AP Cabinet News: ఆంధ్రప్రదేశ్‌లో కొత్త కేబినెట్‌ ఏర్పాటు ప్రక్రియలో భాగంగా పాత మంత్రుల రాజీనామాలు శనివారం గవర్నర్ కార్యాలయానికి చేరాయి. ఆదివారం (ఏప్రిల్ 10) గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ 24 మంది మంత్రుల రాజీనామాలను ఆమోదించనున్నారు. ఇందుకు సంబంధించి వెంటనే గెజిట్‌ విడుదల కానుంది. కొత్త మంత్రులు ఎవరనేది ఈరోజు సాయంత్రం లేదా రేపు గవర్నర్‌కు జాబితా చేరే అవకాశం ఉంది. 


కొత్త మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని సోమవారం (ఏప్రిల్ 11) ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఆ ప్రమాణస్వీకార కార్యక్రమానికి చురుగ్గా ఏర్పాట్లు సాగుతున్నాయి. ఈ ప్రమాణస్వీకారానికి వచ్చే అతిథుల కోసం ప్రత్యేక పాసులను సిద్ధం చేశారు. వెలగపూడిలోని సచివాలయం పక్కనున్న ఖాళీ ప్రదేశంలో ఈ కార్యక్రమం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అందుకోసం పటిష్ఠ భద్రత ఏర్పాటు చేయాలని సీఎస్ ఆదేశాలు జారీ చేశారు. ప్రమాణస్వీకారం అనంతరం కొత్త, పాత మంత్రులు, అతిథులకు ముఖ్యమంత్రి తేనీటి విందు (టీ పార్టీ) ఇవ్వనున్నారు. గవర్నర్‌ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.


వేదికపై ప్రమాణ స్వీకారం చేసే కొత్త మంత్రులు, వారి కుటుంబ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూర్చోవడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ) కూడా పాసులను సిద్దం చేసింది. ఇప్పటికే కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఛైర్మన్లు, అధికారులకు ఆహ్వానాలు పంపారు. ఈ కార్యక్రమానికి వచ్చే ఆహ్వానితులను ఏఏ, ఏ-1, ఏ-2, బీ-1, బీ-2 కేటగిరీలుగా విభజించి, పాసులు జారీ చేశారు. ఒక్కో పాసు ద్వారా ఒక్కరికి మాత్రమే అనుమతి ఉంటుందని పేర్కొన్నారు. కార్యక్రమానికి 35 నిమిషాల ముందే సీట్లలో ఆసీనులు కావాలని సూచించారు.


తుది జాబితా తర్వాత వ్యక్తిగతంగా ఫోన్లు
ఏపీ క్యాబినెట్ ఏర్పాటుపై సీఎం జగన్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో శనివారమే చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. అనంతరం సజ్జల మీడియాతో మాట్లాడుతూ.. తమ పార్టీ సిద్ధాంతం ప్రకారం సామాజిక న్యాయం పాటిస్తూ ముఖ్యమంత్రి జగన్ అన్ని వర్గాలకు సమన్యాయం చేస్తారని అన్నారు. మంత్రి వర్గ కూర్పు ఆఖరి నిమిషం వరకూ ఉంటుందని, నేటి మధ్యాహ్నం వరకు కసరత్తు ఉంటుందని తెలిపారు. కొత్త మంత్రుల జాబితా ఫైనల్ అయిన తరువాత వారికి వ్యక్తిగతంగా ఫోన్ ద్వారా తెలియజేస్తారని సజ్జల చెప్పారు. మహిళలకు సముచిత స్థానం ఉంటుందని.. ఎవరినీ బుజ్జగించాల్సిన అవసరం లేదని అనుకుంటున్నట్లు తెలిపారు. మంత్రి పదవులు దక్కని వారు పార్టీ బాధ్యతలు తీసుకుంటారని చెప్పారు.


నేడు మరోసారి భేటీ
నేడు (ఏప్రిల్ 10) మరోసారి సజ్జలతో సీఎం జగన్ భేటీ అవ్వనున్నారు. ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు వీరి సమావేశం జరగనున్నట్లు తెలుస్తోంది. అనంతరం తుదిజాబితా ఖరారు చేయనున్నట్లు సమాచారం.