AP cs Jawahar Reddy: రాష్ట్రంలో ఉద్యోగులకు అమలు చేస్తున్న ఆరోగ్య పథకాన్ని(ఇహెచ్ఎస్) మరింత పారదర్శకంగా, పటిష్టవంతంగా అమలు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కె.ఎస్. జవహర్ రెడ్డి స్పష్టం చేశారు. అదే విధంగా ఉద్యోగులకు ఇంటి స్థలాల కేటాయింపులను వేగవంతం చేస్తామని తెలిపారు.


ఉద్యోగుల ఆరోగ్య పథకంపై సమీక్ష..
ఉద్యోగుల ఆరోగ్య పథకం పై విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ పథకం అమలులో వివిధ ఉద్యోగ సంఘాల నుండి వచ్చిన పలు డిమాండ్లు వాటి పరిష్కారానికి తీసుకున్న చర్యల పై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి యం.టి. కృష్ణబాబుతో సమీక్షించారు. మరో పది రోజుల్లో ఉద్యోగుల ఆరోగ్య పథకంపై ముఖ్యమంత్రి సమీక్షించనున్నారని సీఎస్ పేర్కొన్నారు. ఈ పథకం అమలుపై ఇటీవల ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో వచ్చిన వివిధ ప్రతిపాదనలు వాటి అమలు గురించి సీఎస్ సమీక్షించారు. ఈ పథకాన్ని మరింత సమర్థవంతంగా,పారదర్శకంగా అమలు చేసేందుకు తీసుకోవాల్సిన అంశాల పై సిఎస్ జవహర్ రెడ్డి సమీక్షించారు.


అందరికీ హెల్త్ కార్డులు.. కృష్ణబాబు...
వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి యం.టి.కృష్ణబాబు మాట్లాడుతూ ఇహెచ్ఎస్ అమలుకు సంబంధించి వివిధ ఉద్యోగ సంఘాల నుండి వచ్చిన వివిధ ప్రతి పాదనల అమలుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు. మరి కొన్ని ప్రతి పాదనలపై రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో నిర్ణయం తీసుకోవాల్సి ఉందని చెప్పారు. గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగులకు ఇహెచ్ఎస్ అమలుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు.అదే విధంగా మెడికల్ రీయింబర్స్మెంట్ పథకాన్ని మరో ఏడాదికి పొడిగించడం జరిగిందని సీఎస్ కు వివరించారు. వ్యవసాయ మార్కెట్ కమిటీల ఉద్యోగులకు ఈ పధకాన్ని వర్తింప చేస్తున్నామని అన్నారు.


సెప్టెంబర్ నెలాఖరు నాటికి అందరికీ ఇహెచ్ఎస్ కార్డులు అందించే విధంగా చర్యలు తీసుకుంటామని స్పెషల్ సిఎస్ కృష్ణబాబు చెప్పారు. రాష్ట్రం లోని 53 ఏరియా ఆసుపత్రిల్లో ఇహెచ్ఎస్ సేవల కు ప్రత్యేక క్లినిక్ లను అందుబాటులోకి రానున్నాయని కృష్ణబాబు తెలిపారు. ఇహెచ్ఎస్ అమలుకు సంబంధించి తీసుకున్న చర్యలపై ముఖ్యమంత్రి కూడా నివేదిక ఇస్తున్నామని అన్నారు.


ఉద్యోగులకు ఇంటి స్థలాలు...
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇళ్ళ స్థలాలు ఇచ్చే అంశంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా. కెస్. జవహర్ రెడ్డి అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా డా. కెస్. జవహర్ రెడ్డి మాట్లాడుతూ.. వివిధ ఉద్యోగ సంఘాల హౌసింగ్ సొసైటీల వారీగా ఇళ్ళ స్థలాలకు ఎంత మేర భూమి అవసరం ఉందన్న విషయం పై పరిశీలన జరపాలని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, సిసిఎల్ఏ జి.సాయి ప్రసాద్ కు సూచించారు. ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో చర్చించి ఒక నివేదిక సమర్పించాలని ఆదేశించారు. పది రోజుల్లో ఉద్యోగుల ఇళ్ళ స్థలాలు ఇచ్చే విషయంలో ముఖ్యమంత్రి కూడ శ్రద్ద చూపించారని, ఈ విషయంలో నిర్లక్ష్యం తగదని అన్నారు. Pట్టణ ప్రాంతాల్లో పబ్లిక్ హౌసింగ్ విధానాన్ని తీసుకు వచ్చే అంశం పై దృష్టి సారించాలని అధికారులను సీఎస్ జవహర్ రెడ్డి సూచించారు. 
పట్టణ ప్రాంతాల్లో ఇళ్ళు లేనివారు, ఇళ్ళు ఉన్నా రోడ్లు, పుట్ పాత్ లు, కాలువలు, డ్రైన్లు వంటి వివిధ ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకుని చిన్న చిన్న గుడిసెలు, గుడారాలు వంటివి ఏర్పాటు చేసుకుని జీవనం సాగించే వారిని కట్టడి చేసి వారికి ప్రభుత్వమే పబ్లిక్ హౌసింగ్ విధానంలో నిర్మించిన ఇళ్ళలో నివసించేలా చేయవచ్చని తెలిపారు. దాంతో పట్టణాలను మరింత సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దగలమని, సిఎస్ పేర్కొన్నారు. దీని పై అన్ని పట్టణాల్లో పరిశీలన చేసి, ముఖ్యమంత్రికి నివేదికను సిద్ధం చేయాలని  జవహర్ రెడ్డి రెవెన్యూ, మున్సిపల్ శాఖల అధికారులను ఆదేశించారు. సమావేశంలో రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయి ప్రసాద్ మాట్లాడుతూ ఉద్యోగుల ఇళ్ళ స్థలాలపై ఉద్యోగ సంఘాల ప్రతి నిధులతో మాట్లాడి వారి నుండి వివరాలు సేకరించి నివేదిక సమర్పిస్తామన్నారు.