ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు‌ పోలవరంపై కీలక వ్యాఖ్యలు చేశారు. పోలవరం అంశాన్ని‌ వివాదం చేసే కుట్ర జరుగుతుందని ఆయన ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు‌ గురించి టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారని, అసలు వాళ్లకి ప్రాజెక్టుతో ఏం పని అని ప్రశ్నించారు. వరప్రదాయిని అయిన పోలవరం ప్రాజెక్టును ప్రశ్నిస్తే తెలంగాణ ఏర్పాటు ను ప్రశ్నించినట్లేనని వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారంతో రాష్ట్ర విభజన అంశాన్ని తిరగతోడినట్లేనని అభిప్రాయపడ్డారు. విజయవాడలో సోము వీర్రాజు మీడియాతో మాట్లాడారు.


‘‘రాష్ట్ర విభజన బిల్లు ప్రకారం పోలవరం నిర్మాణం చేయాలి. 1960లో పోలవరం ముంపు మండలాలను ఖమ్మంలో కలిపారు. విభజన తరవాత భద్రాచలం టెంపుల్ ను‌, మరో రెండు మండలాలు‌ తెలంగాణ కు ఇచ్చారు. దుమ్మగూడెం ప్రాజెక్టు ద్వారా నాగార్జున సాగర్ కు‌ నీరు ఇవ్వాలని‌ వైఎస్ పనులు చేపట్టారు. దుమ్ముగూడెం వాళ్లకు ఇవ్వడం వల్ల రాయలసీమ తీవ్రంగా నష్టపోయింది. రాష్ట్ర విభజనపై పూర్తిగా అధ్యయనం చేసిన ఏకైక పార్టీ బీజేపీ.’’


పోలవరం వద్దని నాడు టీడీపీ వరంగల్ మహిళా నేత మాట్లాడారు. నేడు మా పార్టీ లో ఉన్న ఇద్దరు నాయకులు అప్పుడు టీడీపీలో ఉన్నారు. వారిద్దరూ నాడు ఆమె వ్యాఖ్యలను కనీసం ఖండించలేదు. ఆ తరువాత చంద్రబాబు ‘పోలవరం సోమవారం’ అని ఆర్భాటం చేశారు. పోలవరంను వ్యతిరేకిస్తే.. విభజన చట్టాన్ని ఒప్పుకోనట్లే. అప్పుడొక మాట.. ఇప్పుడొక మాట అనేది కరెక్ట్ కాదు. పోలవరం ముంపు ప్రాంతాలలలో కొన్ని గ్రామాల ప్రజలు తెలంగాణలో కలుస్తాం అంటున్నారు. వారంతా భద్రాచలం మీద ఆధార పడటం‌ వల్ల అటు చూస్తున్నారు. విలీనం చేసిన మండలాల్లో‌ సీపీఎం ఆందోళన చేయడం ఏమిటి? ఏం మాయ రోగం వచ్చింది.. టీఆర్ఎస్ తో లాలూచి పడి రోడ్డెక్కారా? వారికి అన్నీ తెలిసి కూడా ఇలా చేస్తారా? 


పోలవరం విషయంలో జగన్ ప్రజలను మోసం చేస్తున్నారు. గతంలో చంద్రబాబు కూడా ఇలానే ప్రకటించి దెబ్బ తిన్నారు. కేంద్ర మంత్రి షెకావత్ ఏపీ పర్యటన తరువాత 15 రోజులకొకసారి రివ్యూ చేస్తున్నారు. లోయర్ కాపర్ డ్యాం పాడైన విషయంపై అధ్యయనం జరుగుతుంది. చంద్రబాబు అనేక అవినీతి చేశారని జగన్ ప్రచారం చేశారు. మూడేళ్లలో వాటిని బయట పెట్టి ఎందుకు చర్యలు తీసుకోలేదు. ఏపీలో పరిణామాలను మా‌ జాతీయ నాయకత్వానికి వివరిస్తాం’’ అని సోము వీర్రాజు అన్నారు.


భవిష్యత్తులో జరగబోయే అంశాలను ఇప్పుడే చెప్పేస్తామా? అని విలేకరులు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. బీజేపీ ఎంపీ సీఎం రమేష్ పై నిన్న టీడీపీ ఎంపీ కేశినేని నాని తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. సీఎం రమేష్ మరో ఏక్ నాథ్ షిండే అని కేశినేని అన్నారు. కేశినేని నాని వ్యాఖ్యలపై స్పందించాలని సోము వీర్రాజును విలేకరులు కోరారు. దీనిపై స్పందిస్తూ.. ‘‘ఎప్పుడో జరిగే అంశాలపై ఇప్పుడు మాట్లాడను. భవిష్యత్ లో జరిగే పరిణామాలను ఇప్పుడే ఎందుకు చెప్తాం.’’ అని అన్నారు.


పేదల బియ్యాన్ని పందికొక్కుల్లా తింటారా? - సోము వీర్రాజు
‘‘రేషన్ బియ్యం ఇవ్వకుండా జగన్ మోసం చేస్తున్నారు. పేదలకు కేంద్రం ఇచ్చిన బియ్యం జగన్ పంపిణీ చేయడం లేదు. లక్షా నలభై వేల కార్డులు జగన్ ఇష్టం వచ్చినట్లు ఇచ్చారు. కేంద్రం గైడ్ లైన్స్ ను పరిగణలోకి తీసుకున్నారా? వీరిలో యాభై లక్షల మందికి అసలు బియ్యం అవసరం లేదు. వీటిని రీసైక్లింగ్ చేసి అమ్ముకుంటున్నారు. కాకినాడ కేంద్రంగా బియ్యం అక్రమ రవాణా సాగుతుంది. ఇతర దేశానికి ఇక్కడ నుంచే భారీగా వెళుతుందని చెప్పడం విశేషం. బియ్యం కుంభకోణంపై వాస్తవాలు ప్రజలకు‌ వివరిస్తాం. పేదలు తినే బియ్యాన్ని పందికొక్కుల్లా తింటారా? వీటి వెనుక ఉన్న అందరి‌ బాగోతాలు బయట పెడతాం’’ అని సోము హెచ్చరించారు.