YS Jagan vs Chandrababu Naidu:ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీడియాతో చిట్చాట్ చేస్తూ వైఎస్ఆర్సీపీ అధినేత జగన్పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో చిచ్చు రేపటానికి నిత్యం ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. తనకు సహకరించని వారిపై దాడి చేస్తున్నారని, అందుకు సోషల్ మీడియాలోను వాడుకుంటున్నారని అన్నారు. జగన్ది హిట్ అండ్ రన్ స్వభావమని తెలిపారు. రాష్ట్రానికి ఒకరోజు ఏదో చిచ్చు రేపి బెంగళూరు వెళ్లిపోయి దాక్కుంటారని ఎద్దేవా చేశారు. తెలంగాణలో పోక్సో కేసు పెట్టారని కక్షతో ఆరుగురిని చంపిన వ్యక్తికి జగన్కు తేడా లేదన్నారు. ఇద్దరిదీ ఒకటే మైండ్ సెట్ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
నచ్చని వారిని, సహకరించని వారిపై కక్ష పెంచుకొని టార్గెట్ చేయడం జగన్ స్వభావమని తెలిపారు చంద్రబాబు. రెండోసారి అధికారం ఇవ్వలేదని ఆగ్రహంతో ఆయన రెండు విషయాలనే నమ్ముకున్నారని అన్నారు. ఒకటి గొడ్డలి, రెండోది సోషల్ మీడియా. నచ్చని వారిని తిట్టడం సోషల్ మీడియాలో నెగెటివ్ ట్రోలింగ్ చేయడం అలవాటుగా మారిందన్నారు. వారి అండ చూసుకొని నేరమనస్తత్వం ఉన్న కొందు ప్రభుత్వాన్ని, లీడర్లను టార్గెట్ చేస్తూ వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇలాంటి వాటి పట్ల ప్రజలు, టీడీపీ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు సూచించారు. పార్టీ సమావేశాల్లో కూడా ఈవిషయాన్ని చెబుతున్నట్టు వెల్లడించారు. అలాంటి కామెంట్స్కు రెచ్చిపోతే పార్టీ ఇబ్బందుల్లో పడుతుందని చెప్పినట్టు తెలిపారు. సైకో మనస్తత్వం ఉన్న పార్టీ నేతలు ఇతరులను రెచ్చగొట్టేందుకు ఏదేదో చేస్తుంటారని అన్నారు. తెలంగాణలో పోక్సో కేసు పెట్టారని కసితో ఆరుగురిని హత్య చేసిన నిందితుడి నేర మనస్తత్వం ఎంత ప్రమాదకరమో జగన్ అంత ప్రమాదకరమని అన్నారు. తనను అధికారానికి దూరం చేశారన్న కసితో నచ్చని వారిని బూతులు తిట్టడం, నెగెటివ్ ట్రోలింగ్ చేస్తున్నారని ఆగ్రహించారు.
ఇలాంటి వాటి సంగతి ప్రభుత్వం చూసుకుంటుందని ప్రజలు, పార్టీ కార్యకర్తలు స్పందించవద్దని చంద్రబాబు సూచించారు. కచ్చితంగా నేరం చేసిన వారికి శిక్షలు తప్పవని హెచ్చరించారు. జరుగుతున్న ప్రచారంలో ఏది నిజం, ఏది అబద్దమో తెలుసుకునే టూల్స్ ఉన్నాయని వాటిని ఉపయోగించి నిజానిజాలు తెలుసుకోవాలని చెప్పారు. భవిష్యత్లో వచ్చే టెక్నాలజీతో ఇలాంటి వాటిని ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. అంతే కాని వారి ట్రాప్లో పడొద్దని సూచించారు.
రాష్ట్రానికి మేలు జరగకుండా చేయడమే జగన్, వైసీపీ నేతల లక్ష్యమని చంద్రబాబు అన్నారు. అందుకు ఏ స్థాయికైనా వారు వెళ్తారని అభిప్రాయపడ్డారు. తమ హయాంలో మంచి చేయలేదని ఇప్పుడు కూడా మంచి జరగకూడనే వారు లక్ష్యంగా పెట్టుకున్నారని అన్నారు. అందుకే ఒకసారి మూడు రాజధానులని, ఇప్పుడు మళ్లీ మావిగన్ అంటూ కన్ఫ్యూజ్ చేస్తున్నారని చెప్పారు.
ఎన్ని అడ్డంకులు సృష్టించినా భోగాపురం పూర్తి చేశామని త్వరలోనే అక్కడి నుంచి ఫ్లైట్స్ టేకాఫ్ అవుతాయన్నారు చంద్రబాబు. పోలవరం, వెలుగొండ, అమరావతి నిర్మాణాలు పూర్తి చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో ఇప్పుడు ఉన్న వనరులు వాడుకుంటే భారీగా పెట్టుబడులు వస్తాయని, అదే కూటమి ప్రభుత్వం చేస్తోందని చంద్రబాబు గుర్తు చేశారు. దీనికి అడ్డుతగిలే వాళ్లను ప్రజలు క్షమించబోరని వార్నింగ్ ఇచ్చారు.
