అమరావతి: వివిధ ప్రభుత్వ శాఖలు అందించే పౌర సేవలను మరింత మెరుగ్గా అందించాలని అధికారులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. సోమవారం సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్స్ (RTG) కేంద్రంలో పలు అంశాలపై అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు సమర్థంగా ప్రజల్లోకి వెళ్లాలని సూచనలు జారీ చేశారు. సీఎం చంద్రబాబు అధికారులతో మాట్లాడుతూ, ప్రజామోదం మేరకే మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో పనులు చేపట్టేలా చూడాలని ఆదేశించారు. అదేవిధంగా, గ్రామీణ ప్రాంతాల్లోనూ గ్రామ సభల అనుమతి లేకుండా పనులు చేపట్టవద్దని, నరేగా (NREGA) పనులకూ ఇదే నిబంధన వర్తించేలా చూడాలని స్పష్టం చేశారు.
జవాబుదారీతనం, పారదర్శకత ఉండాలి..
మంత్రులు, ప్రజా ప్రతినిధులు క్షేత్రస్థాయిలో పర్యటించి సమర్థంగా వివిధ అంశాలను ప్రజల ముందు ఉంచాలని సీఎం చంద్రబాబు సూచించారు. ప్రభుత్వ విభాగాలు సాంకేతికతను మరింతగా అందిపుచ్చుకోవడంతో పాటు సామర్థ్యాలను పెంచుకోవాలని పేర్కొన్నారు. సుపరిపాలన లాంటి మోడల్ ఆఫ్ గవర్నెన్స్ ద్వారానే ప్రజల్లో సంతృప్తి స్థాయి పెరుగుతుందని, క్షేత్రస్థాయిలో ప్రజలకు మంచి సేవలు అందించడం ద్వారానే దీనిని సాధించవచ్చని చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రభుత్వ పథకాల అమలు, పౌరసేవలకు సంబంధించి ప్రతి అంశంలోనూ జవాబుదారీతనం కీలకమైన అంశంగా పరిగణించాలన్నారు. దీనికి సంబంధించి 175 నియోజకవర్గాల్లోనూ కెపాసిటీ బిల్డింగ్ (సామర్థ్య పెంపు) కూడా జరగాలని అన్నారు. ప్రజల్లో సానుకూలత పెరిగేలా సూక్ష్మ స్థాయి వరకు విశ్లేషణ జరగాలని సూచించారు.
ఇటీవల రాష్ట్రంలో మొక్కజొన్న, కాటన్ (పత్తి), అరటి పంటల్లోని సమస్యను పరిష్కరించి రైతులకు ధర దక్కేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ప్రభుత్వ శాఖలు ఆర్థిక, ఆర్థికేతర అంశాలను ప్రాధాన్యతా క్రమంలో పనులు పూర్తి చేయాలని, తద్వారా ప్రజల్లో సానుకూల ధోరణి పెరిగేందుకు వీలుగా కార్యాచరణ ఉండాలన్నారు. నిరంతరం డేటా ఆధారిత నిర్ణయాలు తీసుకునేలా ప్రణాళికలు ఉండాలని సూచించారు. పౌర సేవల్ని అందించటంలో నిర్లక్ష్యంగా ఉన్నవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
టెక్నాలజీ, పర్యవేక్షణ చర్యలుత్వరలో ప్రజలకు అందుబాటులోకి 'అవేర్ యాప్' తీసుకురావాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. వాతావరణ హెచ్చరికలు సహా 42 అంశాల్లో నిరంతర సమాచారం కోసం ఈ యాప్ను ప్రజల వినియోగం కోసం విడుదల చేయాలన్నారు. అన్ని ప్రభుత్వ శాఖలూ డేటా లేక్కు అనుసంధానం కావాలని సూచించారు. రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లో బ్యాండ్ విడ్త్ కనెక్టివిటీని పెంచాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా సంక్షేమ హాస్టళ్లలోని తాగు నీరు, పరిశుభ్రత తదితర అంశాలపై పర్యవేక్షణ జరగాలని సూచించారు. దీనిపై ఓ యాప్ను రూపొందించి రోజువారీగా తనిఖీ చేస్తున్నామని అధికారులు సీఎం చంద్రబాబుకు వివరించారు.
దేవాలయాలు, పర్యావరణంతిరుమలలో టీటీడీ భక్తులకు అందించే సేవలు, క్రౌడ్ మేనేజ్మెంట్, సెక్యూరిటీ లాంటి అంశాలను అధ్యయనం చేసి ఇతర దేవాలయాల్లో అమలు చేయాలని చంద్రబాబు సూచించారు. కాలుష్య నియంత్రణ మండలితో కలిసి ఎయిర్ క్వాలిటీ సెన్సార్లను ఏర్పాటు చేసి ఆ వివరాలను కూడా ప్రజలకు అందించాలన్నారు. సుపరిపాలనా అంశాలపై డిసెంబరులో ఎమ్మెల్యేలు, ఎంపీలతో వర్క్షాప్ నిర్వహించనున్నట్టు సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.