Pinnelli Ramakrishna Reddy: అమరావతి: ఈవీఎం ధ్వంసం చేసిన ఘటనలో వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు.మే 13న ఎన్నికల రోజు పోలింగ్ బూత్ లోకి వెళ్లి ఓ ఈవీఎంను నేలకేసి కొట్టి ధ్వంసం చేశారు. అక్కడున్న వారిని బెదిరించి వెళ్లిపోవడం సీసీటీవీ ఫుటేజీలో చూడవచ్చు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

 

వెబ్ కాస్టింగ్‌తో దొరికిపోయిన నేత ! 

మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గంలోని పీఎస్‌ నంబర్‌ 202తో పాటు 7 పోలింగ్‌ కేంద్రాల్లో పోలింగ్ రోజున ఈవీఎంల ధ్వంసం జరిగింది.  పీఎస్‌ నంబర్‌ 202 లో జరిగిన ఘటనలో సిట్టింగ్‌ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వెబ్‌ కెమెరాలో రికార్డ అయ్యారు. ఈవీఎంల ధ్వంసం ఘటనకు  సంబంధించి కేసు దర్యాప్తులో సహకరించేందుకు పల్నాడు జిల్లా ఎన్నికల అధికారులు అన్ని పోలింగ్ స్టేషన్ల వీడియో ఫుటేజీని పోలీసులకు అందజేశారు. విచారణలో భాగంగా ఈవీఎం పగలగొట్టిన వైసీపీ ఎమ్మెల్యే పేరును నిందితుడిగా చేర్చినట్లు పోలీసులు తెలిపారు.

 


ఈ విషయాన్ని ఈసీ చాలా తీవ్రంగా పరిగణించింది. ఈ ఘటనల్లో ప్రమేయం ఉన్న వ్యక్తులు అందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీని సీఈవో ముఖేష్ కుమార్ మీనా ఆదేశించారు. కఠిన చర్యలు తీసుకుంటేనే భవిష్యత్తులో ఎన్నికలు శాంతియుతంగా నిర్వహించే విషయంలో ఎవరూ ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడరని ఈసీ భావిస్తోంది. 

 

ఏపీ డీజీపీకి సిట్ నివేదిక.. 

ఏపీలో ఎన్నికల సమయంలో చెలరేగిన అల్లర్లు, హింసపై ఏర్పాటు చేసిన సిట్ టీమ్.. తిరుపతి, అనంతపురం, పల్నాడు, జిల్లాల్లో 33 ఘటనలు నమోదైనట్లు గుర్తించింది. సిట్ ప్రాథమిక నివేదిక ప్రకారం పోలింగ్ హింసపై 33 కేసులు నమోదు కాగా, మొత్తం నిందితులు 1370 మంది ఉన్నారు. మొత్తం 33 కేసులు నమోదు కాగా, అందులో అధికంగా పల్నాడు జిల్లాలో 22 కేసులు, అనంతపురంలో 7, తిరుపతి జిల్లాలో 4 కేసులు నమోదు అయినట్లు సిట్ పేర్కొంది. ఎన్నికల సమయంలో హింసాత్మక ఘటనలు జరుగుతాయని తెలిసినా కొందరు పోలీసులు, అధికారులు నిర్లక్ష్యం చేశారని సిట్ బృందం పేర్కొంది.