Andhra Pradesh Election 2024: అమరావతి: మరో వారం రోజుల్లో దేశ వ్యాప్తంగా ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచడానికి, ఓటింగ్ పై అవగాహనా పెంచడానికి ఏపీ ఎన్నికల కమిషన్ ప్రయత్నం చేస్తోంది. పెట్రోలు బంకుల ద్వారా ఓటు హక్కుపై ప్రజల్లో అవగాహన కల్పించాలని ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా (Mukesh Kumar Meena) చమురు పరిశ్రమల ప్రతినిధులను కోరారు. ఏపీ సచివాలయంలోని తమ ఛాంబరులో బుధవారం ఉదయం హెపిసిఎల్, ఐఓసిఎల్, బిపిసిఎల్ చమురు పరిశ్రమల ప్రతినిధులతో సమావేశమై.. ఓటర్ల అవగాహనా కార్యక్రమాల నిర్వహణపై చర్చించారు. రెగ్యూలర్ గా పెట్రోల్ బంకులకు వెళ్లే వాహనదారులు అక్కడ ఉన్న హోర్డింగ్స్ చూసి ఎన్నికల తేదీలపై అవగాహన వచ్చి, ఓటింగ్ లో పాల్గొంటారని ఈసీ భావిస్తోంది.
చమురు సంస్థల ద్వారా ఓటింగ్ పై అవగాహనా
అనంతరం ఏపీ సీఈవో ముఖేష్ కుమార్ మీనా మాట్లాడుతూ.. క్రమబద్దమైన ఓటర్ల విద్య మరియు ఎన్నికల భాగస్వామ్యం (SVEEP - Systematic Voters' Education and Electoral Participation) కార్యక్రమం అమలు చేస్తామన్నారు. ఇందులో భాగంగా చమురు పరిశ్రమల ద్వారా ఓటర్ల అవగాహనా కార్యక్రమాలను నిర్వహించాలని భారత ఎన్నికల సంఘం (Election Commission Of India) ఆదేశించినట్లు తెలిపారు. పోస్టల్ శాఖ ద్వారా ఓటర్ల అవగాహనా కార్యక్రమాలను ఇదివరకే చేపట్టామని తెలిపారు. ఇదే తరహాలో ఏపీ వ్యాప్తంగా ఉన్న అన్ని పెట్రోల్ బంకుల ద్వారా  ఓటర్ల అవగాహనా ప్రచారాన్ని నిర్వహించాలని చమురు పరిశ్రమల ప్రతినిధులను కోరారు. ఈసీఐ లోగోతో ఎన్నికల తేదీ, ఓటు హక్కు విలువను తెలిజేసే నినాదాలతో రూపొందించిన హోర్డింగుల డిజైన్లను వారికి అందజేస్తామని ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. ప్రత్యేకంగా రూపొందించిన హోర్డింగ్‌లను ఏపీ వ్యాప్తంగా అన్ని పెట్రోల్ బంకుల వద్ద ఏర్పాటు చేసి తద్వారా ఓటర్ల అవగాహనా ప్రచారాన్ని నిర్వహించాలని సూచించారు.    


చమురు కంపెనీల ప్రతినిధులు సీఈవో ముఖేష్ కుమార్ మీనా ప్రతిపాదనలకు సానుకూలంగా స్పందించారు. ఇందుకు సంబంధించి తక్షణమే తగిన చర్యలు తీసుకుంటామని ఆ ప్రతినిధులు హోమీ ఇచ్చారు. ఈ సమావేశంలో అదనపు సీఈవో ఎమ్.ఎన్. హరెంధిర ప్రసాద్, డిప్యూటీ సీఈవో ఎస్.మల్లిబాబు, చమురు పరిశ్రమల రాష్ట్ర స్థాయి సమన్వయకర్త - డిప్యుటీ జనరల్ మేనేజర్ జె.సంజయ్ కుమార్, హెపిసిఎల్ ఛీప్ రీజనల్ మేనేజర్ ఆదిత్య ఆనంద్, ఐఓసిఎల్ ప్రతినిధి, బిపిసిఎల్ టెరిటరీ మేనేజర్ తదితరులు పాల్గొన్నారు.