కర్ తో కలిసి వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులతో కలిసి సీఎం చంద్రబాబు నాయుడుతో సోమవారం ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులు భేటీ అయ్యారు. నలుగురు సభ్యులతో కూడిన ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల బృందం గత రెండు రోజులుగా అమరావతిలో పర్యటిస్తోంది. ఈ బృందంలో వరల్డ్ బ్యాంక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సీనియర్ స్పెషలిస్ట్ రఘు కేశవన్, లీడ్ ట్రాన్స్‌పోర్ట్ స్పెషలిస్ట్ గెరాల్డ్ పాల్ అలీవియర్, సీనియర్ అర్బన్ స్పెషలిస్ట్ కింగ్ యున్ షెన్, సౌత్ ఏషియా అర్బన్ ప్రాక్టీస్ మేనేజర్ అబేదాలి రజాక్ ఎఫ్.ఖలీల్ ఉన్నారు. 


మూడు రోజుల పర్యటనలో భాగంగా శనివారం విజయవాడ వచ్చిన ప్రపంచ బ్యాంక్ బృందం.. మధ్యాహ్నం వరకూ విజయవాడ సీఆర్డీఏ ప్రధాన కార్యాలయంలో అధికారులతో సమావేశం అయ్యారు. సీఆర్డీఏ గురించి అమరావతి ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితి గురించి అధికారులు బృందానికి వివరించారు. శనివారం మధ్యాహ్నం అమరావతిలో క్షేత్ర స్థాయిలో పర్యటించి నిర్మాణంలో ఉన్న భవనాలను పరిశీలించారు. రెండో రోజు ఆదివారం రాజధానిలోని రోడ్లను, కొండవీటి వాగు ఎత్తిపోతల పంప్ హౌస్ ను పనులను పరిశీలించడంతో పాటు విట్, ఎస్ఆర్ఎం, ఎయిమ్స్ లను పరిశీలించారు. 


సోమవారం (ఆగస్టు 12) సెక్రటేరియట్ లో సీఎం చంద్రబాబుతో వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులు భేటీ అయ్యారు. ప్రపంచ స్థాయి రాజధానిగా అమరావతి నిర్మాణంలో ఎలా ముందుకెళ్తుందనేదానిపై వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులకు సీఎం వివరించారు. ప్రపంచంలోని ఉత్తమ ప్రమాణాలు, ఆధునిక టెక్నాలజీని ఉపయోగించుకుని అమరావతి నిర్మాణం చేపడుతున్నట్లు సీఎం చంద్రబాబు వివరించారు.