CM Chandrababu: నా జీవితంలో ఇన్ని సవాళ్లు ఎదుర్కోవడం ఇదే తొలిసారి: చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
Chandrababu Review Meeting | ఏపీ సీఎం చంద్రబాబు రాష్ట్ర సచివాలయంలో మంత్రుల శాఖలు, వాటిని పనితీరు, పెండింగ్ ఫైళ్లపై సమావేశం నిర్వహించి అన్ని విషయాలు సమీక్షిస్తున్నారు.

Andhra Pradesh News | అమరావతి: ఈ-ఆఫీసులో ఫైళ్ల క్లియరెన్సు ప్రక్రియ వేగవంతం చేయాలని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. సచివాలయంలో మంగళవారం జరిగిన మంత్రులు, కార్యదర్శుల సదస్సులో భాగంగా వివిధ శాఖల్లో ఈ-ఆఫీసు ఫైళ్ల క్లియరెన్సు జరుగుతున్న క్రమం గురించి ఆర్టీజీఎస్ సీఈఓ కె. దినేష్ కుమార్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. రేపటికి తాను ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి 8 నెలలు పూర్తవుతోంది. మనపై విశ్వాసం ఉంచి, ఐదేళ్ల వైసీపీ పరిపాలనను ప్రజలు అంగీకరించలేదు. సాధారణంగా ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు ఏదో ఒక సవాలు ఉంటుంది. కానీ, అధికార మార్పిడి అనంతరం నా జీవితంలో ఇన్ని సవాళ్లు ఎదుర్కోవడం ఇదే తొలిసారి. ఏపీలో వైసీపీ పాలనలో నిర్వీర్యమైన వ్యవస్థలను గాడిలో పెట్టేందుకు కూటమికి ప్రజలు భారీ మెజార్టీతో అధికారమిచ్చారు.
గవర్నమెంట్ ఈ-ఆఫీసులో ఫైళ్లు క్లియరెన్సులో వేగం పెరగాలి. ఫైళ్లు ఎక్కడ క్లియర్ కాకుండా ఆగిపోతున్నాయో దానిపైన కార్యదర్శులు, శాఖల విభాగాధిపతులు సమీక్ష చేసుకోవాలి. ఆలస్యానికి గల కారణాలు తెలుసుకుని వాటిని తొలగించి ఫైళ్లు వెంటనే పరిష్కారం చేయాలని సూచించారు. ఫైళ్లలో ఆర్థిక, ఆర్థికేతర అనే రెండు రకాల ఫైళ్లుంటాయి. ఆర్థికేతర ఫైళ్ల పరిష్కారంలో ఫైళ్లు ఎట్టి పరిస్థితిలోనూ పెండింగ్లో ఉండకూడదు. ఆర్థిక పరమైన ఫైళ్లు అయితే ఆయా శాఖల్లోని బడ్జెట్ తదితర అంశాలను పరిశీలించి ఆ ఫైళ్లను సాధ్యమైనంత త్వరగా సమీక్షించాలి. కొన్ని శాఖల్లో కొంతమంది అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కొందరు ఆరు నెలలు, సంవత్సరం వరకు తమ వద్ద ఫైళ్లను ఉంచుకుంటున్నారని ఇది సరైన పద్దతి కాదని చంద్రబాబు సూచించారు. కొన్ని ప్రభుత్వ శాఖల్లో సగటున 3 రోజుల్లోనే ఫైళ్లు క్లియరెన్సు అవుతున్నాయని ఆర్టీజీఎస్ సీఈఓ సీఎం చంద్రబాబుకు తెలిపారు. మరికొన్ని శాఖల్లో ఫైళ్లు ఆలస్య అవుతున్నాయని, ఇకనుంచి త్వరగా ఫైళ్లు క్లియర్ చేయాలని మంత్రులు, అధికారులకు దిశానిర్దేశం చేశారు.
1. ప్రాజెక్ట్ మానిటరింగ్ గ్రూప్ (PMG)
మౌలిక సదుపాయాలు, నిర్మాణ ప్రాజెక్టుల పరిష్కారం, వాటి ప్రస్తుత స్థితిని నిర్ధారించడంలో ప్రాజెక్ట్ మానిటరింగ్ గ్రూప్ (PMG) కీలక పాత్ర పోషిస్తుంది. దీని ద్వారా ప్రాజెక్ట్ అమలును క్రమబద్ధీకరించడానికి వీలు కలుగుతుంది. PMG ప్లాట్ఫామ్ ద్వారా ఇన్వెస్టర్లు ఎంట్రీ ఇచ్చి, తరువాత రెగ్యులర్ ట్రాకింగ్, సమస్య పరిష్కారం, ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయడం వంటి కీలక అంశాలపై ఇది పనిచేస్తుంది.
2. WhatsApp గవర్నెన్స్ - మన మిత్ర ఇనిషియేటివ్
జనవరి 30న ఏపీ ప్రభుత్వం అధికారికంగా 161 ప్రభుత్వ సేవల ప్రారంభ సెట్తో వాట్సప్ గవర్నెన్స్ మన మిత్ర ప్లాట్ఫామ్ ప్రారంభించింది. దీని ద్వారా అదనపు సేవలను అందించడానికి ప్లాట్ఫామ్ను విస్తరించాలని చర్చించారు. తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) సేవలను కూడా చేర్చాలని భక్తులు కోరుతున్నందున, దేవాదాయ నుంచి మరిన్ని సేవలను ఇందులో అందుబాటులోకి తేవాలని ఐటీ మంత్రి నారా లోకేష్ నొక్కి చెప్పారు. సర్టిఫికెట్లు, ప్రభుత్వ పత్రాలను గవర్నమెంట్ ఆఫీసులకు వెళ్లకుండా వాట్సాప్ లో అందిస్తున్నారు. APSRTC బస్ ట్రాకింగ్ ఫీచర్ ను అనుసంధానం చేయనున్నారు. సినిమా టికెట్లతో పాటు ఇతర సర్వీసులపై ప్రభుత్వం ఫోకస్ చేస్తోంది. సమర్థవంతమైన డిజిటల్ గవర్నెన్స్ లో భాగంగా వాట్సాప్ గవర్నెన్స్ తెచ్చి ప్రజలకు మరిన్ని మెరుగైన సేవలు అందుబాటులోకి తేవడంపై మంత్రులతో చంద్రబాబు చర్చించారు.
Also Read: CM Chandrababu: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, బ్యాంకర్లకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు