AP CM Chandrababu Singapore Tour | సింగపూర్: సింగపూర్ వెళ్లిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం రెండోరోజు పర్యటనలో భాగంగా సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధులతో సహా పలు సంస్థల అధిపతులతో సమావేశం కానున్నారు. గత ఐదేళ్లలో సింగపూర్ కు ఏపీకి మధ్య తెగిపోయిన కనెక్షన్ ను పునరుద్ధరించి.. సింగపూర్ నుంచి పెట్టుబడులు తెచ్చేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రాజధాని అమరావతి విషయంలో సింగపూర్ తో తెగిపోయిన ఒప్పందాలను సరిచేసి.. అక్కడి నుంచి పెట్టుబడులు తీసుకొస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.

నగరాల అభివృద్ధి, క్రీడలు, పోర్ట్ ఆధారిత పరిశ్రమలపై వారితో చర్చలు జరుపుతారు. భారత కాలమాన ప్రకారం సోమవారం ఉదయం 7 గంటలకు ట్రెజరీ బిల్డింగ్‌లో సింగపూర్ వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి డాక్టర్ టాన్ సీ లెంగ్‌తో ముఖ్యమంత్రి భేటీ అవుతారు. విద్యుత్, సైన్స్ అండ్ టెక్నాలజీ, పారిశ్రామిక సహకారంపై చర్చిస్తారు. 

బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొనున్న చంద్రబాబుఉదయం 8.30 గంటలకు ఎయిర్‌బస్ సంస్థ ప్రతినిధులు కృతీవాస్, వేంకట్ కట్కూరితోనూ... అలాగే ఉదయం 9 గంటలకు హనీవెల్ సంస్థ ప్రతినిధులతో సమావేశం కానున్నారు. ఉదయం 9.30 నుంచి 11 గంటల వరకు జరిగే బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటారు. ‘నైపుణ్యాల నుంచి సామర్థ్యాల వైపు మరలడం : కార్మిక శక్తిని వేగవంతం చేయడం‘ (From Skills to Competencies: Accelerating Workforce Transformation) అనే అంశంపై చర్చిస్తారు. ఇందులో నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ సింగపూర్, నాన్యాంగ్ టెక్నలాజికల్ యూనివర్శిటీ, సింగపూర్ మేనేజ్‌మెంట్ యూనివర్శిటీ, సింగపూర్ యూనివర్శిటీ ఆఫ్ టెక్నాలజీ & డిజైన్ విద్యార్ధులు పాల్గొంటారు. 11 గంటలకు ఎవర్వోల్ట్ చైర్మన్ మిస్టర్ సైమన్ టాన్‌తో సమావేశం అవుతారు. 

అంతర్జాతీయ పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం : సోమవారం మధ్యాహ్నం 11.30కు సింగపూర్ స్పోర్ట్స్ స్కూల్ సందర్శిస్తారు. ఆంధ్రప్రదేశ్‌లో క్రీడల అభివృద్ధి ప్రణాళికలు అనుసంధానించే అంశంపై దృష్టి పెడతారు. మధ్యాహ్నం 1 గంటకు టుయాస్ పోర్ట్ సైట్‌లో పర్యటిస్తారు. ఆంధ్రప్రదేశ్‌లో పోర్ట్ ఆధారిత పారిశ్రామిక అభివృద్ధి, స్మార్ట్ లాజిస్టిక్స్, భారీగా తయారీ, ఎగుమతి మౌలిక సదుపాయాలపై PSA సీఈవో విన్సెంట్ ఆధ్వర్యంలో జరిగే ప్రత్యేక చర్చలో పాల్గొంటారు. 

సాయంత్రం 4.30 గంటలకు ఆంధ్రప్రదేశ్ – సింగపూర్ బిజినెస్ ఫోరం నిర్వహించే రోడ్ షోకు హాజరవుతారు. సింగపూర్, అంతర్జాతీయ పెట్టుబడిదారుల సమక్షంలో రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికలపై ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. సాయంత్రం 6 గంటలకు అదానీ పోర్ట్స్ ఎండీ కరణ్ అదానీతో ప్రత్యేక సమావేశం జరగనుంది. రాష్ట్రంలో పోర్టుల అభివృద్ధి, పెట్టుబడులపై ఇరువురు చర్చిస్తారు.