మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ఏపీ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఉండవల్లి కరకట్టపై ఆయన నివాసం ఉంటున్న భవనాన్ని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో అటాచ్ చేయడానికి అనుమతి ఇచ్చారు. రాజధాని మాస్టర్ ప్లాన్‌లో లింగమనేని సంస్థకు లబ్ది చేకూరే విధంగా వ్యవహరించి... ప్రతిఫలంగా వారి నుంచి భవనాన్ని పొందారని ఉత్తర్వుల్లో పేర్కొంది. 


మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు రాష్ట్రం ప్రభుత్వం గట్టి షాక్‌నే ఇచ్చింది. రాజధాని మాస్టర్‌ప్లాన్‌లో అక్రమాలు కేసు విషయంలో హైకోర్టు స్టే పై సుప్రీంకోర్టులో తమకు అనుకూలంగా ఉత్తర్వులు రావడంతో ప్రభుత్వం వేగంగా కదిలింది. ఉండవల్లి కరకట్టపై మాజీ సీఎం చంద్రబాబు నివాసం ఉంటున్న ఇంటిని ప్రభుత్వం అటాచ్ చేసింది. రాజధాని మాస్టర్ ప్లాన్‌లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు క్విడ్ ప్రో కోకు పాల్పడ్డారని అందుకు ప్రతిఫలంగా ప్రస్తుతం కరకట్టపై తాను నివాసం ఉంటున్న ఇంటిని లింగమనేని సంస్థ నుంచి పొందారని ఉత్తర్వుల్లో పేర్కొంది. 


చంద్రబాబు నివాసం ఉంటున్న ఇంటితో పాటు.. అప్పటి మునిసిపల్ శాఖ మంత్రి నారాయణ సన్నిహితుల ఆస్తులను అటాచ్ చేస్తూ.. రాష్ట్ర హోం శాఖ ఉత్తర్వులు ఇచ్చింది. శుక్రవారమే జీవో ఇచ్చినప్పటికీ ఇప్పుడు బయటకు వచ్చింది. 


కేసు వివరాలు ఇవీ.. 
రాజధాని ప్రాంతంలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని... మాస్టర్ ప్లాన్ రూపకల్పనలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ..  వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్టారెడ్డి ఫిర్యాదు చేశారు. దీనిపై ప్రభుత్వం సీఐడీతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. సీఐడీ విచారణ చేపట్టి మాజీ మంత్రి నారాయణ తన విద్యాసంస్థల ఉద్యోగుల పేర్లతో రాజధాని ప్రాంతంలో భూములు కొన్నారని..దీనికి అప్పటి సీఎం చంద్రబాబు తోడ్పాటు ఉందని  ఆరోపిస్తూ కేసులు నమోదు చేసింది. చంద్రాబబు, నారాయణను A1, A2గా చేర్చారు. అయితే రాజధానిలో ఇన్ సైడర్ ట్రైడింగ్ కు ఆస్కారం లేదంటూ హైకోర్టు దర్యాప్తుపై స్టే విధించింది. దీనిని సుప్రీం కోర్టు నిలిపేసింది. 


మే 5న సీఐడీ అడిషనల్ డీజీ ఈ కేసుల నిందితుల ఆస్తులను ఎటాచ్ చేయాలంటూ ప్రభుత్వానికి లేఖ రేశారు. దీనికి స్పందించిన హోం శాఖ.. చంద్రబాబు నివాసం ఉంటున్న ఇంటితోపాటు.. ఈ కేసులో మిగిలిన నిందితుల ఆస్తులను అటాచ్ చేస్తూ మెజిస్ట్ట్రేట్‌కు లేఖ పంపింది. క్రిమినల్‌లా అమెండమెంట్‌1944 చట్టం ప్రకారం అటాచ్‌చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 


లింగమనేని కోసం రింగురోడ్డు మార్చారు 
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లింగమనేని సంస్థ కోసం ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్‌మెంట్‌ను లింగమనేని రమేష్‌కు అనుకూలంగా మార్చారని.. సీఐడీ అభియోగాలు నమోదు చేసింది. లింగమనేని సంస్థతో పాటు.. చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ భూములు రాజధాని మాస్టర్ ప్లాన్‌లోకి రాకుండా జాగ్రత్త పడ్డారని ఆరోపించింది. ఈ భూముల సరిహద్దుల వరకూ రాజధాని మాస్టర్ ప్లాన్‌ను పరిమితం చేయడం వల్ల వారికి కోట్లలో లబ్ది కలిగిందని సీఐడీ ఆరోపించింది.


 హెరిటేజ్ సంస్థకు ఉన్న భూములు కూడా అంతకు ముందు లింగమనేని నుంచే కొన్నారని.. హెరిటేజ్ బోర్డు సభ్యుడుగా మాజీ మంత్రి నారాలోకేష్ బోర్డు తీర్మానంపై సంతకం కూడా చేశారన్నారు. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ కూడా లింగమనేని భూముల పక్క నుంచి వెళ్లేలా మార్చారని ఇన్ని రకాలుగా లబ్ది చేకూర్చినందుకు కరకట్టపై లింగమనేని రమేష్‌కు ఉన్న ఇంటిని చంద్రబాబుకు ఉచితంగా ఇచ్చారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.  క్విడ్ ప్రో కో ద్వారా పొందిన ఆస్థి కనుక ఆ ఇంటిని అటాచ్ చేస్తున్నట్లు చెప్పారు. చంద్రబాబుపై IPC సెక్షన్ 120‍(B),409.420, 34,35,36,37,166,167,217,  అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 13‍(2) రెడ్ విత్ 13(1)(C)(D)కింద మంగళగిరి పీఎస్ లో ఇంతకు మునుపే కేసు నమోదు చేశారు. 


నారాయణ అక్రమంగా భూములు కొన్నారు
అప్పట్లో రాష్ట్ర మంత్రిగా, సీఆర్‌డీఏ వైస్ ఛైర్మన్‌గా ఉన్న అధికారాలను దుర్వినియోగపరుస్తు నారాయణ అక్రమాలకు పాల్పడ్డారంటూ ఆయన సన్నిహితులుగా చెబుతున్న వారి భూములను అటాచ్ చేసింది. సీఆర్‌డీఏ ప్లాన్ రూపకల్పనలో కీలకంగా వ్యవహరించిన నారాయణ, తనకు ముందస్తుగా ఉన్న సమాచారంతో బినామీలతో రాజధాని ప్రాంతంలో 50 ఎకరాలు భూములు కొనిపించారని సీఐడీ అభియోగాలు నమోదు చేసింది. సింగపూర్ కన్సార్టియం ప్రతిపాదించిన స్టార్టప్ ఏరియాకు సమీపంలోనే నారాయణ విద్యాసంస్థల్లో పనిచేసే పొట్లూరి ప్రమీల, ఆవుల మునిశేఖర్, రాపూరు సాంబశివరావుతోపాటు.. మంగళగిరి వద్దనున్న రామకృష్ణా రియల్ ఎస్టేట్ సంస్థ.. 5 ఎకరాలు భూమి కొనిందన్నారు. 


రాయపూడి, లింగాయపాలెం, మందడం ప్రాంతాల్లో కొన్న ఈ భూములన్నింటినీ లాండ్ పూలింగ్‌లో ఇచ్చి ప్రభుత్వం వద్ద నుంచి ప్లాట్లుతోపాటు.. పెద్ద ఎత్తున కౌలు కూడా పొందారని.. వీటిని రికవరీ చేయడానికి వీలుగా భూములను అటాచ్ చేయాలని పేర్కొంది. చంద్రబాబు, నారాయణలతో పాటు ఈ కేసులో వీరంతా ఇప్పటికే నిందితులుగా ఉన్నారు. నారాయణ విద్యాసంస్థల ఉద్యోగులుగా చెబుతున్న వారికి సంబంధించి 75వేల చదరపు గజాల భూమితో పాటు రామకృష్ణ సంస్థకు చెందిన రెండెకరాల భూమిని కూడా అటాచ్ చేశారు. ఈ వ్యవహారంలో చట్టాలు, కేంద్ర విజిలెన్స్‌కమిషన్‌మార్గదర్శకాలను, సాధారణ ఆర్థిక నియమాలను పూర్తిగా ఉల్లంఘించారంటూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.