Amaravati: ఆంధ్రప్రదేశ్‌ తెలంగాణను అనుసంధానిస్తూ మరో రహదారి నిర్మాణానికి కనెక్టివిటీని మరింత సులభతరం చేసే పనిలో కేంద్రం ఉంది. కొత్తగా నిర్మిస్తున్న ఫోర్త్ సిటీ నుంచి అమరావతికి నేరుగా వెళ్లేలా జాతీయ రహదారి నిర్మాణానికి గ్రీన్‌సిగ్నల్ వచ్చినట్టు సమాచారం. ఈ రహదారితోపాటు డ్రైపోర్టు పోర్టు కోసం ప్రత్యేకంగా రైలు మార్గానికి కూడా ప్రతిపాదనలు సిద్ధం చేసింది. 

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతికి తెలంగాణ రాజధానికి మధ్య మరో జాతీయ రహదారి రానుంది. ఇప్పటికే ఉన్న విజయవాడ, హైదరాబాద్‌హైవేను విస్తరిస్తున్నారు. ఈ పనులు సాగుతున్న టైంలోనే కేంద్రం మరో గుడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్‌లో కొత్త నిర్మించబోతున్న ఫోర్త్ సిటీకి, అమరావతికి అనుసంధానించేలా రహదారి నిర్మాణం జరగనుంది. 

ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టంలో అపరిష్కృతంగా ఉన్న పనులపై ఈ మధ్య కాలంలో ఇరు రాష్ట్రాల సీఎస్‌లతో కేంద్రం చర్చలు జరిపింది. కేంద్ర హోంశాఖ జరిపిన చర్చల సందర్భంగా కీల విషయాలపై సుదీర్ఘంగా చర్చ జరిగి గ్రీన్‌సిగ్నల్ వచ్చింది. అందులో ఒకటి హైదరాబాద్, అమరావతి మధ్య జాతీయ రహదారి.  

హైదరాబాద్‌ను ఆంధ్రప్రదేశ్‌తో కలుపుతు 65వ నెంబర్ జాతీయ రహదారి ఉంది. దీని విస్తరణ పనులు చాలా వేగంగా సాగుతున్నాయి. దానికి సమాంతరంగానే కాస్త దూరంలో అమరావతి, హైదరాబాద్‌ను కలుపుతూ జాతీయ రహదారి నిర్మాణానికి అంగీకరించారు. డీపీఆర్ తయారికి కూడా కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. 

కొత్త నిర్మించబోయే జాతీయ రహదారి మాత్రం ఫోర్త్‌ సిటీని అమరావతిని కలిపితే ఎలా ఉంటుందని తెలంగాణ ప్రభుత్వం కొత్త ప్రతిపాదనచేస్తోంది. ఇప్పటికే హైదరాబాద్‌ విజయవాడ మధ్య రహదారి ఉన్నందున కొత్తగా నిర్మితమవుతున్న రెండు సిటీల మధ్య నిర్మాణం చేపట్టాలని భావిస్తోంది. ఇదే విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెప్పింది. ఇంకా అక్కడి నుంచి రిప్లై రాలేదు. దాని కోసం తెలంగాణ ప్రభుత్వం ఎదురు చూస్తోంది.