AP State Investment Promotion Board Meeting: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ అధ్యక్షతన తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో స్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్‌ బోర్డు (ఎస్‌ఐపీబీ) అధికారులు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోకి రాబోయే పెట్టుబడులకు సంబంధించి ఎస్ఐపీబీ ఆమోదం తెలిపింది. ఇంధన రంగంలో రూ.22,302 కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని.. వీటి ద్వారా ప్రత్యక్షంగా 5,300 మందికి ఉద్యోగాలు లభిస్తాయని అధికారులు చెప్పారు. 


ఎస్‌ఐపీబీ సమావేశంలో ఆమోదం పొందిన ప్రాజెక్టులు ఇవీ


3350 మెగావాట్ల సోలార్‌ ప్రాజెక్ట్‌లను జేఎస్‌డబ్ల్యూ నియో ఎనర్జీ లిమిటెడ్‌ సంస్థ  ఏర్పాటు చేయనుంది. వైయస్సార్‌ జిల్లా చక్రాయపేట వద్ద 400 మెగావాట్లు, సత్యసాయి జిల్లా ముదిగుబ్బవద్ద 1050 మెగావాట్లు, అనంతపురం జిల్లా కనగానపల్లె, రాప్తాడుల్లో 1050 మెగావాట్లు, అనంతపురం జిల్లాలో డి.హీరేహాల్, బొమ్మనహాళ్‌ 850 మెగావాట్ల సోలార్‌ ప్లాంట్ల ఏర్పాటు చేయనుంది. దాదాపు రూ.12,065 కోట్ల పెట్టుబడులు జేఎస్‌డబ్ల్యూ నియో ఎనర్జీ లిమిటెడ్‌ నుంచి రానున్నాయి. ఈ ప్లాంట్ల ఏర్పాటు ద్వారా 3300 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు లభించనున్నాయి.


నంద్యాల జిల్లా అవుకు మండలం కునుకుంట్ల, కర్నూలు జిల్లా ప్యాపిలిమండలం జలదుర్గం వద్ద రెండు విండ్‌పవర్‌ ప్రాజెక్టులను జేఎస్‌డబ్ల్యూ నియో ఎనర్జీ లిమిటెడ్‌  ఏర్పాటు చేయనుంది. మొత్తం 171.60 మెగావాట్ల విండ్‌ పవర్‌ ప్రాజెక్టులు ఏర్పాటు అవుతాయి. దీనికోసం రూ.1287 కోట్ల పెట్టుబడి, ప్రత్యక్షంగా 200 మందికి ఉద్యోగాలు రానున్నాయి.


శ్రీ సత్యసాయి జిల్లా తలుపుల మండలం పులిగుండ్లపల్లెలో 1000 మెగావాట్ల సోలార్‌ ప్రాజెక్ట్‌ను ఆగ్వాగ్రీన్‌ ఇంజినీరింగ్‌ మేనేజ్‌మెంట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం రూ.4 వేల కోట్లు కంపెనీ ఖర్చు చేయనుంది. ఈ ప్రాజెక్టు ద్వారా వెయ్యి మందికి ప్రత్యక్షంగా ఉద్యోగావకాశాలు దక్కుతాయి.


కర్నూలు జిల్లా ఆస్పరి వద్ద 200 మెగావాట్ల విండ్‌పవర్‌ ప్రాజెక్ట్‌ను ఎక్రోన్‌ ఎనర్జీ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఏర్పాటు చేయనుంది. రూ.1350 కోట్లు ఖర్చు, 200 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు లభించనున్నాయి.


శ్రీ సత్యసాయి, అనంతపురం జిల్లాల్లో 600 మెగావాట్ల విండ్‌ పవర్‌ ప్రాజెక్ట్‌లను రెన్యూ విక్రం శక్తి ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ ఏర్పాటు చేయనుంది. దీని కోసం రూ.3600 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. దీని ద్వారా 600 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు లభించనున్నాయి.