అమరావతి: ముస్లింలకు మన ప్రభుత్వంలో ఇచ్చిన పదవులు మరే ప్రభుత్వంలోనూ ఇవ్వలేదు అన్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్‌, డిప్యూటీ సీఎం, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో పాటు కార్పొరేషన్ల  చైర్మన్లు, డైరెక్టర్లుగా పెద్ద ఎత్తున అవకాశం కల్పించాం అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి హాజరైన ముస్లిం సంఘాల ప్రతినిధులతో ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమావేశమయ్యారు. 


ఈ సందర్భంగా ముస్లిం సంఘాల ప్రతినిధులు తమ సమస్యలను ముఖ్యమంత్రికి వివరించారు. వక్ఫ్‌ బోర్డు ఆస్తులు అన్యాక్రాంతం అవుతున్న విషయాన్ని సీఎం దృష్టికి తీసుకొచ్చారు. వక్ఫ్‌ బోర్డు ఆస్తుల పరిరక్షణ, మదరసాలలో విద్యా వాలంటీర్లకు జీతాలు చెల్లింపు, ముస్లింల అభ్యన్నతికి సలహాదారు నియామకం వంటి అంశాలను విన్నవించుకున్నారు ముస్లిం పెద్దలు. ముస్లిం సంఘాల ప్రతినిధులు విన్నవించిన పలు అంశాలపై సానుకూలంగా స్పందించారు సీఎం జగన్. కడపలో అసంపూర్తిగా ఉన్న హజ్‌హౌస్‌ నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయాలని సీఏం ఆదేశించారు. విజయవాడలో హజ్‌హౌస్‌ నిర్మాణం చేపట్టాలనిముస్లిం సంఘాలు విజ్ఞప్తి చేశాయి. హజ్‌హౌస్‌ నిర్మాణం కోసం అవసరమైన భూమి కేటాయించాలని అధికారులను ఆదేశించారు. 


వక్ఫ్ ఆస్తుల రక్షణకు సీఎం యోచన
వక్ఫ్‌ బోర్డు ఆస్తుల రక్షణకై తగిన చర్యలు తీసుకునే దిశగా కార్యాచరణకు హామీ ఇచ్చారు సీఎం జగన్. అన్ని మతాల భూముల ఆస్తులు పరిరక్షణకు జిల్లా స్ధాయిలో ప్రత్యేక కమిటీ నియమించాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. జిల్లా స్ధాయిలో ఈ కమిటీల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. కలెక్టర్‌ ఆధ్వర్యంలో జేసీ, ఏఎస్పీలతో ఒక కమిటీ వేసి... జిల్లాస్ధాయిలో ఒక సమన్వయకమిటీ ఏర్పాటు చేయాలన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఖాజీల పదవీ కాలం మూడేళ్లుగా నిర్ణయించిందని సీఎం దృష్టికి తీసుకొచ్చారు ముస్లిం సంఘాల పెద్దలు.


ఖాజీల రెన్యువల్‌ కోసం చాలా ఇబ్బందులు పడుతున్నామని సీఎం జగన్ కు వారు వివరించారు. ఖాజీల పదవీకాలాన్ని పెంచడంతో పాటు రెన్యూవల్‌ ప్రాసెస్‌ను సులభతరం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఖాజీల పదవీకాలాన్ని మూడేళ్ల నుంచి పదేళ్లకు పెంచడానికి సీఎం నిర్ణయం తీసుకున్నారు. గ్రామ, వార్డు సచివాలయ స్ధాయిలో సులభతరమైన రెన్యువల్‌ విధానాన్ని ప్రవేశపెట్టాలని అధికారులను ఆదేశించారు. మదర్సాలలో పనిచేస్తున్న విద్యావాలంటీర్ల జీతాలు సమస్యను తక్షణమే పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ఉర్ధూ పాఠశాలల్లో వచ్చే విద్యాసంవత్సరం నాటికి బైలింగువల్‌ టెక్ట్స్‌బుక్స్‌లో భాగంగా ఇంగ్లీషుతోపాటు ఉర్ధూలో కూడా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. కర్నూలు ఉర్ధూ విశ్వవిద్యాలయం భవన నిర్మాణ పనులను పూర్తిచేయాలలన్నారు. సయ్యద్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలన్న ముస్లిం మతపెద్దల విజ్ఞప్తి, కార్పొరేషన్‌ ఏర్పాటుకు సీఎం ఆమోదం తెలిపారు.


ఇది మనందరి ప్రభుత్వం అన్న విషయాన్ని మనసులో పెట్టుకోవాలని, ప్రభుత్వం నుంచి మీకు ఏ రకంగా మరింత సహాయం చేయాలన్నదానిపై మీ సలహాలు తీసుకోవడానికే మిమ్నల్ని పిలిచాం అన్నారు సీఎం జగన్. ముస్లిం మత పెద్దలు చెప్పిన అంశాలను యుద్ధ ప్రాతిపదికిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అవసరమైన నిధులును కూడా కేటాయిస్తాం, అన్ని సమస్యలకు సానుకూలమైన పరిష్కారం ఈ సమావేశం ద్వారా లభిస్తుందన్నారు. ఈ దఫా మన లక్ష్యం 175 కి 175 స్ధానాలు గెలవడం అని, కచ్చితంగా దాన్ని సాధిస్తాం అని సీఎం జగన్ దీమా వ్యక్తం చేశారు.