ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) విడుదల చేసిన అసిస్టెంట్‌ మోటార్‌ వాహన ఇన్‌స్పెక్టర్‌(ఏఎంవీఐ) నోటిఫికేషన్‌ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తాత్కాలికంగా సస్పెండ్ చేసింది. క్వశ్చన్‌ పేపర్ ఇంగ్లీష్‌లోనే ఉంటుందన్న ప్రకటనపై తూర్పుగోదావరి జిల్లాకు చెందిన కాశీ ప్రసన్నకుమార్‌ హైకోర్టులో పిటిషన్ వేశారు. గతంలో కోర్టు తీర్పులకు వ్యతిరేకంగా క్వశ్చన్‌ పేపర్ ఇస్తామని చెప్పడాన్ని పిటిషనర్‌ తరఫు న్యాయవాది తప్పుబట్టారు. క్వశ్చన్‌ పేపర్‌ ఇవ్వడం రాజ్యాంగ విరుద్దమని వాదనలు వినిపించారు. ఈ వాదనలతో ఏకీభవించిన ధర్మాసనం నోటిఫికేషన్‌ను సస్పెండ్‌ చేసింది. కౌంటర్‌ వేయాలని ప్రతివాదులను ఆదేశించింది.


ఇటీవలే నోటిఫికేషన్ 


ఆంధ్రప్రదేశ్‌లోని ట్రాన్స్‌పోర్ట్ సబార్డినేట్ సర్వీసులో అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ పోస్టులు భర్తీకి ఇటీవలే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీని ద్వారా మొత్తం పదిహేడు పోస్టులను భర్తీ చేయనుంది. రాత పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి నవంబరు 2న ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అభ్యర్థులు నవంబరు 21లోగా నిర్ణీత ఫీజు చెల్లించి, నవంబరు 22 వరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫీజుగా రూ.250, పరీక్ష ఫీజుగా రూ.80 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎక్స్-సర్వీస్‌మెన్, తెల్లరేషన్ కార్డుదారులు, నిరుద్యోగ యువతకు పరీక్ష ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చారు.


పోస్టుల వివరాలు...


* అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ (రవాణా శాఖ)


ఖాళీల సంఖ్య:  17 పోస్టులు (క్యారీడ్ ఫార్వర్డ్-02, కొత్తవి-15)


అర్హతలు: బ్యాచిలర్ డిగ్రీ (మెకానికల్ ఇంజినీరింగ్/ఆటోమొబైల్ ఇంజినీరింగ) లేదా డిప్లొమా(ఆటోమొబైల్ ఇంజినీరింగ్). మోటారు డ్రైవింగ్ లైసెన్స్‌తో పాటు మోటారు వాహనాలు నడపడంలో మూడేళ్ల అనుభవం, హెవీ ట్రాన్స్‌పోర్ట్ వాహనాల ఎండార్స్‌మెంట్ కలిగి ఉండాలి.


వయోపరిమితి: ‌01.07.2022 నాటికి 21-36 ఏళ్ల మధ్య ఉండాలి.


దరఖాస్తు విధానం:  ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.


ఎంపిక విధానం: రాత పరీక్ష(ఆబ్జెక్టివ్ టైప్ పేపర్-1, పేపర్-2), మెడికల్ ఫిట్‌నెస్, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా.


పరీక్ష విధానం: మొత్తం 300 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. పేపర్-1 150 మార్కులు, పేపర్-2 150 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు.  ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు. ఒక్కో పేపర్‌కు 150 నిమిషాల సమయం కేటాయిస్తారు.


దరఖాస్తు, పరీక్ష ఫీజు: అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.250, పరీక్ష ఫీజుగా రూ.80 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎక్స్-సర్వీస్‌మెన్, తెల్లరేషన్ కార్డుదారులు, నిరుద్యోగ యువతకు పరీక్ష ఫీజు నుంచి మినహాయింపు ఉంది.


జీత భత్యాలు: నెలకు రూ.31,460-రూ.84,970.


ముఖ్యమైన తేదీలు...


ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 02.11.2022.


ఫీజు చెల్లింపు చివరి తేది: 21.11.2022.


ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేది: 22.11.2022.