Andhra Pradesh Rajya Sabha Elections:ఆంధ్రప్రదేశ్లో రాజ్యసభ సీట్ల పంపకం సజావుగా సాగిపోయింది. టీడీపీకి మూడు సీట్లు దక్కగా, జనసేనకు ఒక సీటు కేటాయించారు. ఇక్కడ మొన్నటి వరకు తనకు ఒక సీటు కావాలని పట్టుబట్టింది. తీరా పంపకాల టైంలో వెనక్కి తగ్గింది. తన సీటును త్యాగం చేసింది. తమిళనాడులో జరుగుతున్న పరిణామాలతో బీజేపీ వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది.
రాజ్యసభ సీటు వదులుకున్న బీజేపీ
ఆంధ్రప్రదేశ్లో ఖాళీ అవుతున్న నాలుగు రాజ్యసభ స్థానాలకు సంబంధించిన ఎన్డీఏ కూటమి మధ్య సీట్ల పంపకాల ఫార్ములా గురువారం రాత్రి ఖరారు అయ్యింది. గతంలో అనుకున్న ఒప్పందం ప్రకారం బీజేపీకి ఒక సీటు దక్కాల్సి ఉండగా, తాజా పరిణామాలతో ఆ స్థానాన్ని బీజేపీ వదులుకుంది. గతంలో ఒక సీటు బీజేపీకి, మరొకటి జనసేనకు, మిగిలిన రెండు టీడీపీకి ఇవ్వాలని భావించారు. కానీ ఇప్పుడు బీజేపీ తన క్లెయిమ్ను ఉపసంహరించుకోవడంతో టీడీపీ లాభపడింది.
అన్నామలై ఎఫెక్ట్తో...
ఈ కీలక మార్పు వెనుక ప్రధానంగా తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు కే. అన్నామలై వ్యవహారం ఉన్నట్టు తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ఏపీ నుంచి బీజేపీకి దక్కాల్సిన ఆ ఒక్క రాజ్యసభ సీటును అన్నామలై కోసం కేటాయించాలని అధిష్ఠానం తొలుత భావించింది.
అయితే కొన్ని రోజులుగా అన్నామలై పార్టీ వీడుతున్నారనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. ఆయన మంగళవారం ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్, బీఎల్ సంతోష్లో వరుస భేటీలు నిర్వహించారు. ఈ చర్చల సందర్భంగా తన రాజీనామా నిర్ణయాన్ని తెలియజేసినట్టు సమాచారం. తమిళనాడు రాజకీయ పరిస్థితులపై వివరణ ఇస్తూ, పార్టీ నుంచి తప్పుకోవాలని తన ఆలోచనను నేతలకు వివరించారు. అన్నామలై ఎగ్జిట్ ఖాయమనే సంకేతాలు రావడంతో ఏపీలో ఆ సీటును క్లెయిమ్ చేయకూడదని బీజేపీ నిర్ణయించింది.
జనసేన- టీడీపీలో జోష్
జనసేనకు ఒక సీటు దక్కడం ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన అద్భుత విజయానికి గుర్తింపుగా, పెద్దల సభలో జనసేన గళం వినిపించే అవకాశం దక్కింది. టీడీపీ మూడు సీట్లను కైవసం చేసుకోవడం ద్వారా ఢిల్లీ స్థాయిలో చంద్రబాబు తన రాజకీయ పరపతిని మరింత పెంచుకోనున్నారు.
మూడు పార్టీల మధ్య సమన్వయ సమావేశం
గురువారం అమరావతిలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మాధవ్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో రాజ్యసభ ఎన్నికల వ్యూహంపై సుదీర్ఘంగా చర్చించారు. కూటమి మధ్య సమన్వయాన్ని పెంపొందించడం, మిత్రపక్షాల బలాన్ని బట్టి సీట్లను సర్దుబాటు చేయడంపై ఏకాభిప్రాయానికి వచ్చారు.
మూడు ప్రాంతాల్లో సభలు
ఈ సమావేశంలో కేవలం సీట్ల పంపకాలే కాకుండా భవిష్యత్ కార్యచరపై కూడా నిర్ణయాలు తీసుకున్నారు. కూటమి ఐక్యతను చాటిచెప్పేలా ఈ నెల చివర్లో తిరుపతి, అమరావతి, విశాఖపట్నంలో భారీ బహిరంగ సభలు నిర్వహించాలని నిర్ణయించారు.
