ఏపీ వ్యాప్తంగా 175 దేవాలయాల్లో పూర్తిస్థాయిలో కంప్యూటీకరణ చేపడుతున్నామని డిప్యూటీ సీఎం, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ వెల్లడించారు. ప్రైవేట్ సాఫ్ట్ వేర్ సంస్థ భాగస్వామ్యంతో కంప్యూటరీకరణ చేస్తున్నామని తెలిపారు.
దేవాదాయశాఖ అధికారులతో సమావేశం..
రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాలను 2023 జనవరి 31 లోపు పూర్తిస్థాయిలో కంప్యూటరీకరణ చేయాల్సిందిగా 9&9 సాప్ట్ వేర్ సంస్థను దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ఆదేశించారు. దీని ద్వారా పారదర్శకతతో పాటు అవినీతికి తావు లేకుండా భక్తులకు మెరుగైన సేవలు అందించవచ్చు అన్నారు. ఇప్పటికే 16 దేవాలయాల్లో అందుబాటులో ఉన్న కంప్యూటరీకరణ సేవలు మంచి ఫలితాలు ఇస్తున్నాయని తెలిపారు. విజయవాడలోని  దేవాదాయ శాఖ క్యాంప్ కార్యాలయంలో ఆ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ దేవాదాయ శాఖ అధికారులతో బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్రంలోని  ప్రముఖ 16 దేవాలయాల ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న అన్ని దేవాలయాలలో అవినీతికి తావు లేకుండా భక్తులకు మెరుగైన పరదర్శకతో కూడిన సేవలందించాలని ఆదేశించారు. 16 ప్రధాన దేవాలయాల్లోనూ ఆన్లైన్ సిస్టమ్స్ పాటించాల్సిందిగా, కొన్ని చోట్ల విద్యుత్ కు అంతరాయం లేకుండా యూపీఎస్ లు వాడాల్సిందిగా అధికారులకు మంత్రి సూచించారు. వచ్చే సమావేశం నాటికి 175 దేవాలయాల్లోనూ కంప్యూటీకరణతో కూడిన ఆన్లైన్ సేవలను భక్తులకు అందించాలని మంత్రి ఆదేశించారు.
ధూప దీప నైవేద్యం పథకం...
ఈ సమావేశంలో 185  దేవాలయాలకు ధూపదీప నైవేద్యం పథకం మంజూరు ప్రతిపాదనలు వచ్చాయని, ఈ ప్రతిపాదనలను పరిశీలిస్తున్నామని మంత్రి వెల్లడించారు. అదేవిధంగా టెంపుల్ మేనేజ్మెంట్ సిస్టమ్ (TMS)(9&9 సాప్ట్ వేర్) మీద రాష్ట్రంలో ఉన్న దేవాలయాల ఈవోలందరికీ తప్పనిసరిగా  సాఫ్ట్ వేర్ మీద పూర్తిస్థాయిలో అవగాహన ఉండాలని మంత్రి చెప్పారు. ప్రతి దేవాలయంలోను, సంబంధించిన ఏర్పాట్లు చేయాల్సిందిగా 9&9 సాప్ట్ వేర్ సంస్థ కు మంత్రి సూచించారు. వచ్చే ఏడాది జనవరి 31 నాటికి 175  దేవాలయాల్లో ఖచ్చితంగా ఆన్లైన్ సిస్టమ్స్ పూర్తిస్థాయిగా అమలు చేయాల్సిందిగా మంత్రి ఆదేశాలు జారీ చేశారు.
ఫైనాన్షియల్ అకౌంటింగ్ సిస్టమ్స్ (FAS)....
 సమావేశంలో  ఫైనాన్షియల్ అకౌంటింగ్ సిస్టమ్స్ లో  ఆదాయ, రాబడుల వివరాలను మంత్రి కొట్టు సత్యనారాయణ పరిశీలించారు. దీనిపై దేవాదాయ శాఖ పరిధిలోని ఈవోలకు పూర్తి అవగాహన కల్పించుకోవాలని మంత్రి అన్నారు. ఈ విషయమై తదుపరి సమీక్ష సమావేశం నాటికి కార్యనిర్వాహక అధికారులు స్వయంగా వివరించాల్సిందిగా మంత్రి ఆదేశించారు. తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో ప్రోటోకాల్ విభాగాన్ని అనుసరించేందుకు  తగిన మార్గదర్శకాలు జారీ చేయాల్సిందిగా కమిషనర్  ని ఆదేశించారు. దేవాలయాల్లో టెండర్లు ప్రాసెసింగ్ విధానం పారదర్శకంగా జరగాలన్నారు. అన్నదానం, శానిటేషన్ సిబ్బందిని  నియమించే విషయమై పారదర్శకత టెండర్ల విధానం ద్వారా మాత్రమే తీసుకోవాల్సిందిగా మంత్రి స్పష్టం చేశారు. ఈ సమావేశంలో దేవాదాయ శాఖ కమిషనర్ ఎం.హరి జవహర్ లాల్, అదనపు కమిషనర్ టి. చంద్రకుమార్, జాయింట్ కమిషనర్ ఎస్ఎస్ చంద్రశేఖర్ ఆజాద్ పాల్గొన్నారు.