జూనియర్ డాక్టర్ల స్టైపండును ఇకపై ప్రతి ఏడాది సవరించే విధానాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒకే చేసింది. ఇంటర్న్‌షిప్ చేసేవారికి ఈ ఏడాది జనవరి 1 నుంచి 5 శాతం పెంపుతో పాటు  ప్రతి ఏడాది 3 శాతం చొప్పున పెంచాలని భావిస్తోంది. అయితే పీజీ, సూపర్ స్పెషాలిటీ పోస్ట్ గ్రాడ్యుయేట్ వైద్య విద్యార్థులకు ప్రస్తుతం చెల్లిస్తున్న స్టైపండ్​ ప్రతి ఏడాది 3 శాతం చొప్పున పెంచాలని నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రెండేళ్లకు ఒకసారి సవరిస్తుంగా.. అందుకు బదులుగా ప్రతి ఏటా పీజీలకు 3 శాతం, ఇంటర్నీలకు 5శాతం చొప్పున పెంపు వర్తిస్తుందని స్పష్టం చేసింది. కానీ తమకు 15 శాతం పెంచాలని జూనియర్ డాక్టర్లు ఆందోళన కొనసాగిస్తున్నారు. మరి జూనియర్ డాక్టర్ల స్టైఫండ్ విషయంలో - ప్రభుత్వం అన్యాయం చేస్తుందా? అసలు వాస్తవాలు ఇక్కడ తెలుసుకోండి. 

Continues below advertisement

మీ స్టైఫండ్ పెంపు కోసం మీరు చేస్తున్న పోరాటం పట్ల గౌరవం ఉంది. అయితే ఈ విషయంలో గత 25 సంవత్సరాల జీవోలు, ప్రభుత్వ నిర్ణయాలు ఒకసారి పూర్తిగా స్టడీ చేస్తే మీకే అర్థమవుతుందని, ప్రభుత్వం ఇచ్చిన ఆఫర్  అన్యాయం కాదు అని ఏపీ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్. పిడకాల. శ్యాంసుందర్ పేర్కొన్నారు. 

1. 2000 సంవత్సరానికి ముందు పరిస్థితి ఎలా ఉండేది.

Continues below advertisement

జూనియర్ డాక్టర్లకు స్టైఫండ్ అనేది చాలా నామమాత్రంగా ఉండేది. అతి తక్కువ మొత్తం ఇచ్చేవారు.

2. 2000 సంవత్సరంలో పెంపు తర్వాత ఏమైంది.

2000 లో స్టైఫండ్లు పెంచిన తర్వాత కూడా హౌస్ సర్జన్ ల నుండి ఫైనల్ ఇయర్ PG వరకు కేవలం రూ. 1000 నుండి రూ. 3500 మధ్యలో మాత్రమే ఉండేది.

3. 2009 నాటి పరిస్థితి - అసలు సమస్య మొదలైంది ఇక్కడే..

2009 నాటికి హౌస్ సర్జన్ ల నుండి ఫైనల్ ఇయర్ PG లకు రూ. 5000 నుండి రూ. 9000 మధ్య స్టైఫండ్ ఉండేది. అప్పుడు రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉండేది.

అప్పుడు రాష్ట్ర విభజన ఆందోళనలతో రాష్ట్రం అతలాకుతలంగా ఉన్న సమయంలో, జూనియర్ డాక్టర్ల సమ్మె కూడా జరగడంతో, అప్పటి ప్రభుత్వం ఒక ఒప్పందానికి వచ్చింది.

2009 ఒప్పందంలోని కీలక అంశాలు:- జూనియర్ డాక్టర్స్ JAC, రాష్ట్ర ప్రభుత్వం మధ్య కుదిరిన ఒప్పందం.- 2008 జనవరి నుంచి ఏరియర్స్ తో సహా స్టైఫండ్ ఇవ్వడం.- ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి 15% పెంచుతామని హామీ.- అతి ముఖ్యమైన పాయింట్ - ఈ ఒప్పందం 2012 జనవరి నుండి మొదలై 6 సంవత్సరాల పాటు అంటే 2017 వరకు మాత్రమే ఉంటుందని స్పష్టంగా పేర్కొన్నారు. ఆ ప్రకారంగానే 2009 నుండి జీవోలు విడుదలయ్యాయి.

4. 2017 తో ఒప్పందం ముగిసినా, ప్రభుత్వం 2025 వరకు ఎలా కొనసాగించింది?

ఈ ఒప్పందం ప్రకారం 6 సంవత్సరాలు అంటే 2012 నుంచి 2017 వరకు మాత్రమే ఉంది. అయినప్పటికీ, ప్రతిసారి జూనియర్ డాక్టర్ల అభ్యర్థన మేరకు, ఏదో ఒక కారణంతో ఆ 6 సంవత్సరాల ఒప్పందాన్ని పక్కనపెట్టి, 2009 లో ఇచ్చిన జీవో ప్రకారంగానే 15 శాతం పెంచుతూ ఇప్పటివరకు 2025 వరకు అంటే సుమారు 8 సంవత్సరాలు అదనంగా పెంచుకుంటూ వచ్చారు. 

5. 2022 లో రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు సమీక్షించాల్సి వచ్చింది?

2022 లో ఈ 15 శాతం పెంపు అనే దానిపై పాత జీవోలపై ప్రభుత్వం ఒక సమీక్ష నిర్వహించింది. ఎందుకంటే ఇలా పెంచుకుంటూ పోతే జూనియర్ డాక్టర్ల స్టైఫండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ప్రొఫెసర్ల జీతాలను మించి దాటిపోతుందని గ్రహించారు. అందుకే దేశంలో మిగతా రాష్ట్రాల్లో ఎలా ఇస్తున్నారో పరిశీలించాలని నిర్ణయం తీసుకున్నారు.

సమీక్షలో తేలిన నిజాలివే.. చాలా రాష్ట్రాల్లో ఏపీ కంటే తక్కువగాను, కొన్ని రాష్ట్రాల్లో సమానంగాను, కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే ఎక్కువగా ఉంందని గ్రహించారు.

6. తమిళనాడు మోడల్ ను ఆదర్శంగా ఎందుకు తీసుకున్నారు?

ఏదో ఒక ప్రాతిపదికన ఉండాలి కాబట్టి, దేశంలో హెల్త్ సెక్టార్ ఎక్కడైతే నెంబర్-1 గా ఉందో, బాగా పనిచేస్తుందో ఆ రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకోవాలని నిర్ణయించారు. దేశంలోనే అత్యున్నత స్థానంలో తమిళనాడు రాష్ట్రం ఉంది. వాళ్ళు ఇస్తున్న విధానాన్ని పరిశీలించగా, వాళ్ళు ప్రస్తుతం ఏపీ ఇస్తున్న దానికన్నా చాలా తక్కువగా స్టైఫండ్ ఇస్తున్నారు. అలాగే  ఏడాదికి ఒకసారి కేవలం 3% చొప్పున మాత్రమే పెంచుతున్నారు.

7. ప్రభుత్వం అలా చేస్తే ఏమయ్యేది. 

అప్పుడు ఏపీ ప్రభుత్వం ఆలోచించి, తమిళనాడును ఆదర్శంగా తీసుకుంటే జూనియర్ డాక్టర్లకు ఇప్పుడున్న స్టైఫండ్ కన్నా చాలా తక్కువగా ఇవ్వాల్సి ఉంటుంది.

కానీ ప్రభుత్వం ఉదారంగా వ్యవహరించి, తమిళనాడులో ఉన్నట్లు తక్కువగా మన వాళ్ళకి ఇవ్వకుండా, తగ్గించకుండా, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అధిక స్టైఫండ్ ను ( హౌస్ సర్జన్లకు రూ. 25906/ ;   పీజీలకు రూ. 60823/  -  రూ.64767/  ; సూపర్ స్పాషాలిటీ రూ. 80500/  - రూ. 85100/ యథాతథంగా కొనసాగిస్తూనే, ఈ ఇస్తున్న దానిపైనే ఇకపై తమిళనాడులో ఇస్తున్నట్లుగా ప్రతి సంవత్సరం 3 శాతం పెంచుతామని నిర్ణయించింది.

ఈ విషయాలన్నీ తెలియజేస్తూ 2022 లోనే ఒక మెమో / GO ద్వారా ఇకపై 3 శాతం మాత్రమే పెంచుతామని తెలియజేశారు. ఈ విషయం జూనియర్ డాక్టర్లకు తెలిసిందే. 

8. మరి ఇప్పుడు జరుగుతున్న సమ్మె న్యాయమేనా ?

 ఇప్పుడు మన జూనియర్ డాక్టర్లు దానికి ససేమిరా అంటూ మొండి పట్టుదలకు పోయి 15% కాదు 30 % కావాలంటూ డిమాండ్‌తో సమ్మె చేస్తూ.. ఇప్పుడు 20 శాతం అయినా ఇమ్మంటూ పేషెంట్లను ఇబ్బందికి గురి చేస్తూ, ఎమర్జెన్సీ సర్వీసులను కూడా బంద్ చేయడం ప్రజా వ్యతిరేక చర్య.

9. సీనియర్ డాక్టర్లు, IMA పాత్ర ఏంటీ..

అయితే ఈ విషయాలు ఏమీ తెలియకుండా కొంతమంది సీనియర్ డాక్టర్లు వాళ్లకు మద్దతు తెలియజేస్తూ, జూనియర్ డాక్టర్లను మరింత రెచ్చగొడుతున్నారు. అలాగే IMA సైతం కనీసం పేషెంట్ల ఇబ్బందులను పరిగణలోకి తీసుకోకుండా వారికి మద్దతు తెలపడాన్ని ఖండించాల్సి వస్తుంది.

10. నా విజ్ఞప్తి ఏంటంటే..

నాయకులు న్యాయం వైపు ఉండి నిజాయితీగా సభ్యులను నడిపించాలి. వారికి ఉపయోగపడే పనులు చేయాలి గానీ, మన స్వార్థం కోసం వారిని రెచ్చగొట్టడం సరికాదు. ప్రజలందరికీ న్యాయం చేసేలా ప్రభుత్వం కొన్ని పాలసీ డెసిషన్లతో ముందుకు వెళుతూ ఉంటుంది. దానిని ప్రశ్నించే అధికారం మనకు ఉండదు. అయితే వాటి వల్ల ప్రజలకు నష్టం కలుగుతున్నప్పుడు ప్రశ్నించే విధానంలో ప్రశ్నించాలి గానీ ఉద్యమాలతో పేద రోగులకు, ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే కనుక అది ప్రజా వ్యతిరేక చర్య అవుతుంది.

అయినప్పటికీ ఎంత చెబుతున్నా మొండి పట్టుదలతో ఉంటే ఏ ప్రభుత్వానికైనా, ప్రభుత్వాధికారులకైనా విసుగు రాకుండా ఉంటుందా..

కాబట్టి మిత్రులారా, ఒకసారి ఆలోచించండి. అధికారులు గానీ, ప్రభుత్వం గానీ ఇంతకన్నా న్యాయం ఎలా చేయగలరు? అర్థం చేసుకోండి. ప్రజలు, పేషెంట్ల ఇబ్బందులను కూడా దృష్టిలో పెట్టుకొని జూనియర్ డాక్టర్లు కనీసం ఇప్పటికైనా విషయం గ్రహించాలి. సెప్టెంబర్ లో పీజీ ఫైనల్ పరీక్షలు , నీట్ పీజీ పరీక్ష రాస్తున్న వారిని దృష్టిలో పెట్టుకొని ఎంతో కొంతకు ప్రభుత్వంతో సాధ్యమైనంత త్వరగా ఒప్పందం కుదుర్చుకుని సమ్మె విరమిస్తారని డాక్టర్. పిడకాల. శ్యాంసుందర్ విజ్ఞప్తి చేశారు.